రాష్ట్రీయం

రిజర్వేషన్‌కు ‘కాపు’ కాస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 17: కాపు రిజర్వేషన్లు కొలిక్కి వస్తాయా? ఇప్పుడున్న రిజర్వేషన్ల సంఖ్య పెంచడం న్యాయబద్ధమా? విరుద్ధమా? ముందు బీసీలకు రిజర్వేషన్ల సంఖ్య పెంచకపోతే, కాపు రిజర్వేషన్ చెల్లుతుందా? రాజస్థాన్ సర్కారు పెంచిన ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తెరపైకొస్తున్న సందేహాలివి.
రాజస్థాన్‌లో గుజ్జర్లు, బంజారాలు, గడియా- లోహర్లకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును తీసుకువచ్చిన అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల, ఆ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 21 నుంచి 26 శాతానికి పెరుగుతాయి. ఫలితంగా విద్య, ఉద్యోగ రంగాల్లో మొత్తం రిజర్వేషన్ల కోటా 54 శాతానికి చేరుకుంటుంది. ఆ ప్రయత్నాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, దానిని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలిపేసింది. పరిపాలనాపరంగా లేదా ఇతర ఏ పద్ధతులలోనయినా తీసుకునే చర్యల్లో, మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా నియంత్రణ పాటించాలని సూచించింది.
ఏపీలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలం క్రితమే హామీ ఇచ్చింది. ఆ మేరకు జస్టిస్ మంజునాథతో ఒక కమిషన్ వేసింది. ఆ కమిటీ అధికారికంగా జనగణన ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కాపు రిజర్వేషన్‌పై ప్రభావం చూపిస్తుందా? లేదా? అన్న చర్చకు తెరలేచింది. తాజా తీర్పుతో కాపులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తితే, తమ రిజర్వేషన్ల మాటేమిటని కాపు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 25, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ (ఈ)కి 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ ప్రకారంగా కాపులకు బీసీ హోదా ఇవ్వాలంటే, ముందు తమ రిజర్వేషన్ల శాతం పెంచాలన్నది బీసీల వాదన. తమ సంఖ్య పెంచకుండా కాపులను తమతో కలిపితే సహించేది లేదని, కావాలంటే వారికి విడిగా ఇవ్వాలని
చాలాకాలం నుంచీ బీసీ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయ. ఈ నేపథ్యంలో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వాన్ని సంకటంలో పడేసినట్టయింది. సుదీర్ఘకాలం నుంచీ మంజునాథ కమిషన్ చేస్తున్న సర్వే ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ఈలోగా బీసీల నుంచి వస్తున్న వత్తిళ్లు, విమర్శలను దృష్టిలో ఉంచుకుని కాపులకు రాజకీయ రిజర్వేషన్లు తప్ప మిగిలిన రిజర్వేషన్లు మాత్రమే ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అటు టీడీపీ కాపు ప్రజాప్రతినిధులు కూడా భేటీ అయి తమకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని, విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తే సరిపోతుందని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీల అసలు ఆందోళనంతా కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే తాము దెబ్బతింటామన్నదే కావడంతో, దాన్ని గుర్తించిన బాబు వారికి భరోసా ఇచ్చేందుకే ఆ ప్రకటన చేశారు. అయితే, ఒకసారి రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అది ఫలానా కేటగిరికే పరిమితం కావలసిన పని ఉండదని, అన్నిటికీ వర్తిస్తాయని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బీసీ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు కూడా బీసీ (ఈ) హోదాలో పోటీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాపు రిజర్వేషన్‌పై ఏవిధంగా ముందుకు వెళ్లాలన్నది సందిగ్ధంగా మారింది. ఈ అంశంలో కేంద్రంతో అవసరం ఎక్కువగా ఉండటమే దానికి కారణం. పార్లమెంటులో బిల్లు చేయాలన్నా, 9వ షెడ్యూల్‌ను ప్రయోగించాలన్నా కేంద్రం అవసరం ఉంది. టీడీపీ-బీజేపీ సంబంధాలు సరిగాలేని పరిస్థితిలో అది సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఇది కచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అయితే, జనగణన చేసుకున్న తర్వాత రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఇదే సుప్రీంకోర్టు రెండు సందర్భాల్లో తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారంగా ముందు బీసీల రిజర్వేషన్ల సంఖ్య పెంచి, తర్వాత కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా వ్యవహరిస్తే బీసీలలో తిరుగుబాటు ఖాయం. ఈ విషయాన్ని నేను మంజునాథకు స్పష్టంగా వివరించా. కోర్టు తీర్పు కాపీలిచ్చా. ఇప్పటివరకూ బీసీల గణన చేయకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. మంజునాథ కమిషన్ రిపోర్టు ఇచ్చే దానిపైనే కాపులకు రిజర్వేషన్లు ఆధారపడి ఉన్నాయ’ని బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య వ్యాఖ్యానించారు.
