రాష్ట్రీయం

మీ చావు మీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 9: ఏటా లక్షలు ధారపోసి పిల్లలను కార్పొరేట్ స్కూ ళ్లు, కాలేజీల హాస్టళ్లకు పంపితే అక్కడ జరిగే సంఘటనలకు యాజమాన్యాల బాధ్యత ఉండదట. ఆ మేరకు తలిదండ్రులు డిక్లరేషన్ ఇస్తేనే పిల్లలను హాస్టళ్లలో చేర్చుకుంటారట. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై చర్య తీసుకోలేని దుస్థితి ప్రభుత్వాల్లో నెలకొంది. కాలేజీలు డిక్లరేషన్ కత్తిని మెడపై పెడుతుంటే, ఎవరికి చెప్పుకోవాలో, చెబితే సీట్లు వస్తాయో రావోనన్న భయాందోళనలో తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. కరెన్సీ నోట్లే పరమావధిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోన్న ప్రై వేటు కాలేజీలకు సాగిలబడిన రెం డు తెలుగు రాష్ట్రాల పాలకుల నిలువెత్తు వైఫల్యానికి ఈ పరిస్థితి అద్దం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ విద్యార్థినీ విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లు, హాస్టళ్లు యమపాశంలా పరిణమించాయి. కార్పొరేట్ కాలేజీలు సాధిస్తున్న ఉతీర్ణతా శాతం, దానికి సంబంధించి చేస్తున్న ప్రచార ప్రభావానికి లోనవుతున్న తలిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచేందుకు పోటీ పడుతున్నారు. అందుకోసం అప్పులు చేసి కొందరు, పొలాలు తాకట్టు పెట్టి మరికొందరు లక్షల రూపాయలు కార్పొరేట్ కాలేజీల్లో కుమ్మరిస్తున్నారు. దీంతో తలిదండ్రుల అవసరాలు, వారికి తమ పిల్లల భవిష్యత్‌పై ఉన్న బలహీనతను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యాలు అడ్మిషన్ల సమయంలో చట్టవిరుద్ధమైన షరతులు విధించి, వాటికి అంగీకరిస్తేనే హాస్టళ్లలో చేర్చుకుంటామని బెదిరిస్తున్నాయి.
కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల హాస్టళ్లలో చేరిస్తే తమ పిల్లలు ఇక బయట తిరగకుండా, ఒళ్లు దగ్గర పెట్టుకుని చక్కగా చదువుకుంటారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకు తగినట్లే తమ హాస్టళ్లలో చదివే విద్యార్థినీ విద్యార్థులతో యాజమాన్యాలు సబ్జెక్టులను కఠిన పద్ధతుల్లో చదివిస్తున్నాయి. ఆక్రమంలో పిల్లలను రాక్షసంగా హింసించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవే. టీచర్ల హింసలు భరించలేక సున్నిత మనస్కులైన పలువురు విద్యార్థినీ విద్యార్థులు బలవన్మరణాలకు గురవుతున్న వార్తలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా, ఇంతవరకూ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆంధ్రలో మంత్రి పి నారాయణ స్వయంగా కాలేజీలు నడుపుతున్నారు. టిడిపికి చెందిన మరికొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు నడుపుతున్నారు. అటు తెలంగాణలో ఓ మంత్రికి ఆంధ్ర కార్పొరేట్ కాలేజీల్లో సింహభాగం వాటా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో కృష్ణా జిల్లా విజయవాడ, విశాఖ నగరాల్లోని హాస్టళ్లలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక్క విజయవాడలోనే ఇప్పటివరకూ 47మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఏపిలో సగటున ఏడాదికి 96మంది హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఏపిలో అనుమతిలేని 226 హాస్టళ్లను రద్దుచేస్తామని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మంత్రి నారాయణకు వియ్యంకుడైనందుకే ఆయన కాలేజీల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపై మంత్రి గంటా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైసిపి, వామపక్షాలు, కాంగ్రెస్, విద్యార్థి సంఘం ఎబివిపి ఆరోపిస్తున్నాయి. గతంలో వేసిన విచారణ కమిటీ నివేదిక ఏమయిందో కూడా తెలియడం లేదంటున్నాయి. వియ్యంకులిద్దరూ విద్యారంగాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నారని గత ఏడాది ఎబివిపి భారీ ఆందోళన నిర్వహించింది. ప్రస్తుతం ఏపిలో కొనసాగుతున్న మెజారిటీ హాస్టళ్లకు అనుమతులే లేవని తెలుస్తోంది. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి లెక్కలు, నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్న ప్రభుత్వం, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లలో మాత్రం వాటిని అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి నారాయణ కాలేజీ హాస్టళ్లలో తరచూ ఆత్మహత్యలు జరుగుతున్న వైనంపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వంలో కదలిక లేదు. అటు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ హాస్టల్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా తెలంగాణ ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తుండిపోతోందేతప్ప చర్యల కొరడా ఝుళిపించడం లేదు. ఈనేపథ్యంలో విపక్షాలు, మీడియా, విద్యార్థి సంఘాల విమర్శల నుంచి తప్పించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు డిక్లరేషన్ నిబంధనను తెరపైకి తెచ్చి తల్లిదండ్రులకు ఎటూపాలుపోని పరిస్థితి సృష్టిస్తున్నాయి. ఆ ప్రకారంగా ఇకపై హాస్టళ్లలో చేరిన పిల్లల బాగోగులకు యాజమాన్యాలకు సంబంధం లేదని, తమ ఇష్టప్రకారమే హాస్టళ్లలో చేర్పిస్తున్నట్టు డిక్లరేషన్‌ను తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు.
ఆవిధంగా డిక్లరేషన్ ఇస్తేనే హాస్టళ్లలో చేర్చుకుంటామని యాజమాన్యాలు కరాఖండీగా చెబుతుండటంతో దానికి అంగీకరించాలో, వద్దో కూడా తెలియని అగమ్యగోచర స్థితిలో తల్లిదండ్రులు చిక్కుకున్నారు. అయితే ఇది విద్యాహక్కు చట్టానికే కాకుండా సాధారణ చట్టాలకూ విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. హాస్టళ్లలో జరిగే మరణాలను తాము ప్రత్యేక కేసులుగా నమోదు చేయలేమని పోలీసులు స్పష్టం చేస్తుండగా, ఆ నిబంధనలన్నీ లోపాయికారీగా రూపొందించుకున్నవే తప్ప వాటితో తమకు సంబంధం లేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యదర్శి రాజారావు చెప్పారు. ‘అయినా అలాంటి నిబంధనలను తల్లిదండ్రులు ఏవిధంగా అంగీకరిస్తారో మాకర్థం కావడం లేదు. ఈ డిక్లరేషన్లతో మాకెలాంటి సంబంధం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.