Others

ఆ ఉపన్యాసాలు.. అమూల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నారెడ్డికి ఒకరు రాసిచ్చిన ఉపన్యాసం చదివే అలవాటు ఏనాడూ లేదు. ఏ సభలోనైనా కనీసం గంటకు తక్కువ లేకుండా, ఆశువుగా.. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగుల్లో అనర్గళంగా మాట్లాడేవారు. ప్రతి ఉపన్యాసంలోని అంశాలు పది కాలాలపాటు పదిలంగా దాచుకోతగినంత విలువైనవి. ఆయన ప్రసంగాలను ఆడియో రికార్డు చేయించి (అప్పట్లో వీడియోలు ప్రాచుర్యం పొందలేదు) తర్జుమా చేయించి టైప్ చేయించాము. విలువైన ఆయన ఉపన్యాసాలన్నీ సమాచార, పౌర సంబంధాల శాఖలో బహుశా ఉండొచ్చు. కొన్నింటి కాపీలు నేను భద్రపరచుకున్నాను ఇప్పటికీ. తన అనుభవాల, జ్ఞాపకాల సారాంశం రంగరించి ఉపన్యాసాల్లో వర్తమాన పరిస్థితులకు అన్వయించి చెప్పేవారు చెన్నారెడ్డి. తాను డాక్టర్ అయినా మంత్రిగా ఆరోగ్యశాఖ కోరుకోకపోవడానికి కారణం- తనకు చదువు చెప్పిన అధ్యాపకులు ఇంకా పనిచేస్తుండగానే, వారికి మంత్రిగా వుండడం సమంజసం కాదని ఆయన భావించడమే. బాబూ రాజేంద్రప్రసాద్ పేరిట వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్న హిమాయత్‌సాగర్ ప్రాంతాన్ని ‘రాజేంద్రనగర్’గా తనే మార్చిన విషయం ఓ సందర్భంలో చెప్పారు. ప్రముఖ తెలంగాణ వాది, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ అడ్వొకేట్, 86 ఏళ్ల బొగ్గారపు సీతారామయ్య ‘యాన్ ఎజెండా ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో చెన్నారెడ్డి ఉపన్యాసాలను పుస్తకంగా ప్రచురించారు.
లౌక్యంలో చెన్నారెడ్డిది అరుదైన శైలి. 1990 మేలో ‘బ్లిట్జ్’ ఆంగ్ల వార పత్రికలో జర్నలిస్ట్ సాయినాథ్ చెన్నారెడ్డితో చేసిన ఇంటర్వ్యూ వచ్చింది. ఆ నెల మొదటి తేదీన నిజామాబాద్ జిల్లా సిరికొండలో చెన్నారెడ్డిని సాయినాథ్ ఇంటర్వ్యూ చేసినపుడు నేను పక్కనే ఉన్నాను. మారుమూల గ్రామాల అభివృద్ధి కార్యక్రమాన్ని నక్సలైట్ ప్రాబల్యమున్న ఆ గ్రామంలో ప్రారంభించడానికి అక్కడకు వెళ్లిన ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ అది. ఢిల్లీలోని ‘రాజకీయేతర కాంగ్రెస్ ముఠా నాయకులకు’ చెన్నారెడ్డి హెచ్చరిక చేసినట్లు, జాతీయ స్థాయిలో అలాంటి నాయకుల వైఫల్యం మూలానే్న ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయ న అన్నట్లు- కొన్ని వివాదాస్పదమైన అంశాలున్నాయి అందులో. చెన్నారెడ్డి, శరద్ పవార్, వీరేంద్ర పాటిల్ ‘తెలుగుగంగ’ పేరుతో తిరుపతిలో సమామేశమై, రాజీవ్ గాంధీ కి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వచ్చింది. తాను చెప్పని ఆ విషయాలు ‘బ్లిట్జ్’లో రావడంతో కంగారుపడుతూ ఆయన దృష్టికి తెచ్చినపుడు, ‘అలా ఎవరైనా అనుకుంటే ఫర్వాలేదు’ అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. బుద్ధుడి విగ్రహం ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో పడిపోయినపుడు, అంతవరకు దాని కోసం జరిగిన వ్యయం, నీళ్లలోంచి విగ్రహం తీస్తే కాబోయే అదనపు వ్యయం, పదే పదే చెప్పేవారే కాని ఏం చెయ్యబోతున్నారో ఎప్పుడూ చెప్పలేదు.
