రాష్ట్రీయం

స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో రెండోరోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవీ సమేతుడై తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన ఈ స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. అర్చకులు వసంతోత్సవ అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజన వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. మూడోరోజైన శుక్రవారం శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్లి వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారని తెలియజేశారు. వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు. ఈకార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, విఎస్వో మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.