రాష్ట్రీయం

‘నరసింహా’వతారమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రం విడిపోయినా ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోయి, రెండుగా ఏర్పాటయిన తర్వాత కూడా, కీలకమైన అంశాలపై తరచూ తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో గవర్నర్ తన అధికారాలను వినియోగించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్, రెండు రాష్ట్రాల మధ్య గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్న కీలక అంశాలను పరిష్కరించడంలో ఆసక్తి ప్రదర్శించడం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విందులు, ఇఫ్తార్ విందులు, హోలీ సంబరాలు, దేవాలయ సందర్శనలకు ఇస్తున్న సమయంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న తగాదాలను పరిష్కరించడం కోసం, సగం కూడా ఇవ్వలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో జరిగిన నీటి సమరం, చివరకు రెండు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. నాగార్జునసాగర్ వేదికగా, రెండు రాష్ట్రాల పోలీసులు నేరుగా లాఠీలతో యుద్ధం చేసుకునే ప్రమాదం తలెత్తింది. అప్పుడు బాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పారు. తర్వాత గవర్నర్ సమక్షంలో తొలిసారి ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. అంటే అప్పుడు కూడా గవర్నర్ తన పాత్ర సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని, తమ వాదనకు మద్దతుగా గుర్తు చేస్తున్నారు.
మళ్లీ కృష్ణా నదీ జలాలపై చెలరేగిన పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల భారీ నీటిపారులదల శాఖ మంత్రులను కేంద్రమంత్రి ఉమాభారతి పిలిపించి, మధ్యవర్తిత్వం వహించి సమస్య పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. రెండు రాష్ట్రాల గవర్నర్‌గా విస్తృతాధికారాలు ఉన్న నరసింహన్ మాత్రం, ఆ పాటి చొరవ తీసుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఏపికి చెందిన న్యాయాధికారులు తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, వారిని సొంత రాష్ట్రానికి పంపాలన్న డిమాండుతో గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ కేంద్రంగా వివాదం సాగుతోంది. అధికారులు హైకోర్టులోపలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వ్యవహారం చివరకు ఢిల్లీకి చేరి, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జంతర్‌మంతర్‌లో దీక్ష చేస్తారనే వరకూ వెళ్లింది. ఏపికి చెందిన న్యాయాధికారులకు రక్షణ లేకుండా పోయిందని, వరంగల్‌లో ఏపికి చెందిన న్యాయాధికారిపై లాయర్లు దాడి చేసిన వైనం సంచలనం సృష్టిస్తే, కనీసం అప్పుడు కూడా గవర్నర్ స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గవర్నర్ తన విస్తృతాధికారాలను వినియోగించి, ఇద్దరు ముఖ్యమంత్రులనూ పిలిపించి, తగు హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం మేధావి, రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శాంతిభధ్రతల అంశం గవర్నర్ చేతిలోనే ఉన్నప్పటికీ, చివరకు హైకోర్టు, జిల్లా కోర్టుల వద్ద న్యాయాధికారులకే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపిలో పనిచేస్తున్న తెలంగాణ న్యాయాధికారుల విషయంలో కూడా, అక్కడి లాయర్లు ఇదే విధానం పాటిస్తే తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రం విడిపోకముందు నుంచీ గవర్నర్‌గా కొనసాగుతూ, విభజనలో కీలకపాత్ర పోషించి, ఎక్కడ ఎలాంటి సమస్యలొస్తాయో అవగాహన ఉన్న గవర్నర్, ఇప్పుడు సంక్షోభ సమయంలో శరవేగంగా స్పందించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌కు సలహాదారులుగా ఒక ఐఏఎస్, ఒక ఐపిఎస్‌ను నియమించారు. అయినా సాగునీరు, శాంతిభద్రతల అంశాలు ఉద్రిక్తంగా మారుతున్నాయంటే, వారేం సలహాలిస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గవర్నర్‌ను కేంద్రం కావాలనే ప్రోత్సహిస్తోందన్న అసంతృప్తి తెదేపాలో కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ తరచూ తనను కలుస్తున్న సందర్భంలోనయినా, నచ్చచెప్పాల్సిన గవర్నర్ ఆ పని చేయడం లేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇదేమాట టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెప్పారు. ఒక దశలో గవర్నర్‌ను బదిలీ చేయాలన్న అర్థంలో కూడా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో నియమితులైన గవర్నరును ఇంకా కొనసాగిస్తున్నారంటే, ఈ విషయంలో బిజెపి కూడా రాజకీయ క్రీడ కొనసాగిస్తోందన్న విషయం స్పష్టమవుతోందంటున్నారు. ఇప్పటికయినా గవర్నర్ రెండు రాష్ట్రాల సీఎంలను పిలిపించి, కీలక సమస్యలపై దిశానిర్దేశం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.