గుంటూరు

ధీరోదాత్తుడు ఛత్రపతి శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 19: వేద, తపో, ధర్మభూమి అయిన మన భారతదేశాన్ని, విశ్వజనీనమైన హైందవ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తన సర్వశక్తులూ ఒడ్డిన ఛత్రపతి శివాజీ ధీరోదాత్త గుణ సంపన్నుడని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కొనియాడారు. సోమవారం ఉదయం నగరంలోని కొరిటెపాడు పార్కు ఆవరణలో ఛత్రపతి శివాజీ సేవాసమితి, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శివాజీ 391వ జయంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సేవాసమితి అధ్యక్షుడు జె సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సిందే లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఉత్సవ ప్రారంభంలో శివాజీ విగ్రహానికి రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఐజీ సిహెచ్ ఏసురత్నం, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ డి శ్రీనివాస్, ఎసిబి ఎఎస్‌పి జె భాస్కరరావు, మాజీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, కళ్లం విద్యాసంస్థల అధినేత కళ్లం హరనాథరెడ్డి, మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు, చిరుమామిళ్ల గోపీకృష్ణ, కన్న విద్యాసంస్థల అధినేత కన్న మాస్టారు, ప్రొఫెసర్ షిండే, సిహెచ్ హరీష్, ఎ ఆదిశేషు తదితరులు పుష్పమాలలు అర్పించి శివాజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి డిఐజి ఏసురత్నం మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డల్లో శివాజీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదన్నారు. నేటి యువత శివాజీ ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉత్సవంలో భాగంగా అక్షర విద్యాలయం, నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 200 మందికి పుస్తకాలను అతిథులు పంపిణీ చేశారు.

మున్సిపల్ అంచనా, సవరణ బడ్జెట్‌లకు ఆమోదం
మంగళగిరి, ఫిబ్రవరి 19: మంగళగిరి పురపాలక సంఘ 2017 - 18 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు, 2018 - 19 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షత వహించారు. 2017- 18 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలకు ప్రారంభ నిల్వ కింద 11,47,36,000 రూపాయలు చూపి సాధారణ, మూలధనపు మొత్తం జమలు 20,04,07,000 రూపాయలుగా అంచనా వేశారు. సాధారణ, మూలధనపు ఖర్చులు 22,24,48,500 రూపాయలుగా అంచనా వేసి ముగింపు నిల్వగా 9,26,94,500 రూపాయలుగా చూపారు. 2018-19 సంవత్సరపు బడ్జెట్ అంచనాలకు ప్రారంభ నిల్వ కింద 9,26,94,500 రూపాయలుగా తీసుకుని సాధారణ, మూలధనపు ఖాతా మొత్తం జమలు 24,92,00,000 రూపాయలుగా అంచనా వేసి సాధారణ, మూలధనపు ఖర్చుల కింద 31,24,61,600 రూపాయలుగా అంచనా వేశారు. ముగింపు నిల్వగా 2,94,32,000 రూపాయలను చూపారు. అంచనా బడ్జెట్‌లో ఆస్తిపన్ను 2కోట్ల 70 లక్షలు గాను, ఖాళీ స్థలాల పన్ను 45 లక్షలు, వినోదపు పన్ను 25 లక్షల, స్టాంపు డ్యూటీ 3 కోట్లు రాగలదని అంచనా వేశారు. చైర్‌పర్సన్, కౌన్సిల్ సభ్యుల గౌరవ వేతనాలు 15 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు చూపారు. పురపాలక సంఘం వినియోగించే అద్దె వాహనాల ఖర్చు 8.50 లక్షల రూపాయలుగా అంచనావేసి చూపారు.
పేదలకు సొంతిళ్ల నిర్మాణం జరిగేనా ?