కాగా జనగణన చేసిన తర్వాత రిజర్వేషన్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఇస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉంది. 259 ఆఫ్ 1994;13-7-2010, 356 ఆఫ్ 1994;31-5-2010 పేరుతో వచ్చిన తీర్పుల ప్రకారం.. జనగణన చేసిన తర్వాత సామాజికన్యాయం ప్రకారం అవసరం మేరకు రిజర్వేషన్ల సంఖ్య పెంచుకోవచ్చని స్పష్టం చేసింది.
9 షెడ్యూల్‌పై ఒత్తిడి తీసుకువస్తే?
అయితే, ఈ విషయంలో ధర్మ, చట్టసంకటం ఎదురైతే ప్రత్యామ్నాయంగా 9వ షెడ్యూల్ ఆయుధాన్ని ప్రయోగించే అంశంలోని సాధ్యాసాధ్యాలపైనా చర్చ జరుగుతోంది. చట్టసభలు చేసే కొన్ని కీలక చట్టాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా 9వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. చట్టసభలు చేసే చట్టాలను ఆ షెడ్యూల్ ప్రకారం కోర్టులు విచారించే అవకాశం ఉండదు. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ, రాజ్యాంగ వౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఏ అంశమైనా, అది ఏ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ న్యాయసమీక్షకు మినహాయింపు కాదని 2007లో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ ప్రకారంగా చూస్తే కేంద్రంపై ఒత్తిడి చేసి, 9వ షెడ్యూల్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నా జరిగే పనికాదని చెబుతున్నారు. అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల నేపథ్యంలో ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు సందేహమేనంటున్నారు.
కాపుల కోసం పార్లమెంటులో పెడతారా?
ఇవన్నీ కాకుండా కాపులకు రిజర్వేషన్ల బిల్లును ఇక్కడి చట్టసభ నుంచి పార్లమెంటు ఆమోదానికి పంపి, తమిళనాడు మాదిరిగా ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఉంది. అయితే, ఏపీలో ఒక్క కాపుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం రిస్కు తీసుకుంటుందా? అన్నది ఓ ప్రశ్న. నిజంగా అదే జరిగితే తమ సొంత ప్రభుత్వమే ఉన్న గుజరాత్‌లో పటేళ్లు, రాజస్థాన్‌లో గుజ్జర్లు, హర్యానాలో జాట్లు కూడా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాలు చేసిన రిజర్వేషన్ల బిల్లును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఆ ప్రకారంగా.. తమిళనాడు మాదిరిగా కాపు రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తే, తమ సొంత రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ల మేరకు చేసిన రిజర్వేషన్ బిల్లులకూ బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో బీజేపీ అంత సాహసం చేస్తుందా అన్నది మరో సందేహం. ‘ఇదంతా తప్పించుకునే ఎత్తుగడ. తమిళనాడు మాదిరిగా పార్లమెంటులో చట్టబద్ధత తీసుకురాకపోతే టీడీపీ ప్రభుత్వం చేసేవి కంటితుడుపు ప్రయత్నాలుగానే మారతాయి. పార్లమెంటులో చట్టబద్ధత కల్పించకపోతే రేపు ఎవరైనా కాపురిజర్వేషన్లపై కోర్టుకు వెళితే చుక్కెదురవడం ఖాయమ’ని పిసిసి అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది వి.గుర్నాధం వ్యాఖ్యానించారు.