రాష్ట్రీయం

అతిపెద్ద ‘రన్‌వే’ రాజమండ్రి సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: రాష్ట్రంలోనే అతి పెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం రూపుదిద్దుకుంది. దీనికి తోడు అతి పెద్ద విస్తీర్ణం కలిగిన విమానాశ్రయంగా రూపుదాల్చింది. ఇటు గన్నవరం, అటు విశాఖ మధ్య అతి పెద్ద ఎయిర్‌పోర్టుగా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంగా ప్రత్యేకత సంతరించుకుంది. ఎయిర్‌పోర్టును రూ.181 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా 1750 మీటర్ల విస్తీర్ణం కలిగిన రన్‌వేను 3185 మీటర్లకు విస్తరించారు. రన్‌వేను 45 మీటర్ల వెడల్పున విస్తరించారు. దీంతో ఒకేసారి ఆరు అతి పెద్ద విమానాలు నిలపడానికి అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా నిలవనుంది. ఇక్కడ నుంచి నేరుగా విదేశాలకు వెళ్ళే విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన వౌలిక సదుపాయాలతో విమానాశ్రయం రన్‌వేకు రెండు వైపులా 7.5 మీటర్ల వెడల్పున సేఫ్టీ షోల్డర్స్ నిర్మించారు. విశాఖ విమానాశ్రయం వైమానిక విమానాశ్రయంగావుంది. డొమెస్టిక్ విమానాశ్రయంగా గన్నవరం వుంది. ఈ క్రమంలో ఈ రెండు విమానాశ్రయాలకు మధ్యలో అతి పెద్ద విమానాశ్రయంగా రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి చెందింది. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిర్మాణ పనులను చేపట్టి రన్‌వేను రికార్డు స్థాయిలో పూర్తిచేశారు. ప్రస్తుతం రాత్రి ల్యాండింగ్ విమానాలను కూడా నిర్వహిస్తున్నారు. రన్‌వే సిద్ధం కావడంతో 300 సీటింగ్ కెపాసిటీ కలిగిన సీ-27 వంటి విమానాలు సైతం రానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు సర్వీసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేయడంతో మరో రెండు నెలల్లో అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కార్డియోగ్రఫీ సర్వే జరుగుతోంది. ఈ సర్వే అనంతరం ఇక్కడ ఉన్న సదుపాయాలతో కార్డియోగ్రఫీ సర్వే చార్టు రూపొందుతుంది. ఈ ప్రక్రియ రెండు నెలల్లో పూర్తికానుంది. ఆ వెనువెంటనే అంతర్జాతీయ విమానాశ్రయంగా సీ 27 వంటి పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో 16 సర్వీసులు నిర్వహిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. మూడు ఏఫ్రాన్లు నిర్మించారు. దీంతో ఒకేసారి ఆరు పెద్ద విమానాలు ఆగుతాయి. ఇటు ప్రయాణికులు, అటు లగేజి కలిగిన బెల్లీ కార్గో విమానాలు కూడా రానున్నాయి.
గత ఏడాది ఈ విమానాశ్రయాన్ని మూడున్నర లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించుకున్నారు. ఈ ఏడాది అది కాస్తా ఐదు లక్షలకు చేరవచ్చని అంచనావేశారు. గతంలో 380 ఎకరాల విస్తీర్ణంలో వుండే ఈ విమానాశ్రయం 1250 ఎకరాల్లో విస్తరించారు. ఈ విమానాశ్రయానికి చుట్టూ 17 కిలో మీటర్లు రోడ్డు, చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ నిర్మించారు. ఈ విమానాశ్రయంలో పాత టెర్మినల్‌ను నేవీ యుద్ధ విమానాలకు కేటాయించారు రన్‌వే నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చిత్రం..రాజమహేంద్రవరం విమానాశ్రయం