ఆంధ్రప్రదేశ్
ప్రమాదంలో పెన్నా డెల్టా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నెల్లూరు, ఫిబ్రవరి 19: ‘నెల్లూరు’ అనే పేరులోనే
మంచి ధాన్యాన్ని దాచుకున్న నెల్లూరు డెల్టా ప్రస్తుత
పరిస్థితి దైన్యంగా మారుతోంది. ఒకప్పుడు వరి
వంగడాల కోసం నెల్లూరులో ఇతర ప్రాంతాల రైతులు
క్యూ కట్టేవారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ, తూర్పు
కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ధాన్యం సరఫరాలో
నెల్లూరు డెల్టా రైతులదే కీలక భూమిక. కాని
వాతావరణ పరిస్థితులకనుగుణంగా నేతల పక్షపాత,
స్వలాభ ధోరణులతో పెన్నా డెల్టా కాస్త ప్రమాదంలో
పడిపోతోంది. సుమారు పెన్నా డెల్టా పరిధిలోని
సంగం, నెల్లూరు డెల్టాల్లో సుమారు 4.2 లక్షల
ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో సింహభాగం
ఏడాదికి రెండు పంటలు పండే సారవంతమైన
నీటిపారుదల కలిగిన భూమి. పెన్నా నది కృష్ణా,
గోదావరి వంటి జీవనది కాదు. కేవలం వర్షాధారిత
నదిగా పేర్కొనవచ్చు. సోమశిల పరీవాహక
ప్రాంతాల్లోని వాగుల ద్వారా జలాశయంలోకి చేరే నీరే
ఎక్కువగా ఉంటుంది. 70 టిఎంసిల సామర్థ్యం ఉండి
నికర జలాల గ్యారంటీ లేని ప్రాజెక్ట్ ఏదైనా రాష్ట్రంలో
ఉందంటే అది సోమశిలే అని చెప్పవచ్చు. కేవలం
మిగులు జలాల మీద ఆధారపడ్డ ఈ ప్రాజెక్ట్కు గత
కొనే్నళ్లుగా ఎటువంటి నీటి లభ్యత లేదు. ఏదో
వర్షాలు కురిస్తే తప్ప నీరు చేరదు. రాయలసీమలోని
కరవు ప్రాంతాలకు సాగునీటి కళను అందిస్తున్న
ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాను పూర్తిగా
విస్మరిస్తున్నారు. గతంలోనూ వైఎస్ రాజశేఖర్రెడ్డి
ఇదే తరహాలో సోమశిల నీటిని పులివెందులకు
తరలించేందుకు భారీ పైపులైను ఏర్పాటు చేశారు.
అధికారంలో ఎవరున్నా నెల్లూరు రైతుకు
మొండిచేయి తప్పదని స్పష్టమవుతోంది. పాలకులు
విస్మరించినా అడపాదడపా ప్రకృతి
కరుణిస్తుండడంతో ఎలాగోలా రెండు పంటలు
పండాల్సిన చోట ఒక పంటతోనైనా రైతులు
లాక్కొచ్చేస్తున్నారు. ట్రిబ్యునల్ ఆదేశాలతో
అందివచ్చిన కృష్ణా జలాలను గాలేరి-నగరి,
హంద్రి-నీవా, కడప జిల్లాలకు అందించిన రాష్ట్ర
ప్రభుత్వం నెల్లూరుజిల్లాను పూర్తిగా
గాలికొదిలేసిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రతియేటా సాగునీటి సలహా మండలి సమావేశాలు
నిర్వహించడం అటు అధికారులకు, ఇటు
ప్రజాప్రతినిధులకు తలకు మించిన భారంగా
మారుతోంది.
