సబ్ ఫీచర్

బౌద్ధం పరిఢవిల్లిన నేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ జిల్లా గతకీర్తికీ, ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచి వెలుగుతోంది. రాష్ట్ర పురావస్తుశాఖ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా ప్రాక్చచరిత్ర 50 వేల సంవత్సరాలకు పూర్వమున్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీకాదు. గౌతమీనదీ దక్షిణ తీరాన ఉన్న ఈజిల్లాలో ఔత్సాహికులైన చారిత్రక పరిశోధకుల అవిరళ కృషి ఫలితంగా ఆక్కడక్కడా నిక్షిప్తమైయున్న చరిత్ర కొంతవరకు వెలుగులోనికి రాగలిగింది.
చరిత్రలో ఆంధ్రులకు సంబంధించినంతవరకు, శాతవాహనులదే మొట్టమొదటి రాజవంశమని, అదీ మహారాష్టల్రోని పైఠానో లేక నాసిక్ ప్రాం తమో అనుకుంటే కాదు. అంతకు ముందే పురాణాలలో పేర్కొనబడిన ఆంధ్ర భృత్యులని, తొలి ఆంధ్ర ప్రభువుల సేవకులనే విషయాలు కోటి లింగాల తవ్వకాలలో బయల్పడడం విశేషం. కరీంనగర్ జిల్లానే శాతవాహనుల మూల పురుషులకు ఆవాసస్థానమని చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీముఖునికి చెందిన నాణేలను, ధర్మపురి వాస్తవ్యుడైన చారిత్రక పరిశోధకులు, దివంగత సంగనభట్ల నరహరిశర్మ కనుగొన్నారు. దీంతో శాతవాహన వంశానికి మూలపురుషుడనదగిన శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పాలించాడని రుజువెంది. క్రీస్తునకు పూ ర్వమే ఆంధ్ర రాజ్యం శాతవాహనుల ఏలుబడిలోవర్థిల్లగా, వారి అభిమాన బౌద్ధమతం, ఈప్రాంత ప్రజల ఆరాధ్యమతమై విరాజిల్లింది. ఇక్కడి ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో, ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడంలో, వస్తువుల్లో, మట్టిపాత్రల్లో, మతంతో పెన వేసుకున్న చరిత్ర ఉంది. నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, వెలకట్టలేని వేలసంవత్సరాల చరిత్రకు వౌన సాక్షీభూతాలుగా ఉన్నాయ.
నిన్నటివరకూ ఆలనా పాలనా కరువైన ధర్మపురి మండలంలోని పాషాయిగాం బౌద్ధస్థూపం, ఒక కంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా నేలమట్టమయింది. క్రీ.పూ.6వ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతాలలో బౌద్ధమత వ్యాప్తి జరిగినా అశోకుని కాలంకన్నా ముందే దక్కనులో ప్రవేశించిన బౌద్ధమతం శాతవాహనుల హయాంలో విశేషాదరణ పొందింది. నాడు కరీంనగర్ జిల్లాలో మూడు ప్రాచీన బౌద్ధ కేంద్రాలుండేవి. వాటిలోని ధర్మపురి మండలంలోని క్రీ.పూ.200 సంవత్సరకాల సంబంధిత పాషాయిగాం బౌద్ధస్థూపానికి విశేష ప్రాధాన్యత ఉండేది. దీనికి ఆరు వృత్తాకార పలకలండేవి. వీటిపై ఒకపద్మం, ఏనుగు బొమ్మలు, స్థూపానికిరువైపులా స్థంభాకృతులున్న ఆస్థూపం, క్రీ.శ.రెండవ శతాబ్దానికి చెందినదిగా, ధూళికట్ట స్థూపం కన్నా ప్రాచీనమైనదిగా, జిల్లాలోని మొట్టమొదటి రాతికట్టడంగా చరిత్రకారులు రుజువు చేశారు.
క్రీ.పూ. 2వ శతాబ్దపు ‘‘నాగసింపీయకాయ, జమజో, రాగబ్రహ్మ లేఖలు’’ స్థూపంవద్ద లభ్యమైనాయి. శాత వాహనుల తొలి రాజధానియైన కోటిలింగాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ధర్మపురి మండలంలోని పాషాయిగాం గుట్టపై చెన్నపూస అనే ఆచార్యుడు, బౌద్ధ స్థూపాన్ని నిర్మించినట్లు, సుప్రసిద్ధ బౌద్ధాచార్యుడు దిగ్నాగుడు ఈప్రాంతం వారేనని, చైనా యాత్రికుడు హ్యూన్‌త్సాంగ్ 7వ శతాబ్దంలో, తన గ్రంథంలో పేర్కొన్నారని, రాష్ట్ర పురావస్తుశాఖ మాజి డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ, వెల్లడించారు. ఇంతటి ప్రాచీన చారిత్రాధారమైన బౌద్ధస్థూపాన్ని సదరు కాం ట్రాక్టర్ 1999 డిసెంబర్ 25వ తేదీన కూల్చివేశాడు. ఆతర్వాత ముక్కలైన ఆస్థూప ఫలకలను చేర్చి, జిల్లా కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపరచి, తిరిగి స్థాపించడం జరిగింది. తత్ఫలితంగా పాషాయిగాంకు చెందిన బౌద్ధస్థూపం కనుమరుగై, ఈప్రాంతం చరిత్ర పుటల్లోంచి తొలగించబడి, ప్రాచీనత్వాన్ని కోల్పోయింది.
అలాగే జూలపెల్లి మండలంలో క్రీ.పూ.2వ శతాబ్దికి చెందిన, హుసేనియావాగు - చిన్నవాగుల సంగమ స్థానంలో 47 శిల్పాలంకృత పలకలచే శోభితమైన, ఐదు పడగల ముచిలింద నాగము, బోధివృక్షం, మహాభినిష్క్రమణం చెక్కబడిన ధూళికట్ట స్థూపం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. కాలచక్ర నిర్వహణకై, ధూళికట్టనుండి అపురూప స్థూప పలకాలను అమరావతికి ఇటీవలికాలంలో తరలించారు. కోటిలింగాల, ధూళికట్ట, మీర్జంపేట మానేరు తీరాన చారిత్రిక శిల్పాలను, స్థూపాలను, కోటలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కేటాయించిన 38లక్షలకు పైగా నిధులు, అర్థాంతరంగా మళ్ళించబడినాయి. స్థూపాలు, ప్రాచీన కట్టడాలు, బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, అపురూప కళాకృతులు, ఈనాటి వారికి తెలియక పోవచ్చుగాని, వాటికి వెలకట్టలేని చారిత్రిక నేపథ్యం ఉందన్న యదార్థాన్ని విస్మరించరాదు.
chitram...

ధూళికట్ట బౌద్ధ స్థూపం

- ఎస్.రామకృష్ణయ్య