రాష్ట్రీయం
నేనేంటో.. నాకు తెలుసు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం, డిసెంబర్ 6: తన రాజకీయ భవిష్యత్పై నిన్న మొన్నటి వరకూ స్పష్టత లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ ప్రయాణంపై స్పష్టత తీసుకున్నట్టు కనిపిస్తోంది. విశాఖలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల తొలి సమావేశంలో పవన్ విసిరిన పంచ్ డైలాగులు అన్ని రాజకీయ పార్టీలను ఒక్కసారిగా అయోమయంలో పడేశాయ. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు కాపుకాసిన పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారోనన్న అంశంపై రాజకీయ పార్టీల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ట్రంప్ కార్డుగా వాడుకోవాలని టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. పవన్కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడొద్దని బీజేపీ అధిష్ఠానం పార్టీ శ్రేణులకు సూచించడం వలనే, మోదీపై పవన్ ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు చేసినా ఆ పార్టీ నేతలు స్పందించలేదు. ఇక జగన్ దూకుడును తట్టుకోవాలంటే పవన్ను పవర్ఫుల్ వెపన్గా వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే, బుధవారం విశాఖ వేదికగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, రెండు పార్టీలకు సమాన దూరాన్ని పాటిస్తానే తప్ప మద్దతిచ్చేది లేదని కుండ బద్దలు కొట్టేశారు. అలాగే, వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పేశారు.
రాజకీయంగా ఎదగాలంటే అనుభవం కలిగిన రాజకీయ పార్టీల సహకారం కొంతవరకూ తీసుకోవాలని, దాని ఆసరాగా ఎదగాలని పవన్ తన ప్రసంగంలో పేర్కొనడం వెనుక ఆయన దూరాలోచనను అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ, టీడీపీల నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుని, ఇప్పుడు తన స్కూలు తనే నడుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు భావిస్తున్నారు.
2019లో ఎవరెవరిని ఏయే విధంగా ఎదుర్కోవాలో తనకు తెలుసని పవన్ ప్రకటించడాన్ని విశే్లషిస్తే, తన రాజకీయ ప్రత్యర్థులను ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టు అర్థమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు దేశంలో, రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన చేయగలరన్న నమ్మకంతో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. నాలుగేళ్లుగా ఈ రెండు పార్టీలు ఏదో అద్భుతాన్ని చేస్తాయని వేచి చూసినా ఫలితం లేదని తేలిపోయిందని పవన్ ప్రకటించడం చూస్తే, ఈ రెండు పార్టీలపై ఆయన విశ్వాసం కోల్పోయినట్టు అర్థమవుతోంది. రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడినప్పుడు జగన్ను ఎండగడుతూనే, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని పవన్ పేర్కొనడం గమనార్హం.
ఇక ప్రజారాజ్యం పార్టీకి జరిగిన ద్రోహాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పీఆర్పీ ఓటమి బాధ ఆయన గుండెల్లో గూడుకట్టుకుపోయినట్టు అర్థమవుతోంది. పీఆర్పీలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో కొత్త రక్తం నింపేందుకు జనసేన పార్టీని స్థాపించానని చెబుతూ, ప్రజలకు పార్టీ కార్యకర్తలు వెన్నుదన్నుగా నిలబడాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తి చేసి, పూర్తి కాలాన్ని పార్టీ కోసం వెచ్చిస్తానని పవన్ స్పష్టం చేయడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో కొంత ఉత్సాహం... అంతే నిరుత్సాహం కనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయ. పాదయాత్రపై అభిమానులు మాట్లాడినప్పుడు ‘సీఎం కావాలని కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు. సీఎం కావాలని నాకు లేదు కాబట్టి, పాదయాత్ర చేయను’ అని స్పష్టం చేశారు. జనవరి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తరువాత పార్లమెంట్ స్థాయా కమిటీలతో పార్టీ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అంటే, 2019 ఎన్నికల్లో ఒంటరి పోరాటానికే పవన్ పునాదులు వేస్తున్నట్టు చెప్పవచ్చు.
‘పవర్’ పంచ్లు
* చంద్రబాబు నన్ను వాడుకుని వదిలేస్తాడని నాకు తెలియదా?
* కొన్ని రాజకీయ పార్టీలు భవిష్యత్లో నన్ను దెబ్బతీస్తాయని తెలుసు. పీఆర్పీలో స్వపక్షీయులు కొట్టిన దెబ్బను తట్టుకున్న వాడిని. బయట వారు నన్ను చంపేయడానికి కూడా వెనకాడరని నాకు తెలుసు.
* రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ తప్పు చేసింది. అయితే, అందరితో ఒకేసారి శత్రుత్వం దేనికని ఆలోచిస్తున్నా.
* నన్ను ఇప్పటి నుంచే సీఎం చేయకండి. అందరూ చేసిన రొటీన్ నినాదాలు జనసేన చేయదని అనుకుంటున్నాను.