Others

విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యను ఆర్జించే వయసులోనే యువతీ యువకులలో సేవాభావం, దేశభక్తి, సామాజిక స్పృహ ను కలిగించేందుకు ‘జాతీయ సేవా పథకం’ (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభమైంది. నిరుపేదల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, సమాజ సేవ చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24వ తేదీన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు. అప్పటి ‘విశ్వవిద్యాలయాల నిధుల సంఘం’ (యూజీసీ) చైర్మన్ రాధాకృష్ణన్ జాతీయ సేవా పథకాన్ని విద్యాసంస్థలలో ప్రారంభించాలని సూచించారు. 1959 జనవరిలో జరిగిన సీఏబీఈ పాలకమండలి ఆయన సూచనకు ఆమోదం తెలిపింది. 1952లో పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించబడి, 4వ పంచవర్ష ప్రణాళికలో ప్లానింగ్ కమిషనర్ ద్వారా 5కోట్ల రూపాయలను ఎన్‌ఎస్‌ఎస్ పథకానికి కేటాయించారు.
1958లో అప్పటి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ దేశంలోని ముఖ్యమంత్రులకు జాతీయ సేవా పథకాన్ని అమలు చేయాలంటూ లేఖలు రాశారు. ఈ పథకానికి తగిన వ్యూహ రచన చేయాలని కూడా ఆయన కేంద్ర విద్యాశాఖను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 37 విశ్వ విద్యాలయాలలో సుమారు 40,000 మంది వాలంటీర్లతో అప్పటి కేంద్ర విద్యాశాఖామాత్యులు వి.కె.ఆర్.రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 1999 నాటికి ఈ పథకంలో 13,52,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 176 విశ్వవిద్యాలయాల పరిధిలో లక్షలాది మంది విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌లో సేవలందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లను కళాశాల స్థాయిలో ప్రారంభించారు. లక్షలాది మంది వాలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములవుతున్నారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాల అమలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకనాడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఒకవైపు విద్యా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు సంఘసేవకు విద్యార్థులను సమాయాత్తపరచేదే జాతీయ సేవా పథకం. సామాజిక కార్యక్రమాలపై యువతకు తర్ఫీదునివ్వడమే గాక, వారి సేవలను వినియోగించుకోవడం ఎన్‌ఎస్‌ఎస్‌లో కనిపిస్తుంది. కళాశాల స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలకు ప్రిన్సిపాల్ పర్యవేక్షకుడిగా, ఒక అధ్యాపకుడు ప్రోగ్రాం అధికారిగా వ్యవహరిస్తారు. సమాజ సేవ పట్ల ఆసక్తి చూపే విద్యార్థులను ఇందులో చేర్చుకుంటూ, ప్రతి వందమంది విద్యార్థులను ఒక యూనిట్‌గా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూంటారు. రెండు విద్యా సంవత్సరాలలో కనీసం 240 గంటలు సంఘసేవలో పాల్గొనేలా కృషి జరుగుతోంది. భావితరాలకు వారసులైన విద్యార్థులు జట్లుగా పనిచేస్తూ ఐక్యతా భావాన్ని పంచుకుంటారు. సమాజంలో విద్యార్థి తన స్థానాన్ని, గమ్యాన్ని నిర్ణయించుకొనేలా చేయడం ఇందులోని ప్రధాన అంశం. విద్యార్థులు చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో సామాజిక సేవలో పాల్గొనేలా చేయడమే జాతీయ సేవా పథకం ప్రధాన ధ్వేయం. కళాశాల ప్రిన్సిపాల్ నిర్ణయించిన ప్రకారం సమీప ప్రదేశాల్లో ఆలయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రతను తొలగించడం, మంచినీటి సౌకర్యాల మెరుగుదలకు శ్రమదానం, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలలో నిర్వహిస్తుంటారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి వసతులను గ్రామస్తుల సహకారంతో మెరుగుపరచేందుకు విద్యార్థులు కృషి చేస్తారు.
రక్తదానం, ఉత్సవాలలో స్వచ్ఛంద సేవ, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు విరాళాలు సేకరించి తగు సహాయ సహకారాలను అందించడం కూడా ఎన్‌ఎస్‌ఎస్ సేవా కార్యక్రమాలుగా ఉన్నాయి. అక్షరాస్యతా కార్యక్రమాల అమలులో భాగస్వాములు కావడం, ఆరోగ్య సూత్రాలను బోధించడం, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలను చైతన్య పరచడం వంటి కార్యక్రమాల్లోనూ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారు.
ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా విశ్వవిద్యాలయాలు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాయి. ఉద్యోగ నియామకాలు, ఇతర సందర్భాల్లో ఈ సర్ట్ఫికెట్లకు విలువ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, మిలటరీ, నర్సింగ్ సర్వీసులలో, పోలీసు, టెలికాం, సమాచార వ్యవస్థ తదితర విభాగాల్లో నియామకాల సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ సర్ట్ఫికెట్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
‘నా కోసం కాదు, నీ కోసమే..’ అనే దీక్షా నినాదంతో- సేవలు అందించడమే ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల లక్ష్యం. యువతలో సామాజిక స్పృహను కల్పిస్తూ, వారిని సేవాభావంతో ముందుకు నడిపించడం నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి. ఈ లక్ష్యంతో ఏర్పాటైన జాతీయ సేవా పథకం ఎంతోమంది విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ పథకంలో చేరిన వారు క్రమశిక్షణ, సామాజిక చైతన్యం కలిగి జీవితంలో ముందుకు రాణించే అవకాశం ఉంది.
(రేపు ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవం)

-సంగనభట్ల రామకిష్టయ్య