మూలిగే నక్కపై తాటిపండు
అసలే మిగులు జలాలపై ఆధారపడి దిగులు
దిగులుగా కాడెత్తుతున్న డెల్టా రైతుకు మూలిగే
నక్కపై తాటిపండు పడ్డ చందాన కొడవలూరు
మండలంలోని కిసాన్సెజ్లో ఏర్పాటవుతున్న
కోకాకోలా పరిశ్రమ పూర్తయితే ఇక పెన్నా డెల్టాను
మర్చిపోవచ్చని చెప్పడంలో ఎంతమాత్రం
అతిశయోక్తి లేదు. పారిశ్రామిక పురోగతి
అవసరమైనప్పటికీ అది వ్యవసాయాన్ని మింగేదిగా
ఉండకూడదని పర్యావరణ వేత్తలు హెచ్చరికలు
చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలకు 0.2 టిఎంసిల
నీటిని ఇచ్చే విధంగా గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. అయితే గుట్టుచప్పుడు లేకుండా ఈ
ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఇక్కడ ఏర్పాటయ్యే
పరిశ్రమలకు 4 టిఎంసిల నీటిని అందించేందుకు
ఉత్తర్వుల్లో సవరణలు తీసుకువచ్చినట్లు రైతు
సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలాఉంటే కోకాకోలా
పరిశ్రమకే ఈ నీటి లభ్యత సరిపోదని, మిగతా
పరిశ్రమల గురించి ఊహించడమే కష్టమని
భూగర్భజల నిపుణులు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. 150 ఎకరాల్లో ఏర్పాటవుతున్న
కోకాకోలా ఫ్యాక్టరీకి ఏడాదికి 1.2 టిఎంసిల నీరు
అవసరం. నెల్లూరు నగరంలో ఉండే 6 లక్షల మంది
జనాభా అవసరాలకు ఒక ఏడాదికి సరిపడే నీటి
పరిమాణానికి ఇది సమానం. అంతటితో ఆగకుండా
పానీయాల తయారీతో పాటు పరిశ్రమలో ఇతర
అవసరాలకు భారీగా నీటి అవసరం ఉంటుంది.
ఇందుకోసం విచ్చలవిడిగా భూగర్భ జలాలను
తోడేందుకు ఆ పరిశ్రమ ఏర్పాట్లు చేయక తప్పదు.
దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తాగునీటికి అవస్థలు
తప్పని పరిస్థితి. పార్టీలకతీతంగా కొందరు స్థానిక
ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు ఇప్పటికే ఈ
సమస్యపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి
వెళ్లాయి. ఇటీవల ఈ సెజ్లో గమేశా కంపెనీ
ప్రారంభానికి వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ
సమస్యను తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిస్థితిలో ఏ
మార్పు కనిపించడంలేదు. కోకాకోలా పరిశ్రమ
స్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కనిపించని రాజకీయ నేతలు
పెన్నా డెల్టాకు ఇంతటి ప్రమాదం
ముంచుకొస్తున్నప్పటికీ జిల్లాకు చెందిన అధికార,
ప్రతిపక్ష పార్టీల నేతల్లో సరైన స్పందన మృగ్యమైంది.
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సోమశిల
జలాలను పులివెందులకు తరలించేందుకు
ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ టిడిపి
పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సంగతి విదితమే.
ప్రస్తుతం ఆయన పార్టీనే జిల్లాకు ఇంత అన్యాయం
చేస్తుంటే ఆయనెందుకు వౌనం దాల్చారో అర్థం
కావడంలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో
పంటల్ని కాపాడాల్సిన సమయంలో చీకటిమాటున
కాళ్లూ, గడ్డాలు పట్టుకొని రహస్యంగా పోతిరెడ్డిపాడు
నుండి నీటిని తీసుకొచ్చి రైతుల్లో ఆందోళన
రాకుండా జాగ్రత్త పడుతున్న రాజకీయ నేతలు
ఉన్నంత కాలం పెన్నా డెల్టాకు పొంచి ఉన్న
ప్రమాదం సమయం కోసం కోరలు చాచి
ఎదురుచూస్తూనే ఉంటుంది.