రాష్ట్రీయం

భాగస్వామ్య సదస్సులో భద్రతా వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: భాగస్వామ్య సదస్సులో యంత్రాగాన్ని కలవరపెట్టేలా సోమవారం భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు కీలక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గ ప్రతినిధులు హాజరైన సదస్సుకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేసిన్నట్టు పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే సదస్సు రెండో రోజు చోటుచేసుకున్న ఘటనలతో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. దీంతో సీనియర్ పోలీసు అధికారులతోపాటు సిఎం, ఇతర మంత్రులు ఉలిక్కిపడ్డారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోనప్పటికీ ఒక అనామకుడు భాగస్వామ్య సదస్సు కీలక వేదికల వద్ద కలియతిరగడం, సాక్షాత్తూ సిఎం చాంబర్‌లోకి సైతం సునాయాసంగా ప్రవేశించడంతో భద్రతా సిబ్బంది కలవరపాటుకు లోనయ్యారు. సదస్సు జరుగుతున్న ఏపీఐఐసిసి ప్రాంగణం వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు దారితీసే మార్గాన్ని దిగ్బంధనం చేసి, విఐపిలకు సంబంధించినవి మినహా ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. అయితే సదస్సు రెండో రోజు సోమవారం మాత్రం ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ నేరుగా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సమావేశాలు జరుగుతున్న హాల్ 1, 2, 3ల్లోకి ప్రవేశించి, అక్కడ్నుంచి నేరుగా సిఎం విడిది చేసే చాంబర్‌లోకి సైతం చేరుకోగలిగాడు. సుమారు రెండు గంటల పాటు అజ్ఞాత వ్యక్తి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతంలో సంచరించినప్పటికీ ఎవరికీ ఎటువంటి అనుమానం కలగలేదు. అయితే అజ్ఞాత వ్యక్తి రెండోసారి సిఎం చాంబర్‌లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, అక్కడున్న భద్రతా సిబ్బంది అనుమానించి ప్రశ్నించారు. దీంతో బండారం బయటపడింది. పోలీసు విచారణతో అతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన రమేష్ నాయుడుగా బయటపడింది. గతంలో పలు మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోకి సోమవారం ఒక వ్యక్తి పోలీసు యూనిఫాంలో ప్రవేశించాడు. అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న భద్రతా సిబ్బంది నకిలీ పోలీసును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసు యంత్రాంగం చెప్పుకొచ్చింది. స్థానిక పోలీసులతో పాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎఆర్ పోలీసులను భద్రత కోసం నియమించారు. వేదిక ఏర్పాటు చేసిన ప్రాంతంలో సీనియర్ పోలీసు అధికారులను నియమించి, నిరంతరం పర్యవేక్షించారు. అయితే ఇంత భద్రతను తోసిరాజని అజ్ఞాత వ్యక్తులు కీలక ప్రాంతాల్లోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలావుండగా, వచ్చే నెల విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరగనుంది. ఇప్పటికే ఐఎఫ్‌ఆర్ భద్రతపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి జెవి రాముడు, అదనపు డిజిపిలు సురేంద్రబాబు, ఆర్‌పి ఠాకూర్ తదితరులు సమీక్షించడం గమనార్హం.

చిత్రం.. భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో సిఎం చాంబర్‌లోకి ప్రవేశించిన
నకిలీ ఐఏఎస్ రమేష్‌నాయుడిని విచారిస్తున్న పోలీసులు