శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం

సీతను విడిచి ఎందుకు వచ్చావని లక్ష్మణుడిని అడిగిన రాముడు ( అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్ణశాలకు వెళ్తున్న శ్రీరాముడు తనను కలవడానికి వస్తున్న తమ్ముడు లక్ష్మణుడిని దారిలో చూసి శోకంతో తపిస్తూ ఇలా అన్నాడు. ‘నువ్వు సీతను రక్షిస్తావని నమ్మి కదా సీతను ఒంటరిగా నీ స్వాధీనంలో వుంచి నేనిలా వచ్చాను? నేను కాపాడలేక నీకాపని అప్పజెప్పానా? ఆ స్ర్తిరత్నాన్ని అడవిలో ఒంటరిగా వదలిపెట్టి ఇక్కడేదో మునిగిపోయినట్లు ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వచ్చావు. నిన్ను చూసింది మొదలు నాకేదో భయంగా ఉంది లక్ష్మణా. వచ్చిన వాడివి సీతను కూడా తీసుకుని రావచ్చు కదా? ఆమె లేకుండా నువ్వు ఒక్కడివే రావడం దూరం నుండే చూసిన నాకు గుండె పగిలింది. ఎడమ భుజం, ఎడమ కన్ను అదిరాయి. అయ్యో! కొంప మునిగింది కదా అనుకున్నాను’
ఇలా రామచంద్రమూర్తి తన మీద నింద వేయడం, దోషం ఆరోపించడంతో, ఆయన పడుతున్న దుఃఖ బాధను గమనించి, ఇంతకు పూర్వమే సీత మాట్లాడిన మాటలకే నొచ్చుకున్న లక్ష్మణుడు మరింత నొచ్చుకుని ఇలా జవాబిచ్చాడు అన్నకు. ‘అన్నా! ఆ ధ్వని నీ గొంతుక ధ్వని అని మోసపోయి స్వతంత్రించి నాకై నేను రాలేదు. ‘సీతా, లక్ష్మణా కావరే’ అనే ధ్వని అరణ్యంలో కలూగగా సీత విని భయపడి నన్ను పొమ్మని, నీ మీద ప్రేమ వల్ల నన్ను బలవంతపెట్టింది. అలా తొందరపెట్టడంతో, ‘రాముడికి భయం లేదమ్మా.. ఆయనకు అపాయం కలుగజేసేవాడు లోకంలో లేడమ్మా.. అది రాముడి గొంతు కాదమ్మా.. ఎవడో మాయలమారి పనది అమ్మా.. రాముడు తనను రక్షించమని మరొకరిని వేడుకుంటాడా?’ అని ఆమెకు నమ్మకం కలిగేలా ఎంతో చెప్పాను. ‘వదినా, ఎందుకమ్మా ఇంతగా భయపడతావు? రామచంద్రుడికి రాక్షసుల వల్ల యుద్ధంలో భయం కలుగుతుందా? ఇదేమిటమ్మా? ఆ గొంతు ఆయనదని నమ్మతగునా? అది ఆయన గొంతు కాదని, రాక్షసుడే అలా అరిచాడు. అమ్మా తొందరపడకుండా నిబ్బరించుకో’ అని చెప్పాను.’
