సంజీవని

నిద్ర చెడితే.. మెదడు చెడుతుంది (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: నా వయసు 70 ఏళ్ళు. రాత్రిళ్ళు సరిగా నిద్రరావటం లేదు. నాలుగైదుసార్లైనా మెలకువ వస్తోంది. నివారణ చెప్తారా?
-కాసాని రాజగోపాలరావు, కాకినాడ
జ: నిద్రపట్టడం లేదనేది (అనిద్ర) చాలామంది అనుభవంలోని సమస్యే! మధ్యమధ్య మెలకువ రాకుండా నిద్రపోయినపుడే సంతృప్తికరంగా నిద్రపట్టిందని భావిస్తారు. ముక్కలు ముక్కలుగా పట్టిన నిద్రవలన రక్తనాళాలు గట్టిపడిపోయి, రక్తసరఫరాతోపాటు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోతుంది. తగినంత ఆక్సిజన్ అందకపోతే, మెదడుకి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర మధ్యలో మెలకువ వచ్చినపుడు దాదాపు 61 శాతం వయోవృద్ధుల్లో మెదడు రక్తనాళాలు దెబ్బతినటాన్ని గమనించారు. నిద్రాభంగం అధికంగా అవుతున్నకొద్దీ ఆక్సిజన్ కొరత ఎక్కువై ఈ తేడాలు మరింత ప్రమాదకరంగా మారటాన్ని, నాడీవ్యవస్థ మరింత దెబ్బతినటాన్ని గుర్తించారు. ఈ నిద్రాభంగానికి అంతర్గతమైన కారణాలు కూడా ఉన్నాయనే విషయం మీద పరిశోధన కొనసాగిస్తున్నారు.
నిద్ర సరిగా పట్టనందువలన కూడా మానసికంగా ఒత్తిడి ఏర్పడవచ్చు. జీర్ణశక్తి బలంగా లేకపోవటం, మలబద్ధత, వాతదోషం శరీరంలో వికటించే ఆహార విహారాలు కూడా నిద్రా భంగానికి కారణం అవుతాయి. వాతం వికటించడంవలన స్ట్రెస్ లాంటి మానసిక లక్షణాలు, కీళ్ళవాతం లాంటి ఇతర వాత వ్యాధులు ఎక్కువగా అనిద్రకు కారణం అవుతాయి. శరీరంలో బాగా వేడి చేసినపుడు పడుకోగానే నిద్రపట్టినా, వెంట వెంటనే మెలకువ వచ్చేస్తుంటుంది. గుండెదడ, భయంగా ఉండటం లాంటి బాధలేర్పడి నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. మెలకువ వచ్చిందంటే ఇంక నిద్ర పట్టదు. ఇందుకు చికిత్స ఆయా దోషాలకు అనుగుణంగా చేయవలసి వస్తుంది.
నిద్రలో తేడా వస్తోందంటే తేలికగా అరిగే ఆహారాన్ని, చలవ చేసే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి! ఊరగాయ పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి మషాలాలు, పులుపు పదార్థాలు, నూనె పదార్థాలను మానటంవలన సగం చికిత్స పూర్తవుతుంది. శరీరానికి తగిన వ్యాయామం, రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపు నడిచి పెందరాళే ఆహారం తీసుకోవటం, టీవీ ఇంట్లో వుందన్న సంగతి మరిచిపోయి 9-10లోపే నిద్రకు ఉపక్రమించడంవలన కొంత ప్రయోజనం కనిపిస్తుంది. కాఫీ, టీలు, పొగాకు ఉత్పత్తులు నిద్రాభంగాన్ని కలిగిస్తాయి. పగలు ఎట్టి పరిస్థితిలోనూ పడుకోకూడదు. కనీసం కునుకు కూడా తీయవద్దు. రాత్రిపూట పుస్తక పఠనం నిద్రపట్టేందుకు మంచి ఉపాయాల్లో ఒకటి. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి తిరిగి నిద్రపట్టనపుడు కూడా పుస్తకం అనే ఆయుధం ప్రయోగిస్తే, నిద్రను చెడగొట్టే రాక్షసి వదిలిపోతుంది. నిద్ర వస్తుంది. శాపాన్ని కూడా వరంగా మలచుకోవటమే అవసరం. రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది.
సారస్వతారిష్ట, అశ్వగంధారిష్ట, ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట- నాల్గింటినీ కలిపిన ఔషధాన్ని రోజూ రెండు సార్లు ఆరు చెంచాల చొప్పున తీసుకొని కొద్దిగా నీళ్లు కలిపి తాగండి. క్రమేణా నిద్ర వస్తుంది. క్షీరబలతైలం గొట్టాలు ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతాయి. వీటిని పూటకు రెండు చొప్పున రెండు పూటలా తీసుకొంటూ ఉంటే నిద్రాభంగం తగ్గుతుంది. ప్రాణాయామం నిద్రపట్టేందుకు మంచి ఉపాయం.
జాజికాయ, జాపత్రి, మరాటీ మొగ్గలను 10 గ్రాముల చొప్పున తీసుకుని, అందులో 5 గ్రాముల పచ్చకర్పూరం (పాయసంలో కలుపుకునేది- హారతి కర్పూరం కాదు) ఈ నాల్గింటినీ మెత్తగా నూరి ఒక సీసాలో భద్రపరచుకోండి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి రెండు పూటలా గ్లాసు వేడి పాలలో పావు చెంచా పొడిని కలిపి తాగుతుంటే మంచి నిద్ర వస్తుంది. కుముదేశ్వర రసం, ఉదయభాస్కర రసం అనే ఔషధాలు రెండూ వాడుతూ ఉంటే నిద్రను చెరిచే దోషాలు తగ్గటాన్ని గమనించాము.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 944017264