పట్టణంలో పేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తామని 2015 నుంచి చెబుతూ దరఖాస్తులు తీసుకున్నారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని, అసలు ఇళ్ల నిర్మాణం జరుగుతుందా లేదా అని సీపీఐ సభ్యుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు ప్రశ్నించారు. చైర్మన్ చిరంజీవి స్పందిస్తూ పట్టణంలోని ఆటో నగర్‌వద్ద 14.70 ఎకరాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, దరఖాస్తులు 5 వేలకు పైగా వచ్చినందున మరో 40 ఎకరాల స్థలం కేటాయించాలిన జిల్లా కలెక్టర్‌ను కోరగా సిఆర్‌డిఎ అధికారులతో మాట్లాడారని, విదేశీ పర్యటనలో ఉన్న కలెక్టర్ జిల్లాకు చేరుకోగానే కలిసి మాట్లాడదామని, ఉడా కాలనీలో 40 ఎకరాలు ఇచ్చేందుకు సిఆర్‌డిఎ కూడా అంగీకారం తెలిపిందని, అక్కడ స్థలం కేటాయించగానే రత్నాలచెరువు వద్ద ఉన్న స్థలాన్ని ఐటిపార్కుకు కేటాయించేందుకు చర్యలు తీసుకుందామని అన్నారు. గతంలో జాబితానుంచి తొలగించిన అర్హుల పేర్లను తిరిగి చేర్చాలని అధికారులను కోరామని చైర్మన్ చిరంజీవి పేర్కొన్నారు. 14.70 ఎకరాల్లో శంకుస్థాపన జరగక పోవడంతో అక్కడ ఇళ్లకు బదులు ఐటి కంపెనీలు పెడతారని ప్రజలు అపోహ పడుతున్నారని మునగపాటి వెంకటేశ్వరరావు అన్నారు. కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎటువంటి అపోహలు అవసరం లేదని ఒక్కో బ్లాకులో 32 ఇళ్లు ఉండే విధంగా 54 బ్లాకులు అంటే 1728 గృహాలు నిర్మించడం జరుగుతుందని, మిగతా వారికి ఉడా కాలనీలో నిర్మించడం జరుగుతుందన్నారు. డంపింగ్‌యార్డుకు కూడా స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు చైర్మన్ చిరంజీవి వెల్లడించారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకుంటే పట్టణంలో అభివృద్ధే ఉండదని, మరో ఏడాదిన్నరలో ఈ కౌన్సిల్ గడువు ముగుస్తుందని, ప్రజల కిచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక పోయామని సీపీఎం సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. గౌతమబుద్ధ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం 23 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ఆర్థిక శాఖ అనుమతిస్తే నిధులు విడుదల అవుతాయని చైర్మన్ చిరంజీవి పేర్కొన్నారు. పట్టణంలో విచ్చల విడిగా ఆక్రమణలు ఉన్నప్పటికీ అధికారులు పన్నులు వేయడం లేదని, మెయిన్ బజార్‌లో ఒక్కో వ్యాపారి 10 అడుగులు ముందుకు వచ్చారని, వచ్చే నెల 1వ తేదీన రధోత్సవం ఉన్నందున ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు పూనుకోవాలని మునగపాటి వెంకటేశ్వరరావు కోరారు.

