పర్యాటకం

బల్కంపేట ఎల్లమ్మ సర్వశుభకారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ క్తిస్వరూపిణి పాదపద్మంలోని రేణువును సంపాదించుకుని బ్రహ్మదేవుడు ఈ సమస్త సృష్టిని చేస్తుండగా సృష్టి రూపాన్ని ధరించిన ఆ కణమును శ్రీ మహావిష్ణువు ఎలాగో మోస్తూ ఉండగా...శివుడు చిన్న నలుసువంటి ఆ విశ్వమును లయకాలముతో నలిచి..ఆ భస్మాన్ని విభూదిగా తన శరీరానికి రాసుకుంటూ ఉన్నాడు..’ అని ఆ జగన్మాతను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులవారు సౌందర్యలహరిలో పేర్కొన్నారు. సృష్టి, స్థితి, లయలు సాగడం వెనక ఆ జగన్మాత దాగి ఉంది. అటువంటి అమ్మలు గన్న యమ్మ వివిధ పేర్లతో వివిధ రూపాలతో, వివిధ ప్రాంతాల్లో కొలువుతీరి ఆర్తితో తనను నమ్మి కొలిచిన భక్తుల పాలిట కల్పతరువై కాపాడుతు ఉంది. అటువంటి ఆ తల్లి శ్రీ ఎల్లమ్మ పేరుతో హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో కొలువుతీరి దర్శించి...తీర్థం స్వీకరించినంతనే సకల శుభాలను ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొంది ఆరాధనలందుకుంటూ ఉంది.
హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో ప్రధాన రహదారి పక్కనే శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు కొలువుతీరడం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణగాధ ప్రచారంలో ఉంది. పూర్వం బల్కంపేట ప్రాంతం ఒక చిన్న గ్రామం.ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసుకుని జీవిస్తుండేవారు. అటువంటి బల్కంపేట గ్రామంలో ఒకసారి ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసేందుకు నీటి కోసం బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒక శుభ ముహుర్తం చూసుకుని పూజా కార్యక్రమాలను చేసి బావిని తవ్వించడం ప్రారంభించాడు. కూలీలు రోజూ బావిని తవ్వసాగారు. ఒకరోజు బావిని తవ్వుతుండగా ఒక రాయి అడ్డుపడింది. మట్టిని తొలగించి ఆరాయిని పరిశీలించగా ఆ రాయిలో అమ్మవారి రూపు కనిపించింది. దీనితో రైతు ఆ విగ్రహాన్ని బావిలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నం చేసాడు. అయితే అవన్నీ విఫలం అయ్యాయి. విగ్రహాన్ని బయటకు తీసి గ్రామానికి తీసుకు వెళ్లాలని రైతు ప్రయత్నం ఫలించకపోవడంతో రైతు గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని గ్రామస్థులకు వివరించాడు. గ్రామస్థులు అందరూ అక్కడికి వచ్చి విగ్రహాన్ని దర్శించి, పూజలు చేసారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన శివారాధకులు అయిన మహిళలు (శివసత్తులు) అమ్మవారు ఇక్కడే స్వయంభువుగా వెలిశారు. ఆమె ఇలాగే ఉండి పూజలు అందుకోవాలని కోరుకుంటూ ఉంది. అమ్మవారిని ఇక్కడనుంచి కదిలించే ప్రయత్నం చేయవద్దు. ఇలాగేఉంచి పూజలు చేయండి అని పలికారు. అంతేకాకుండా అమ్మవారు ‘రేణుకా మాత ఎల్లమ్మ తల్లి’ అని వారు చెప్పారు. దీంతో రైతు తన పొలంలో అమ్మవారు బయటపడడం అదృష్టంగా భావించాడు. గ్రామస్థుల సహకారంతో చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. తర్వాత నగరం విస్తరించడంతో ప్రస్తుతం బల్కంపేట హైదరాబాద్ నగరంలో భాగమైంది. ఈ విధంగా శ్రీ ఎల్లమ్మతల్లి బల్కంపేట ప్రాంతంలో స్వయభువుగా కొలువుతీరినట్టు స్థలపురాణం వెల్లడిస్తూ ఉంది.
బల్కంపేటలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంది. ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై గోపురం నిర్మించబడి ఉంది. ఐదు అంతస్థులు కలిగిన ఈ గోపురం పైభాగంలో ఐదు గోపుర కలశాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. గోపురంపై అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ గోపుర ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తునే ప్రధాన ఆలయం దర్శనిమిస్తుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజ స్థంభం ప్రతిష్టింబడి ఉంది. ఆలయ ప్రాకారాన్ని ఆనుకుని ఆలయం లోపల ఆలయం చుట్టు ప్రాకార మండపం ఉంది. ఈ ప్రాకర మండపం అద్భుతమైన చిత్రలేఖనం ఉన్న స్తంభాలతో నయనానందకరంగా దర్శనమిస్తుంది. ప్రాకార మండపంలోని గోడలపై జగన్మాత వివిధ రూపాలలో వున్న తైలవర్ణ చిత్రాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ప్రధాన ఆలయం మహామండపం, ముఖ మండపం గర్భాలయాలను కలిగి ఉంది. మహా మండపం కంటే ముఖ మండపం, గర్భాలయాలు లోతుగా ఉన్నాయి. కొన్ని మెట్లను దిగి గర్భాలయం వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తిరిగి మెట్ల ద్వారం ద్వారా భక్తులు మహామండపం చేరుకుంటారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ వినాయకుడిని ముందుగా దర్శించుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి వెడతారు. ఇక ప్రధాన గర్భాలయంలో శ్రీ ఎల్లమ్మ తల్లి వివిధ ఆయుధాలను చేతులతో ధరించి ఆభరణాలు, పుష్పమాలలు ధరించి, భక్తులపై కరుణా కటాక్షాలను ప్రసరింప చేస్తు దర్శనమిస్తుంది. కాగా అమ్మవారి మూల విరాట్టుకు ముందువైపు శయన భంగిమలో మరో మూర్తి దర్శనమిస్తుంది. వాస్తవంగా స్వయంభువుగా కొలువుతీరిన అమ్మవారు ఈమె. శయనామూర్తి, తర్వాతి కాలంలో మూలవిరాట్టును ప్రతిష్టించారు. అమ్మవారి భక్తులు శ్రీ ఎల్లమ్మ, శ్రీ రేణుకా దేవి, శ్రీరేణుకా ఎల్లమ్మ తల్లి వంటి పేర్లతో పూజిస్తారు. కాగా అమ్మవారు ‘జలాధి వాసిని’. అంటే జలాన్ని ఆవాసంగా చేసుకున్న అమ్మవారు. అమ్మవారి తలవద్ద బావి ఉంది. ఆ బావినుంచి ఎప్పుడూ నీరు వస్తుంటుంది. అందుకే అమ్మవారు జలాధివాసిని అయింది. ఈ జలాన్ని భక్తులు తీర్ధంగా స్వీకరిస్తారు. ఇక్కడ ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులు బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలనుంచి బల్కంపేటకు సిటీ బస్సులు ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌కు చేరుకుని బల్కంపేట వెళ్లడం సులభతరం. సర్వ శుభాలను ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ తల్లిని దర్శించి భక్తులు తరించవచ్చు.

-ఐఎల్‌ఎన్ చంద్రశేఖర్