రాష్ట్రీయం

ఎస్సారెస్పీకి ఎల్లవేళలా జలకళ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీని అనుసంధానిస్తే శ్రీరాంసాగర్ రిజర్వాయర్ సైతం ఎల్లవేళలా పూర్తిస్థాయి జలకళతో తొణికిసలాడేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం సైతం కసరత్తులు కొనసాగిస్తుండడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం బాల్కొండ నియోజకవర్గ పర్యటనకు హాజరైన సందర్భంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎస్సారెస్పీ రిజర్వాయర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు వరంలా మారనుందని పేర్కొన్నారు. వాస్తవంగానే కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించేలా పనులు చేపడితే శ్రీరాంసాగర్ ప్రధాన కాల్వలతో పాటు ఎల్‌ఎండి కింద మొత్తంగా 11 లక్షల పైచిలుకు ఎకరాలకు సమృద్ధిగా సాగునీటిని అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధాన ఆధారంగా చేసుకుని మల్లన్నసాగర్ నిర్మాణం చేపట్టి, అక్కడి నుండి హల్దివాగు ద్వారా నిజాంసాగర్‌లోకి నీటిని మళ్లించేలా ఇదివరకే ప్రణాళికలు రూపొందించారు. అనంతరం నిజాంసాగర్ మిగులు జలాలు గోదావరి ద్వారా ఎస్సారెస్పీలోకి చేరుకుంటాయని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది దూరభారంగా మారి, పంప్‌హౌస్‌లు, లిఫ్టుల నిర్మాణాలకు అధిక వ్యయం అవుతున్న దరిమిలా, ఎస్సారెస్పీకి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుండే నీటిని మళ్లించేలా ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు రూపొందించడంలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాళేశ్వరం నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించనుండగా, అక్కడ నుండి వరద కాల్వ ద్వారా రివర్సబుల్ సిస్టమ్‌ను అనుసరిస్తూ 70 టిఎంసిల మేర నీటిని ఎస్సారెస్పీలోకి తరలించేలా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నట్టు ఇరిగేషన్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదే జరిగితే ఆశించిన స్థాయిలో వానలు కురియక ఒకింత వర్షాభావ పరిస్థితులు ఎదురైనా, ఎస్సారెస్పీ ఆయకట్టుకు మాత్రం సాగునీటి పరంగా ఎలాంటి ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వెలిబుచ్చుతున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోగలిగింది. అయితే అంతకుముందు వరుసగా రెండేళ్ల పాటు అంతంతమాత్రంగానే కురిసిన వానల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలను సమకూర్చుకోలేకపోయింది. కొద్దోగొప్పో కురిసిన వర్షాలతో వచ్చిన వరదలు కూడా బాబ్లీ వద్దే బంధించబడ్డాయి. దీంతో 2015లో ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో రూపంలో కేవలం 1 టిఎంసి మేరకు కూడా వరద నీరు వచ్చి చేరలేదు. ఎస్సారెస్పీకి గోదావరి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి వరద నీరు వచ్చి చేరాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోనే నిజామాబాద్ సరిహద్దున మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరికి అడ్డంగా బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. దీంతో బాబ్లీ బ్యారేజీ పుణ్యమా అని చుక్క నీరు కూడా దిగువన ఉన్న ఎస్సారెస్పీలోకి వచ్చి చేరడం లేదు. వర్షాకాలంలో బాబ్లీ గేట్లు తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అరకొర వర్షాలతో అత్తెసరు స్థాయిలో ఎస్సారెస్పీలోకి వచ్చి చేరే వరద నీరు కూడా, అనంతరం బాబ్లీ గేట్లు మూసివేయగానే రివర్స్ గేట్ల కారణంగా బాబ్లీ పరీవాహక ప్రాంతానికే చేరుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా శ్రీరాంసాగర్ పూర్తి స్థాయిలో నిండినప్పటికీ, త్వరితగతిన నీటి నిల్వలు తగ్గుముఖం పట్టేందుకు బాబ్లీ ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన రివర్స్ గేట్లు కూడా ఒక కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానిస్తే బాబ్లీ వల్ల వాటిల్లిన నష్టాన్ని కూడా నివారించుకున్నట్లవుతుందని, అరకొర వర్షాలు కురిసినా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీటిని అందించేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.