టెన్నిస్ పోటీల విజేతలు గిరీష్, అశ్రీత
గుంటూరు (స్పోర్ట్స్), ఫిబ్రవరి 19: వ్యాంటిజ్ టెన్నిస్ క్లినిక్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక పలకలూరు రోడ్డులోని అకాడమిలో జరుగుతున్న ఐటా అండర్-16 బాలబాలికల టాలెంట్ సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్స్‌లో బాలుర విభాగంలో విజయవాడకు చెందిన కె గిరీష్, బాలికల్లో గుంటూరుకు చెందిన లేళ్ల అశ్రీత విన్నర్స్ టైటిల్‌ను సాధించారు. ఈ పోటీల్లో రన్నర్స్‌గా బాలురలో హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ శ్రీనివాస్, బాలికల్లో గాయత్రి నిలిచారు. అండర్-16 డబుల్స్ బాలుర విభాగంలో సయ్యద్ అమర్, నితిష్‌ల జంట విన్నర్స్‌గానూ, కెవి అపురూప్, ఆదాం జంట రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కెఆర్ సుమంత్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి కెఆర్ మధుకర్, ఎన్‌టిఆర్ స్టేడియం టెన్నిస్ సంఘ కార్యదర్శి నల్లబోతు శ్రీనివాసరావు, ఎం నరేంద్రకుమార్, టెన్నిస్ శిక్షకుడు జివిఎస్ ప్రసాద్, పి ఆనంద్, కెఆర్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో యార్డుల అభివృద్ధికి ప్రణాళిక
* రాజధాని నిర్మాణానికి ఒక నెల చైర్మన్ల గౌరవవేతనం
గుంటూరు (పట్నంబజారు), ఫిబ్రవరి 19: మిర్చియార్డులో సోమవారం జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ల సమావేశం జరిగింది. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ మిర్చిలో నాణ్యతా ప్రమాణాలు తెలిపే ల్యాబ్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి యార్డు చైర్మన్లు ఒక నెల గౌరవ వేతనాన్ని విరాళంగా అందించాలని సమావేశంలో నిర్ణయించారు. లింకురోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టాలన్నారు. రైతులు పండించిన పంటలను ఇళ్లకు తరలించే విషయంలో ఆర్థికభారం పడుతోందని, రైతుల సొమ్ము వారి అవసరాలకు ఖర్చు పెట్టడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. యార్డులలో రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా మరింత అభివృద్ధిపర్చాలన్నారు. వ్యవసాయ, పశు సంవర్ధక, ఉద్యానవన శాఖలను మార్కెటింగ్ శాఖతో అనుసంధానం చేయాలని తీర్మానించారు. రైతు బజార్ల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ మార్కెట్ యార్డుల నుంచి రావాల్సిన బకాయిలను తక్షణమే వసూలు చేయాలని అవసరమైతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో జిల్లాలోని యార్డు చైర్మన్లు మునగా నిమ్మయ్య, నన్నపనేని ప్రభాకరరావు, ఆంజనేయరాజు, పూజల వెంకట కోటయ్య, కేశమనేని శ్రీ్ధర్, వల్లభనేని సాయిప్రసాద్, సయ్యద్ పెద్ద కరిముల్లా, కమిటీ డైరెక్టర్లు పసుపులేటి శ్రీనివాసరావు, మన్నవ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌పి జాదా, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌దే
* మిత్రపక్షంలో ఉండి అంతర్గతంగా పోరాటం చేస్తున్నాం
* టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 19: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, ఎలాంటి హోదా, హామీలపై స్పష్టమైన ప్రకటనలు లేకుండా రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్‌దేనని, ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి ప్రత్యేక హోదా అంటూ ప్రసంగాలు చేయడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు పార్లమెంటులో కాంగ్రెస్ నాయకులు తలుపులు మూసివేసి రాష్ట్ర విభజన చేస్తుంటే ఈ నాయకులు ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా చేసిన విషయాన్ని గుర్తెరగాలని, ఆ పార్టీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై గానీ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే అంతర్గతంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. 29 సార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర పరిస్థితులపై వివరించినప్పటికీ 16 వేల కోట్ల లోటుబడ్జెట్‌కి 4 వేల కోట్లు మాత్రమే పంపించారని, పోలవరానికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కన్నా హామీలు అమలు చేస్తామన్న కేంద్రప్రభుత్వం హామీల విషయంలో అనుకున్న మేరకు నిధులు కేటాయించడం లేదన్నారు. తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకుంటుంటే వైసీపీ పార్లమెంటు సభ్యులు బయటకు వచ్చారన్నారు. కేసుల మాఫీ, రాజకీయ లబ్ధితప్ప జగన్‌కు ప్రజా సమస్యలు ఏనాడూ పట్టలేదన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామంటూ ప్రసంగాలు చేస్తున్న జగన్ వెంటనే రాజీనామా చేయించి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు షేక్ లాల్‌వజీర్, కంచర్ల శివారమయ్య, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.