‘అన్నా! ఇంకా ఇలా అన్నాను. ‘రామచంద్రుడనగా ఏమని తలచావమ్మా? దేవతలనైనా తన భుజబలంతో కాపాడగల ఆయన తనను రక్షించమని నిన్ను కోరుతాడా? ఇది నిజమని నీవెలా నమ్ముతావమ్మా? ఎవడో, ఏదో కారణంతో మా అన్న గొంతులాంటి గొంతుతో రక్షించమని అరిచాడు. ఆ ధ్వని మార్పు వింటే అది మా అన్నది కాదని అర్థమవుతుంది. కాబట్టి తొందరపడవద్దు. శాంతించు. నువ్వు కూడా నీచ స్ర్తిలాగా దుఃఖపడవచ్చా? ప్రపంచంలో ఇంతవరకు పుట్టిన వారిలో, ఇక ముందు పుట్టబోయేవారిలో యుద్ధంలో రామచంద్రుడిని ఎదిరించి గెలవగలవారు లేరు. కాబట్టి నీ మనస్సులో కలిగిన భయం వదలి నిశ్చింతగా ఉండు. దేవతలందరూ ఏకమై వచ్చినా రామచంద్రుడిని యుద్ధంలో జయించలేరు. ఇక ఈ నీచ రాక్షసులు ఏం చేయగలరు?’ అని నేను చెప్పగా మతిభ్రమ కలిగిన సీత ఇలా అంది. ‘నువ్వు నన్ను కోరి అన్న చావాలన్న పాత చింతతో వున్నావు. నీ కోరిక కొనసాగుతుందా? లక్ష్మణా! నీ అభిప్రాయం తెల్సింది. నువ్వు నాకు సీత లభించేట్లు చేస్తే నేను నీకు సహాయం చేస్తానని నువ్వు, భరతుడు అంగీకారానికి వచ్చారు. ఆ ఒడంబడిక తరువాతే నువ్వు రాముడి వెంట వచ్చావు. అలా కాకపోతే తనను కాపాడమని అన్న అరిస్తే కాపాడడానికి పోని తమ్ముడు ఎవరైనా ఉంటారా? నువ్వు రహస్య వర్తనం గల పగవాడివి కానీ, రాముడికి తమ్ముడివి కాదు. ఎప్పుడు వీలవుతుందా, ఎప్పుడు సీతను హరిస్తానా? అన్న ఆశతో నా కోసమే నా మగడి వెంట వచ్చావు?’ ఈ మాటలు వినగానే నా పెదవులు అదిరాయి. కళ్లు ఎర్రగా అయ్యాయి. కోపం పట్టలేక, అక్కడ వుండలేక ఆశ్రమం వదలి వచ్చాను. అన్నా! వున్న విషయం చెప్పాను’
లక్ష్మణుడు ఇలా చెప్పడంతో, రాముడు ‘పాప రహితుడా! నువ్వు సీతను విడిచి రావడం సరైన పని కాదు. ఇప్పుడేమనుకున్నా ఏం ప్రయోజనం? స్ర్తిలకు కోపం వస్తే ఏదో అంటారు. అందునా, భర్తకు కీడు కలిగిందని భయంతో, శోకంతో, పీడించబడ్డ వారి విషయం చెప్పాల్నా? ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా సీత కోప్పడ్డదని నువ్వు కూడా కోపంతో నా శౌర్యం, నా శక్తి తెలిసి కూడా ఆడదాన్ని ఒంటరిగా అడవుల్లో వదిలి వచ్చావే? ఏమనాలి నిన్ను? ఎదుటివారు కోప్పడితే నేనూ కోపగించుకోవాలి అనుకున్నావే కానీ దానివల్ల కలిగే అపాయాన్ని ఆలోచించలేదు కదా? ఆడది నిన్ను కఠినంగా మాట్లాడిందని కోపగించి ఇలా రావడం తగునా? స్ర్తిజాతికిది సహజం. తిట్టిన తిట్టనీ.. మన పని మనం చేసుకుందాం అని సహించి ఊరక వుండాల్సింది. నేను వచ్చిన తరువాత ఈ వృత్తాంతం అంతా చెబితే నేను విచారించేవాడిని కదా? నేను భార్య మాటలు విని నిన్ను సందేహించే వాడినని అనుకున్నావా? అలా కాకుండా దూరంగా విడిచి రావడం మంచిదా? నా ఆజ్ఞ జవదాటావు కదా? తల్లిదండ్రుల ఆజ్ఞలు పరస్పర విరుద్ధమైనప్పుడు నేనెలా ప్రవర్తించానో అనేది కూడా ఆలోచించలేదు కదా? జింక శరీరంతో ఆశ్రమం నుండి నన్ను తీసుకువచ్చిన రాక్షసుడు, నేనొక బాణం వేయగా, అది తగిలి జింక శరీరం వదిలి, రాక్షస వేషంలో తీక్షణమైన నా బాణాల దెబ్బలను సహించలేక ప్రాణాలు కోల్పోతూ దూరంగా వినపడేట్లునా గొంతులాంటి గొంతుతో, నేనే అరచినట్లు అరవగా అది విని నువ్వు సీతను విడిచి వచ్చావు.’

-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12