మెయన్ ఫీచర్

తెలుగు చంద్రుల తప్పటడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత తెలివిగలవారైనా ఒక్కోసారి తప్పులు చేస్తుంటారు. అపరచాణక్యులుగా పేరున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులయిన చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు ఇటీవలి కాలంలో వేసిన అడుగులు చూసిన వారికి, వెంటనే ఇలాంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. తెలంగాణలో కోదండరామ్, ఏపిలో ముద్రగడ రోడ్డెక్కిన వైనానికి తెలుగు చంద్రుల తొందరపాటుతనమే కారణమనిపిస్తుంది.
తెలంగాణ పేరు గుర్తుకువస్తే మొదట ఇద్దరి పేర్లే గుర్తుకువస్తాయి. ఒకరు కేసీఆర్, మరొకరు కోదండరామ్. తెలంగాణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్లడంలో, కోదండరామ్ పాత్ర తిరుగులేనిదన్నది మనం మనుషులం అన్నంత నిజం. స్వయంగా కేసీఆరే మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కోదండరామ్ ప్రతీక అని ప్రశంసించిన వైనాన్ని ఇప్పుడు టీఆర్‌ఎస్ నేతలు విస్మరించినా, అది తెలంగాణ ప్రజల స్మృతిపథం నుంచి వైదొలగలేదు.
అలాంటి మాస్టారుపై తెరాస మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడి దాడి చేసిన తీరు, సగటు తెలంగాణవాదిని గాయపరిచింది. పైగా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు చెప్పి, ఆయనకు కులం ఆపాదించడం సహజంగా బాధకలిగించేదే. ఈ విషయంలో ఏపిలో కాపు ఉద్యమం వెనుక ముద్రగడకు-జగన్‌కు టిడిపి సంబంధం ఆపాదించినట్లే, రేవంత్- ఉత్తమ్-కోదండ పేర్లతో తెరాస ‘రెడ్డి ముద్ర’ వేయడం ప్రస్తావనార్హం.
కోదండ మాస్టారేమీ ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయన ప్రభ ఎవరో వెలిగిస్తే వెలిగింది అంతకంటే కాదు. అధ్యాపక వృత్తిలో ఉన్నప్పటి నుంచే ప్రజా ఉద్యమాలు నిర్మించిన వామపక్ష, పౌరహక్కుల నేత. ఆ తర్వాతనే జానారెడ్డి-కేసీఆర్ పుట్టించిన జాక్‌కు చైర్మన్ అయ్యారు.
అలాంటి ఉద్యమ నేతను కుబుసం విడిచిన విషనాగు అని అభివర్ణించడం, తలా ఒక మాటతో వ్యక్తిత్వహననం చేయడం తెరాస చేసిన వ్యూహాత్మక తప్పిదం. తాము ఎంపి సీటు ఇస్తామని చెప్పినా, పదవులిస్తామని చెప్పినా కోదండ అంగీకరించలేదని అదే నోటితో చెప్పడాన్ని బట్టి, మాస్టారుకు పూసిన మసిలో కసి ఉందని తేలిపోతుంది. నిజానికి కోదండ మాస్టారేమీ కేసీఆర్‌కు ఆజన్మశత్రువేమీ కాదు. తన ఉద్యమం ద్వారా తెరాసకు రాజకీయ లబ్ది కలిగించిన నేత. కేసీఆర్ దన్నుతోనే ఉద్యమం నడిపించారు. ఇద్దరూ కలసి అనేక వేదికలు, సమాలోచనలు పంచుకున్న వారే. తెలంగాణ వచ్చేందుకు తెరాస కంటే జాక్ కష్టమే ఎక్కువన్నది నిర్వివాదం. కాకపోతే ఫలితం తెరాస రాజకీయ నాయకత్వం అనుభవిస్తుండగా, మాస్టారు మాత్రం మళ్లీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే తేడా!
తెలంగాణ ఉద్యమానికి వేడి పుట్టించి, దానిని ఢిల్లీ వరకూ తాకించిన కోదండరామ్ వంటి ఉద్యమ నేత.. తాను కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరినా రెండుసార్లు ఇవ్వలేదని చెప్పడం, ఉద్యమ ఫలితాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయో చెప్పాల్సిన పనిలేదు. సర్కారులోకి వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ జనం తెరాసకే అనుకూలంగా తీర్పునిచ్చారు. అయితే, తెలంగాణ కోసం సకల జనులనూ సమరానికి సిద్ధం చేసిన మాస్టారుపై, తెరాస శ్రేణులంతా పరుష పదజాలంతో దూషించడాన్ని కూడా, తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారన్న అంచనా తప్పు.
