రాష్ట్రీయం

దేశంలో రాజ్యసభ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24:రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. కులాలు, ప్రాంతాల డిమాండ్లతో టిడిపి అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడుపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఏపి నుంచి ఖాళీ అయ్యే నాలుగు సీట్ల భర్తీ ప్రక్రియలో మూడు స్థానాలు టిడిపి, ఒకటి వైఎస్సార్‌సీపీకి సులభంగా దక్కే అవకాశాలున్నాయి. అయితే వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపు నేపథ్యంలో, నాలుగోసీటుకు ఈసారి పారిశ్రామికవేత్తను బరిలోకి దించాలని టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. ఉన్న మూడు స్థానాల కోసం టిడిపిలో దాదాపు డజనుమంది ఆశావహులు కనే్నశారు. పైగా ప్రస్తుత కేంద్రమంత్రి సుజనా చౌదరికి పొడిగింపు వ్యవహారం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. విదేశీ బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంపై ప్రధాని సీరియస్‌గా ఉన్నారని, బాబుకు సైతం ఆ విషయం స్పష్టం చేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. దానికితోడు లోకేష్‌తో ఆయన సంబంధాలు బలహీనపడ్డాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇప్పుడు చౌదరికి పొడిగింపు ఇస్తే వచ్చేసారి జరిగే ఎన్నికల్లో మరికొందరు సిట్టింగులకూ అదే సూత్రం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే లోకేష్‌తో తన సంబంధాలను ఇటీవలికాలంలో పునరుద్ధరించుకున్నందున, మళ్లీ సుజనకు సీటు ఖాయమన్న మరో చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుకూడా సీరియస్‌గా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో పార్టీ-ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉన్న కంభంపాటి కోసం కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు కూడా సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్ కూడా సీటు ఆశిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వనందున, ఈసారయినా సీనియారిటీని గుర్తించాలంటున్నారు.
కొత్తగా పార్టీలో చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాయపాటి ఆశీస్సులతో లోకేష్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇద్దరూ దళితులే అయినప్పటికీ, పుష్పరాజ్ సీనియర్. ఆయనకు కాకుండా డొక్కాకు అవకాశం ఇస్తే, జిల్లాలో రాయపాటి అధిపత్యం పెరిగే అవకాశం ఉంది. పైగా దానిని సీనియర్లు వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
బీసీ, యాదవ వర్గానికి చెందిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు ఈసారి రాజ్యసభ సీటు ఖాయమని చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో యాదవవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకూడా టికెట్ అడుగుతున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ కోస్తాలో బీసీలు, అందులోనూ యాదవులకు రాజ్యసభ ఇవ్వలేదని, కాబట్టి ఆ కోటాలో బీదకు ఇవ్వాలని రాష్ట్ర యాదవ సంఘ నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు.
బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు మళ్లీ పొడిగింపు ఇస్తారా? లేదా? అన్న అంశంపైనా తర్జనభర్జన జరుగుతోంది. మోదీని కలసిన తర్వాత బాబు వైఖరి మారిందంటున్నారు. పార్టీ నేతలతో జరిగిన రెండు మూడు సమావేశాల్లో బిజెపిని దూరం చేసుకోవద్దని స్పష్టం చేశారు. ఆ కోణంలో చూస్తే ఆమెకు చివరి నిమిషంలో మళ్లీ పొడిగింపు ఇచ్చినా, ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.
ఇదిలాఉండగా, ఇప్పటికి 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన నేపథ్యంలో.. మరో 17 మంది చేరితే వైసీపీ అభ్యర్ధి ఓడిపోవడం ఖాయమైనందున, నాలుగో సీటుకూ పోటీ పడాలని దేశం నాయకత్వం యోచిస్తోంది. ఆ మేరకు ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అదే జిల్లాకు చెందిన వేమారెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామకృష్ణంరాజు, కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి టిజి వెంకటేష్ పేర్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే లోకేష్‌ను కలసి తమ ప్రతిపాదనను బయటపెట్టారంటున్నారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలతో తాము ఓట్లు వేయించుకుంటామన్న ప్రతిపాదనతో వచ్చినట్లు చెబుతున్నారు.
కాగా టిడిపి జాతీయ పార్టీగా రూపాంతరం చెందినందున, తెలంగాణ కోటాలో ఒకరికి రాజ్యసభ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎం అరవిందకుమార్‌గౌడ్ తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని బాబును కోరుతున్నారు. మోత్కుల్లికి గవర్నర్ అవకాశం లేనందున, కనీసం రాజ్యసభకయినా పంపాలని అభ్యర్థిస్తున్నారు.
ఈసారి కాపు, బీసీ, దళిత వర్గాలనుంచే ఎక్కువ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. కాపు ఉద్యమం నేపథ్యంలో తమకు ఒక సీటు ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో కూడా కోస్తానుంచి బీసీలకు ఇవ్వనందున తమకు ఒక సీటు ఇవ్వాలంటున్నారు. ఈసారి మాదిగ వర్గానికి అవకాశం కల్పించడం ద్వారా, మాదిగల వ్యతిరేకతను తగ్గించుకోవచ్చంటున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కమ్మ వర్గానికి చెందిన ఒకరికి సీటు ఇచ్చే సంప్రదాయం ఈసారి కూడా అమలయితే.. అది సుజనా చౌదరికి ఇస్తారా? లేక కంభంపాటికి ఇస్తారో చూడాల్సి ఉంది. జగన్ దూకుడు నేపథ్యంలో రెడ్డి వర్గానికి ఒకరికి తప్పకుండా సీటు ఇవ్వవచ్చంటున్నారు.