రాష్ట్రీయం

కమనీయం.. రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మార్చి 15: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణోత్సవాలు శుక్రవారం వైష్ణవ పాంఛరాత్ర ఆగమశాస్త్రానుసారం సాంప్రదాయ బద్ధంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడు, జగద్రక్షుడైన లక్ష్మీనరసింహుడికి క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవారితో జరిగిన కల్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనులు, గరుడుడి ఆహ్వానంతో యాదాద్రిపై వెంచేసిన సమస్త దేవతలు, సుర, మునులు పులకించారు. కల్యాణోత్సవంతో లక్ష్మీసమేతుడైన నరసింహుడు మహదానందంతో గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చి తరింపచేశారు.
తొలుత కొండపైన బాల ఆలయంలో ఉదయం 11గంటలకు నిర్వహించిన స్వామివారి తిరు కల్యాణోత్సవ వేడుకలో ముందుగా శ్రీరామ అలంకార సేవలో స్వామివారిని అలంకృతుడిని చేసిన అర్చక పండితులు హనుమత్ వాహనంపై విహరింపచేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యుల బృందం స్వామివారి కల్యాణోత్సవాలను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. గజవాహనంపై ఆసీనులైన వరుడు లక్ష్మీనరసింహుడిని, క్షీర సముద్ర తనయ, ముగ్ధమనోహరి లక్ష్మీదేవిలు ముత్యాల పల్లకిలో మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య పెళ్లి మండపానికి ఊరేగింపుగా వచ్చారు. స్వామివారి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించారు.
ఏటా తిరుమలేశుడి తరుపున అందించే పట్టువస్త్రాలను అంతకుముందుగానే టీటీడీ యాదగిరీశుడికి అందించింది. దేవస్థానం తరపున ఈవో గీత పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించారు. తిరు కల్యాణోత్సవంలో కలెక్టర్ అనితారామచంద్రన్, ధర్మకర్త బి.నరసింహమూర్తి భక్తులు, ఆలయ ఉద్యోగులు హాజరయ్యారు.
ప్రధానాలయం పునర్ నిర్మాణం నేపధ్యంలో స్వామివారి తిరు కల్యాణాన్ని కొండపైన బాల ఆలయంలో నిర్వహించిన అర్చక బృందం రాత్రి 8 గంటలకు కొండ కింద జిల్లా పరిషత్ పాఠశాలలో వైభవోత్సవ కల్యాణం వేలాది మంది భక్తుల సమక్షంలో శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో, దేదీప్యమాన విద్యుత్ దీపకాంతులతో అలంకరించిన పెళ్లి మండపంలో కొలువుతీరిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు శ్రీనివాసాచార్యులు విష్వక్సేనారాధనతో ఆరంభించారు. పంచ పుణ్యనది జలాల అవాహన, మండప సంప్రోక్షణ, రక్షబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ, మధుపర్క నివేదన, నూతన పట్టువస్రాలంకారణ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. లక్ష్మీదేవి తండ్రియైన సముద్రుడు నారసింహుడికి పాదప్రక్షాళన చేసి కన్యదానం చేయగా, జీలకర్ర బెల్లం ధారణ పిదప స్వామివారు అమ్మవారికి మంగళసూత్రధారణ చేసే ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఔన్నత్యాలతో కూడిన విశేషాలను, కల్యాణ ఘట్టాల ప్రాధాన్యతలను యాజ్ఞికులు భక్తులకు వివరిస్తూ కల్యాణోత్సవాన్ని ఆద్యంతం రసవత్తరంగా రమణీయంగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు ముత్యాల తలంబ్రధారణ చేసి బ్రహ్మముడులు వేసి మంగళనీరాజనలు, ఆశీర్వచనాల అనంతరం గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను ఆలయానికి చేర్చారు. కల్యాణోత్సవాల్లో కలెక్టర్ అనితా రామచంద్రన్, ఈవో గీత, ఆలయ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శనివారం స్వామివారికి గరుడ వాహన సేవ, రథోత్సవం నిర్వహిస్తారు.