కోదండరామ్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆయన తన భవిష్యత్తు అడుగులెలా ఉంటాయన్నదీ చెప్పారు. తెలంగాణ వేరు, తెలంగాణ ప్రభుత్వం వేరు అన్న ఆయన వ్యాఖ్య లోతులను అర్ధం చేసుకుంటే, ఆయన దారి, వ్యూహమేమిటన్నది స్పష్టమవుతుంది. కోదండ కార్యాచరణ, అంతకుముందు ఆయన సర్కారుకు వ్యతిరేకంగా చేసిన ప్రకటన, చివరలో ప్రతిపక్షాల విమర్శలు చూసిన ‘తెరాస భావజాలవాదులు’ కొత్త వాదానికి తెరలేపారు. ఎన్ని చేసినా, ఏమి చెప్పినా కోదండతో ఏమీ కాదు. జనం ఆయన్ను పట్టించుకోరు. కేసీఆర్ వ్యూహం ముందు నిలవడం కష్టం. ఇదీ వారి వాదన!అది నిజమే. ఇప్పటివరకూ కేసీఆర్ కత్తికి ఎదురులేదు కాబట్టి అలాంటి భావన ఉండటం తప్పుకాదు. అయితే, మహాప్రస్థానం కూడా ఒక అడుగుతోనే మొదలవుతుంది. తెదేపా నుంచి కేసీఆర్ బయటకు వచ్చి, తెరాస పుట్టించినప్పుడు కూడా ఆయన వెంట ఉన్నది ఒకరిద్దరే. కేసీఆర్‌తో ఏమవుతుందని అప్పుడూ ఇలాంటి ప్రశ్నలే వేశారు. ఆ మాట కేసీఆరే చాలాసార్లు చెప్పారు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకువెళ్లి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకువచ్చింది కూడా ఆ ఒక్కడే కదా? సర్వోదయ నేత జయప్రకాష్‌నారాయణ ఉద్యమం కూడా ఆదిలోనే ఒంటరిగానే మొదలై, తర్వాత దేశానికి అగ్రనేతలను అందించింది. రైతు ఉద్యమం నడిపిన మహేంద్రసింగ్ తికాయత్, శరద్ జోషి,గూర్ఖాలాండ్ ఉద్యమాన్ని నడిపించిన సుభాష్‌ఘీషింగ్, అసోంలో విద్యార్థి ఉద్యమం మొదలుపెట్టిన ప్రఫుల్లకుమార్ మహంత, అవినీతికి వ్యతిరేక ఉద్యమం చేసిన అన్నాహజారే వీరంతా తొలిరోజుల్లో ఒంటరి సైనికులే.ఎన్టీఆర్ కూడా ముఖానికి రంగుతీసి, చెన్నై నుంచి ఒక్కరే వచ్చారు. కానీ, తర్వాతిరోజుల్లో జనాలను తమ వెంట నడిపించి సైన్యాధికారులయ్యారు. వీరిలో ఎన్టీఆర్,మహంత తప్ప ఎవరూ సీఎంలు కాలేదు. అన్నాహజారే ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కేజ్రీవాల్ కూడా ఒంటరి సైనికుడే. తర్వాతనే ఆయన సీఎం అయ్యారు. దీనిని గమనిస్తే కోదండరామ్ కొత్త ఉద్యమం మీద తెరాస భావజాలవాదుల ‘అలౌకిక ఆనందం’లో మార్పు రావలసి ఉంది.
