క్రీడాభూమి
మరో నాకౌట్ సమరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, మే 26: ఈసారి ఐపిఎల్లో తొలిసారి అడుగుపెట్టిన జట్టు గుజరాత్ లయన్స్. ప్లే ఆఫ్ దశకు చేరుతుందని ఎవరూ ఊహించని జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరాయి. పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానాన్ని ఆక్రమిస్తే, గుజరాత్ రెండో స్థానంలో ఉంది. ఈ కారణంగానే, మొదటి క్వాలిఫయర్లో బెంగళూరు చేతిలో ఓడినప్పటికీ సురేష్ రైనా నాయకత్వంలోని గుజరాత్ రెండో క్వాలిఫయర్ రూపంలో మరో నాకౌట్ సమరానికి అర్హత సంపాదించింది. గ్రూప్ దశలో మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్న సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య ఎలిమినేటర్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధించి ఫైనల్ దిశగా అడుగు ముందుకేసింది. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్లో గుజరాత్తో తలపడేందుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని సన్రైజర్స్ సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు బెంగళూరుతో ఫైనల్ను ఖరారు చేసుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే దీనిని కూడా నాకౌట్ మ్యాచ్గానే పరిగణించాల్సి ఉంటుంది.
పేస్ బౌలింగ్ వార్నర్ సేన బలం
సన్రైజర్స్ ఎక్కువగా పేస్ బౌలింగ్పైనే ఆదారపడి బరిలోకి దిగనుంది. ఆశిష్ నెహ్రా కూడా బరిలో ఉండే ఆ జట్టు మరింత బలోపేతంగా నిలిచేది. కానీ, మోకాలి గాయానికి లండన్లో శస్త్ర చికిత్స చేయించుకున్న అతను అక్కడి ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. నెహ్రా లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, భువనేశ్వర్ కుమార్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ అద్భుత ప్రతిభతో ప్రత్యర్థి జట్లను నిలువరిస్తున్నారు. వీరిద్దరి పదునైన బంతులను గుజరాత్ బ్యాట్స్మెన్ ఏ విధంగా అడ్డుకుంటారో చూడాలి. ఎలిమినేటర్లో నైట్రైడర్స్ బ్యాట్స్మన్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడానికి సన్రైజర్స్ కెప్టెన్ వార్నర్ వీరిద్దరినే ఆయుధాలుగా ప్రయోగించాడు. మొదటి క్వాలిఫయర్లో గుజరాత్ బౌలర్ ధవళ్ కులకర్ణి బెంగళూరు బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టగలిగాడు. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఫాస్ట్ బౌలింగ్కు ఉపయోగపడుతుందని కులకర్ణి బౌలింగ్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ పేసర్లు పిచ్ స్వభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని, మరోసారి విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేవలం బౌలింగ్పైనే ఆధారపడకుండా బ్యాటింగ్ వైపు కూడా సన్రైజర్స్ దృష్టి సారించాల్సి ఉంది. ఓపెనర్లు విఫలమైతే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించాలి. నైట్రైడర్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్లో యువరాజ్ సింగ్ ఇదే సిద్ధాంతాన్ని అమలు చేశాడు. 44 పరుగులు సాధించి, సన్రైజర్స్కు అండగా నిలిచాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, మోజెస్ హెన్రిక్స్, దీపక్ హూడా, ఇయాన్ మోర్గాన్ వంటి మేటి బ్యాట్స్మెన్ అండ ఆ జట్టుకు ఉంది. వీరంతా గుజరాత్ బౌలర్లకు సవాళ్లు విసరడం ఖాయం. కెప్టెన్ సురేష్ రైనా, బ్రెండన్ మెక్కలమ్, ఆరోన్ ఫించ్, దినేష్ కార్తీక్ తదితరులు వేగంగా పరుగులు రాబట్టగల సమర్థులు. ఎలాంటి బౌలింగ్నైనా ధాటిగా ఎదుర్కొనే సత్తా మెక్కలమ్కు ఉంది. డ్వెయిన్ స్మిత్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. రవీంద్ర జడేజా అండ కూడా ఆ జట్టుకు ఉంది. ఇరు జట్ల కెప్టెన్లు స్టార్ బ్యాట్స్మెన్ కావడంతో, రెండో క్వాలిఫయర్ ఆసక్తిని రేకిత్తిస్తున్నది. ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి చేసే పోరాటం ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగి, అభిమానులకు కనువిందు చేయనుంది.
***
న్యూఢిల్లీలోని ఫిరోజ్షా కోట్ల మైదానంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు