రాష్ట్రీయం

బెజవాడలో భారీ భూదందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 28: నకిలీ ధృవీకరణ పత్రాలతో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయాలనే కుట్ర విజయవాడ కేంద్రంగా సీఐడీ విచారణలో వెలుగుచూసింది. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన భూమిని కైవసం చేసుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు, 47వ డివిజన్ కార్పొరేటర్ గండు మహేష్ చక్రం తిప్పాడు. భూమిని ఎమ్మెల్యే భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. అయితే విక్రేతలు భూమికి అసలు హక్కుదారులు కాదు. అనామకులను హక్కుదారులుగా సృష్టించిన నకిలీ పత్రాలతో తతంగం పూర్తిచేశారు. విషయం తెలుసుకున్న భూమి తాలూకా వారసుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు రామిశెట్టి కోటేశ్వరరావు, ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాత సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడే కథం అడ్డం తిరిగింది. సీఐడీ కేసులో నిందితుడైన రామిశెట్టి కోటేశ్వరరావు ఇప్పుడు అప్రూవర్‌గా మారాడు. కుంభకోణంతో తనకు సంబంధమే లేదని, తనకు తెలియకుండా జరిపించిన తతంగమని చెబుతున్నాడు. గండు మహేష్, ఎమ్మెల్యే బొండా ఉమా సహా మరికొందరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఆదివారం నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్‌ను వేడుకున్నాడు. దీంతో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఇలాకాలోని సుమారు 40కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణం సంచలనానికి తెరతీసింది.
ఇదీ.. కథా క్రమం!
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గండూరి మహేష్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు. ఇతని వద్ద కారుడ్రైవర్‌గా పనిచేసిన రామిశెట్టి సురేంద్రకు డబ్బు అవసరమై తన తండ్రి రామిశెట్టి కోటేశ్వరరావు పేరిట ఉన్న ఇంటి కాగితాలు తనఖా పెట్టుకొని రూ. 5 లక్షలు అప్పు ఇవ్వాల్సిందిగా మహేష్‌ను కోరాడు. దీంతో కోటేశ్వరరావు వద్ద నుంచి ఖాళీ స్టాంపు పేపర్లపై మహేష్ సంతకాలు చేయించుకున్నాడు. తాలూకా
ఆఫీసు, రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సంతకాలు తీసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఇంటి కాగితాలు పనికిరావని, అప్పు ఇవ్వడం కుదరదని చెప్పి వారిని పంపేశారు.
స్వాతంత్య్ర యోధుని స్థలంపై కన్ను
నగరంలోని మొగ్రలాజపురానికి చెందిన కె సురేష్ అనే వ్యక్తి 2017లో సీఐడీ అదనపు డీజీ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశాడు. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతకు ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు అమ్ముకోగా, ప్రస్తుతమున్న మరో 5 ఎకరాలను కొందరు వ్యక్తులు తప్పుడు ధృవీకరణ ప్రతాలతో కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సదరు భూమి 5 ఎకరాల్లో రెండున్నర ఎకరాలు మస్తాన్, మరో రెండున్నర ఎకరాలు రామిశెట్టి కోటేశ్వరరావు పేర్లతో ఉన్నట్లు, వాటిని విక్రయ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. దీంతో ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. అప్పు కోసం వచ్చిన కోటేశ్వరరావు సంతకాలు సేకరించి స్వాతంత్య్ర సమరయోధుని స్థలానికి యజమానిని చేసి, దాన్ని అతను అమ్మినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసుకున్నారు. దీంతో సీఐడీ కేసులో మొదటి నిందితునిగా మస్తాన్, రెండో నిందితునిగా రామిశెట్టి కోటేశ్వరరావు, ఎనిమిదో నిందితురాలిగా బొండా ఉమా భార్య సుజాత, అదేవిధంగా రియల్టర్లు మాగంటి బాబు, ఫణుగు రమేష్ సహా ఎనిమిది మంది ఉన్నారు.
అప్రూవర్‌గా మారిన కోటేశ్వరావు
విచారణలో భాగంగా కోటేశ్వరరావు ఇంటిపై సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. దీంతో కోటేశ్వరరావు కంగుతిన్నాడు. అతన్ని విచారించిన సీఐడీ అధికారుల వద్ద వాంగ్మూలమిచ్చాడు. తన సంతకాలు తీసుకున్నారని, వాటి ఆధారంగా ఇంతటి కుంభకుణానికి పాల్పడ్డారన్న విషయం తనకు తెలియదని చెప్పాడు. అధికారులు జడ్జి సమక్షంలో అతని వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదే సమయంలో అతనిపై కార్పొరేటర్ గండూరి మహేష్, అతని అనుచరుల నుంచి ఒత్తిడి రావడంతో తనకు ప్రాణహాని ఉందని జడ్జి దృష్టికి తీసుకొచ్చాడు. ఆయన ఆదేశాలతో సీఐడీ అధికారులు కృష్ణలంక పోలీస్టేషన్‌కు తీసుకెళ్లగా బాధితుడు కోటేశ్వరరావు రాతపూర్వంగా ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో సీఐడీ కేసు నిందితులు 8 మందితో పాటు ఎమ్మెల్యే బొండా ఉమా, మరికొందరు పేర్లు పేర్కొన్నాడు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో ఆదివారం ఉదయం నగర పోలీసు కమిషనర్‌ను కలిసి తనకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. కేసు విచారణను నగర డీసీపీ క్రాంతిరానా టాటాకు అప్పగించిన సీపీ అతనికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న కోటేశ్వరరావు