అయితే, ఈ పరిణామాలన్నీ చూసి కేసీఆర్ సర్కారుకు ఏదో అవుతుందని అంచనా వేయడం వెర్రితనం. ఇక్కడ కోదండ చేస్తున్నది కేసీఆర్‌పై వ్యక్తిగత పోరాటం కాదు. ప్రభుత్వ లోపాలపైనే! దాన్ని అర్ధం చేసుకోకుండా ప్రతిపక్షాలు ఇప్పుడే యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు భావిస్తున్నాయి. కాకపోతే, కోదండ మొదలుపెట్టిన ప్రయత్నం తెరాస వ్యతిరేక శక్తుల్లో నైతిక స్థైర్యం ఇచ్చేదే. ఇవన్నీ పక్కనే ఉన్న టిడిపికి సంబరం కలిగించేవయినా, ఆ పార్టీకి వచ్చే లాభమేమీ ఉండదు. పుంజుకుందామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కొత్త ఆలోచనలకు అవకాశం కలిగించేవి.
సినిమా హాల్లో నేల మీద కూర్చునే వాళ్లు, విలన్లను హీరో చావగొడుతుంటే ఈలలు వేస్తుంటారు. హీరోలో తమను తాము ఊహించుకుంటారు. తాము చేయలేని పని హీరోలో చూసుకుని సంబరపడుతుంటారు. తెలంగాణలో ప్రతిపక్షాల వరస అలాగే ఉంది. కోదండలో తమను తాము చూసుకుంటున్నాయి. కోదండ కొత్త ఉద్యమ ప్రభావం క్షేత్రస్థాయికి చేరేదాన్ని బట్టి, ఆయన భవిష్యత్తును అంచనా వేయవచ్చే తప్ప, ఇప్పుడే అతిగా అంచనా వేయడం తప్పు.
బహుశా వ్యూహరచయిగా పేరున్న కేసీఆర్ కూడా ఇలాంటి ముందస్తు భయంతోనే, చిన్నపామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్న తన సహజ సిద్ధాంతం ప్రకారం, తన సైనికులందరినీ మాస్టారుపై ఉసికొల్పినట్లున్నారు. కోదండపై మంత్రులందరినీ యుద్ధానికి దించడాన్ని బట్టి, కేసీఆర్ కోదండకు భయపడుతున్నారన్న సంకేతాలు పంపినట్టయింది. అలా కాకుండా, కోదండ వంటి మేధావి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో! ఇంత సున్నిత అంశాన్ని కేసీఆర్ ఎందుకు విస్మరించారో మరి!?
ఇక ఏపిలో కాపునేత ముద్రగడ విషయంలోనూ సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యూహాత్మక తప్పిదమే చేస్తున్నారు. కాపుల సంఖ్యాబలం, వారి భావోద్వేగాలు ఎప్పుడు ఎలా ఉంటాయన్నది తెలిసి కూడా, రెచ్చగొట్టడం కోరి సమస్యను తెచ్చుకోవడమే. చరిత్ర పరిశీలిస్తే కాపులు ఎప్పుడూ ఒకే వైపు ఉండరు. బాబు-వైఎస్ ఎంత మేళ్లు చేసినా, సొంత కులనేత చిరంజీవి పార్టీ పెడితే పోలోమంటూ పీఆర్పీలో చేరారు. చివరకు ఆయన నమ్మించి మోసం చేస్తే అదే జనం చిరంజీవిని పక్కకుపెట్టారు. ఎవరు అవునన్నా కాదన్నా ముద్రగడకు కాపుల్లో ఇమేజ్ ఉంది. దాన్ని చెరిపివేసేందుకు ఎంతమంది కాపునేతలను ఆయనపై ఉసిగొల్పినా ఆ జాతిలో మైలేజీ రాదని, దానివల్ల నష్టమేనన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు.
ఒకప్పుడు బాబు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముద్రగడ ఉద్యమానికి మద్దతునిచ్చిన వారే. ఇప్పుడు ఆయనకు జగన్ పార్టీతో బంధం అంటకడుతుంటే నమ్మే పరిస్థితి లేదు. అసలు ముద్రగడ స్వభావం తెలిసిన వారెవరూ ఆయనపై ముద్రలువేస్తే నమ్మరు. తన మాట తానే వినని మొండిఘటం. అయితే, గతానికి, ఇప్పటికీ ఒక తేడా కనిపిస్తోంది. గతంలో ఆయన ఏ పిలుపునిచ్చినా మహాప్రభంజనంలా ఉండేది. ఇప్పుడు అదే కాపులు వెనుకముందు ఆలోచిస్తున్నారు. అంటే కాపులు మారారు గానీ, ముద్రగడ మారలేదన్నమాట!

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144