రాష్ట్రీయం

‘దేశం’లో బీసీ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: తెలుగుదేశం పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలు భగ్గుమంటున్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. స్వయంగా అధికార పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, రిజర్వేషన్ ప్రకటించిన రోజునే రాష్ట్రంలో బీసీలు రోడ్డెక్కడం పార్టీకి తలనొప్పిలా మారింది. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చినా దానివల్ల బీసీలకు ఎలాంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తొలి నుంచీ చెబుతున్నారు. ప్రధానంగా బీసీలు భయపడుతున్నట్లు కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఉండవన్న దానిపై బాబు చాలాకాలం నుంచీ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. అయితే, దాన్ని అటు బీసీ మంత్రులు గానీ, ఇటు పార్టీ బీసీ నేతలు గానీ తమ వర్గాలకు వివరించకపోవడంతో ఇప్పుడు చిక్కులు వచ్చిపడుతున్నట్లు బీసీల ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాలతో అటు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న నేతలు చిక్కుల్లో పడ్డారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభ తీర్మానించిన రోజు కాపుప్రతినిధులంతా బాబుకు మిఠాయిలు తినిపించడం, కాపు నేతలు సంబరాలు చేసుకోవడం, సీఎం ప్లెక్సీలకు పాలాభిషేకం చేయడం వంటి ఆనందోత్సాహాలు బీసీ వర్గాలను మరింత రెచ్చగొట్టినట్టయింది. ఈ క్రమంలో కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు రిజర్వేషన్‌ను అడ్డుకోనందుకే కాపులు రిజర్వేషన్ సాధించుకోగలిగారని, తమ జాతి నేతల వైఫల్యమే దానికి కారణమన్న ఆగ్రహం బీసీ సంఘాల్లో రగులుకుంది. నిజానికి కాపు మంత్రులు, ప్రజాప్రతినిధులంతా మొదటి నుంచీ రిజర్వేషన్‌పై కలసికట్టుగా ఉంటూ వ్యూహాత్మకంగా సర్కారుపై ఒత్తిడి చేస్తుంటే, తమ జాతి నేతలంతా ఐకమత్యం లేక తమ వారసులకు ప్రాజెక్టులు సంపాదించుకోవడం, పదవులు పొందడం, కాపాడుకునే పనిలో ఉన్నారన్న ఆగ్రహం చాలాకాలం నుంచీ బీసీల్లో బహిరంగంగానే వ్యక్తమవుతోంది. రిజర్వేషన్ ప్రభావం మిగిలిన జిల్లాల కంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. దశాబ్దాల నుంచి బీసీ (శెట్టిబలిజ), కాపుల కులవైరం నేపథ్యంలో ఇప్పుడు కాపులను కూడా తమ జాబితాలో చేర్చడాన్ని ఆ రెండు జిల్లాల్లో అధికంగా ఉన్న శెట్టిబలిజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రిజర్వేషన్ ప్రకటించిన రోజు రోడ్డెక్కి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన బీసీ వర్గాల్లో శెట్టిబలిజలే ముందువరసలో ఉండటం గమనార్హం. ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి పీతాని సత్యనారాయణ విదేశాల్లో ఉండగా, కాపు రిజర్వేషన్లకు తన పార్టీ మద్దతు ఇస్తున్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని సైతం ధిక్కరించిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కడాన్ని చూస్తే.. దీనిపై బీసీలు ఏ స్థాయిలో భగ్గుమంటున్నారో స్పష్టమవుతోంది. గోదావరి జిల్లాల్లో మెజారిటీగా ఉన్న శెట్టిబలిజలు టీడీపీకి సంప్రదాయ మద్దతుదారులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు
రిజర్వేషన్ నిర్ణయంతో వారు కూడా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఇక తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాయకత్వమే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య కూడా కాపు రిజర్వేషన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం పార్టీకి సంకటంగా పరిణమించింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ప్రకటించిందని, దీన్ని తాము అడ్డుకోవడంతో పాటు బీసీ సంఘాల్లో చైతన్యం తెస్తామని ఆయన ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి ఏపీలో పర్యటిస్తూ కాపులకు రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాచర్ల సభలో హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఏపీలో బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటు కాపు రిజర్వేషన్‌పై గతంలోనే కోర్టుకెళ్లిన బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య ఈ నెల 10న గుంటూరులో బీసీ గర్జన నిర్వహించనున్నారు. ఇప్పటికే కృష్ణయ్య వర్గానికి చెందిన ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు నేతృత్వంలో రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి. శనివారం నాటి పరిణామాల తీవ్రత గమనించి.. బీసీల ఆందోళనను తగ్గించి, వారిని శాంతపరిచేందుకు టీడీపీ నాయకత్వం బీసీ మంత్రులను రంగంలోకి దింపింది. వారి మాట బీసీ సంఘాలు ఎంతవరకూ వింటాయో చూడాలి.