సీఎం చెన్నారెడ్డి దగ్గర నేను పీఆర్వోగా చేరిన తొలినాళ్లలోనే ఒక ఇబ్బందికి గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నాకు అంతకుముందు ఎక్కడా పిఆర్‌ఓగా పనిచేసిన అనుభవం లేదు. పోనీ జర్నలిస్టుగా పనిచేశానా? అంటే అది కూడా లేనట్లే. ఏదో అడపాదడపా ‘లెటర్స్ టు ద ఎడిటర్’కు రాయడమో లేదా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో తాత్కాలిక ప్రాతిపదికపైన వార్తా విభాగంలో పనిచేయడమో తప్ప పెద్దగా అనుభవం లేనివాడిని. ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవడం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఒకనాడు డిజిపి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. చెన్నారెడ్డి సీఎం హోదాలో హాజరయ్యారు. నాకు గుర్తున్నంతవరకు సుశీల్‌కుమార్ మాథుర్ అప్పట్లో డిజిపి. సమావేశం బాగానే జరిగినా, ఎందుకో సీఎంకు కోపమొచ్చింది. ఇంటికి వస్తూనే సుమారు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో, ఎదురుగా కన్పించిన నాతో తక్షణమే డిజిపిని వివరణ కోరాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని అన్నారు. నేను యథాలాపంగా ‘సరే’ అన్నాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం సీఎం కార్యదర్శి, ఐఏఎస్ అధికారి పరమహంసకు చెప్పాను. ఆయన తాను చూసుకుంటానని, నన్ను మరచిపొమ్మని అన్నాడు.
మరచిపోయే అవకాశం లేకుండానే, ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు ‘జ్వాలా.. ఏమైంది? డీజీపీ విషయం ఏం చేశావు?’అని అడిగారు చెన్నారెడ్డి. పక్కనే వున్న పరమహంసను చూపిస్తూ- ‘సార్.. పరమహంసకి చెప్పాను. ఆయన చూసుకుంటానన్నాడు’ అనగానే సీఎంకు కోపమొచ్చింది. ‘ఏమయ్యా! నువ్వు నాకా, పరమహంసకా పీఆర్వోవి?’అని అడిగారు. అందరిలా నేను ప్రభుత్వోద్యోగిని కాదనీ, వాళ్లలాగా వుండకూడదనీ, ఒకసారి తానొకమాట చెప్తే అది వేద వాక్యంలా, జీవోలా అమలుకావాలనీ, భయపడవద్దనీ హితవు పలికారు. బహుశా అప్పటినుండి నేనక్కడ పనిచేసినంతకాలం నా దృక్పథంలో మార్పువచ్చింది. ధైర్యంగా పనిచేయగలిగాను.
ఒకసారి, ఆయన ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయా. కారులో ఆయన వెంట పోతూ అడిగాను ఆ విషయమే. ఆయన జవాబు చెప్పలేదు. ఆ సాయంత్రం జరిగిన ఒక సభలో ఇతర విషయాలతోపాటు, ఆ పథకం గురించి చాలా వివరంగా అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడారు. నేను కూడా అంతా విన్నా. తిరుగుప్రయాణంలో ఆ విషయం ప్రస్తావించి, ‘అర్థమైందా?’ అని ఆయన ప్రశ్నించారు. అదీ ఆయన పనితీరు. తనదగ్గర పనిచేసే వారికే తన ఆలోచనా ధోరణి అర్థం కాకపోతే, ఇతరులకు ఎలా అర్థమవుతుంది? అని అలా సభాముఖంగా వివరించానన్నారు.
చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేస్తున్న ఒక సీనియర్ మంత్రి (స్వర్గీయ కోనేరు రంగారావు)పై అవినీతి ఆరోపణలొచ్చాయి. చెన్నారెడ్డి సీఎం అయిన రెండునెలలకే అది జరిగింది. ఆరోపణలు చేసినవారు బలమైన సాక్ష్యాధారాలున్నట్లు చెప్పారు. తనకు చెడ్డపేరు రాకుండా చూసుకోవాలనుకున్న చెన్నారెడ్డి ఏం చేయాలన్న విషయమై సందిగ్ధంలో పడ్డారు. బహుశా తాను అడగదల్చుకున్న వారందరినీ సలహాలు అడిగి వుండొచ్చు. ఆయన వద్ద పనిచేస్తున్న మావంతు కూడా వచ్చింది. ఫిబ్రవరి 6, 1990 రాత్రి పదకొండు గంటల సమయంలో సీఎం నుంచి ఫోన్ వచ్చింది. ‘ఆ మంత్రి విషయంలో ఏం చేస్తే బాగుంటుంద’ని ఆయన ప్రశ్నించారు. ‘మీరు ఎలాచేస్తే బాగుంటుందనుకుంటే అలానే చేయమ’ని బుద్ధిగా సమాధానం ఇచ్చా. అన్నీ తాను అనుకున్నట్లే చేయడానికి ఎందుకింత మంది వ్యక్తిగత సిబ్బంది అని.. మరో ప్రశ్న. ఆయన మనసులోమాట అర్థం చేసుకుని చెప్పాల్సింది చెప్పడం, అదెలా అమలు పర్చాలని ఆయన అడగడం, ఆ బాధ్యత నెత్తినవేసుకోవడం, ఆ మంత్రి మర్నాడు రాజీనామా చేయడం జరిగింది. అదీ ఆయన లౌక్యం.
*
(మిగతా రేపటి సంచికలో)
*
(డా. మర్రి చెన్నారెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
*
-వనం జ్వాలా నరసింహారావు
(మాజీ పీఆర్వో టు సీఎం చెన్నారెడ్డి)