ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ నుంచి ఇంటింటికీ బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి అక్టోబర్ నుంచి ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో బుధవారం జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సమావేశంలో కన్నా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి మంజూరుచేస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కనీసం మూడు పథకాల వివరాలను చెప్పగలరా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు కావాలనే ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖకు అధిక నిధులు కేటాయిస్తోందని, ఈ శాఖకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రుల కుమారులే మంత్రులుగా ఉన్నారని, దీంతో వారు హైలైట్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా, భూకబ్జాలు విపరీతంగా పెరిగాయని, వీటన్నిటికీ ఎమ్మెల్యేలు పాత్రధారులు కాగా చంద్రబాబు సూత్రధారి అని విమర్శించారు. 2010లో బాబ్లీ ఘటన జరిగి, అప్పటి నుండి 37 సమన్లకు స్పందించకపోవడంతో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీచేస్తే, దాని వెనక ప్రధాని మోదీ ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. న్యాయ స్థానం ఆదేశాలను ఖాతరు చేయని చంద్రబాబుకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సునీల్ దేవదర్ మాట్లాడుతూ కేంద్రం నుండి నిధులు తెచ్చుకుని చంద్రబాబు చందాల బాబుగా మారారని విమర్శించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. అమరావతిలో రైతుల నుండి బలవంతంగా భూములు సేకరించి, ఇపుడా భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని విమర్శించారు. పని లేని టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీల్లో నియమించి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మన ఓట్లు మన పార్టీకే వేసుకోవాలని, వైసీపీ వైపు ఓట్లు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ రైతులు తమ పంటలకు సాగునీరు, గిట్టుబాటు ధర మాత్రమే అడుగుతారని, అవి కూడా సమకూర్చలేని స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందన్నారు. రతనాల సీమగా ఉండాల్సిన రాయలసీమ ఇపుడు రాళ్ళ సీమగా మారిపోయిందన్నారు. గాలేరు, హంద్రీనీవా పథకాలను ప్రభుత్వం పూర్తిచేయకుండా తీవ్ర తాత్సారం వహిస్తోందని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తివిరుద్ధ పార్టీలని, కేవలం మోదీని ఓడించడం కోసమే ఆ రెండు పార్టీలూ జత కట్టాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నిధులు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివని వ్యాఖ్యానించారు. సభకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షత వహించారు. అఖిల భారత కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కే సుగుణాకరరావు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు.