ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. రాత్రి 7 నుంచి 8గంటల మధ్య వైఖానస ఆగమం ప్రకారం సంప్రదాయ బద్దంగా సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతోపాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. జ్యోతిష శాస్త్ర ప్రకారం చంద్రుడు సస్యకారకుడు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపజేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో నిర్వహిస్తారు. తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమవారాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతి రోజు ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, వేదపండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం నాడు శ్రీవారు ధరించనున్న పట్టువస్త్రాలను ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శనివారం సమర్పిస్తారు.

చిత్రం..తిరుమల శ్రీవారి ఆలయంలో విష్వక్సేనులవారిని ఊరేగింపుగా తీసుకువస్తున్న అర్చకస్వాములు