సబ్ ఫీచర్

సాహితీ సవ్యసాచి పోతుకూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంత విశ్వంలో ఊహకందని అద్భుతాలు. ప్రకృతిలో భాగంగా మానవాళి మనుగడ. మానవులంతా ఒకటే అయినా మానవుల్లో దానవులుండే ఈ కాలంలో, మానవతామూర్తులెందరో ఈ సంసార సాగరంలో మనకు తటస్థపడతారు. అలాంటి వారిలో మనకు తెల్సిన పోతుకూచి సాంబశివరావుగారొకరు. విశ్వసాహితీ, విశ్వ, విశ్వరచనలకు సంపాదకునిగా, సమాజక్షేమమే ధ్యేయంగా, శాంతి ఉద్యమాన్ని స్వాగతించిన సంస్థ కృష్ణచైతన్యకు రథసారధిగా, ఉత్తమ విలువలను ఆశించే ఒక మంచి న్యాయవాది మన కృష్ణానంద పోతుకూచి. ఈ పోటీ ప్రపంచంలో సాహితీపరంగా ఎంత గట్టి పోటీవున్నా, రాజకీయాలు చోటుచేసుకున్నా నిలబడేది మనం రచించిన అక్షరమే అనేవారు ఈ ఆల్ రౌండర్. వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగానూ పోతుకూచిది ఒక ప్రత్యేక శైలి. రచయితగా, కవిగా, సినిమా నవలా రచయితగా, ఆధ్యాత్మిక రచయితగా, సంపాదకునిగా, సాంస్కృతీ సంస్థ అధినేతగా అందరి మన్ననలనూ అందుకున్నారు. ఎందరో కళాకారులను ప్రోత్సహించి వారిలోని కళను వెలికితీసి ప్రోత్సహించారు. యువ రచయితల ఆత్మీయతను పొందిన ఒక గొప్ప వ్యక్తి మన సాంబశివరావుగారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడంలో తాను ప్రధాన పాత్రను నిర్వహించానని గర్వంగా చెప్పుకునేవారు. ఆ తర్వాత ఎన్నో సాహితీ సభలూ, సమావేశాలూ, గోష్టులూ నిర్వహించి తమ కార్యదక్షతను నిరూపించుకున్నారు. సాంస్కృతిక రంగంలో ప్రతిభావంతులను పైకి రానివ్వడం లేదనీ, పైరవీలు చేసేవారే పైకొస్తున్నారనీ బాధపడేవారు.
అనేక అవార్డులూ, సన్మానాలూ పోతుకూచి వారిని వరించాయి. కళాప్రపూర్ణ బిరుదునూ డాక్టరేట్‌నూ ఆంధ్ర యూనివర్సిటీ నుండి పొందారు. అఖిల భారత భాషా సమ్మేళన్ (్భపాల్) వారినుండి జాతీయస్థాయి రాష్ట్ర భాషా గౌరవ పురస్కారాన్ని, భారత్ భాషా భూషణ్ బిరుదునూ పొందారు. సురవరం ప్రతాప్‌రెడ్డి అవార్డు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ నుండి ధర్మనిధి పురస్కారాలూ పొందారు. ఉస్మానియా సెనేట్ మెంబరు, రీజనల్ సెన్సార్ బోర్డు మెంబరు, సాహిత్య అకాడమీ మెంబరు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, ఎ.పి. నాట్య సంఘం కార్యదర్శిగా ఆయన సేవలు మరువరానివి. ఇలా ఎన్నో సాహితీ సాంస్కృతిక సమితులకు ముఖ్యకార్యదర్శిగా ఎన్నో సంవత్సరాలు తమ సేవ అందించి అందరి మెప్పునూ పొందారు.
ఇక వీరి రచనల విషయానికొస్తే ఒక్క తెలుగులోనే గాక, వీరి రచనలు ఆంగ్లంలోనూ వెలువడినాయి. కథలూ, కవితలూ, గేయాలూ, పాటలూ, వ్యాసాలు, విమర్శలూ, నవలలూ, పిల్లల కథలూ, హాస్య రచనలూ చేసేవారు. సుమారు 300లకు పైగా కథలు రాసారు. కొన్ని కథలు ఆంగ్లము, హిందీ, రష్యన్, జర్మనీ, కన్నడ, తమిళం వంటి భాషల్లోకి అనువదింపబడినాయి. ఎన్నో రేడియో నాటికలు వ్రాసారు. 2007వ సంవత్సరంలోనే పోతుకూచి తమ సాహితీ షష్ఠిపూర్తిని జరుపుకున్నారు. చుక్కలు అనే కొత్త సాహితీ ప్రక్రియను వీరు సాహితీ లోకానికి అందించారు. అరవై సంవత్సరాలకు పైబడి సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన పోతుకూచి, తాను ప్రభుత్వ సహాయం లేకుండానే, ప్రజాదరణతోటే తాను వేలాది కార్యక్రమాలు విశ్వసాహితి ద్వారా నిర్వహించానని ఎంతో ఆనందంగా చెప్పేవారు.
ఆయన బ్రహ్మచారి. అందుకే తనకు అంత సమయం దొరికేదనీ, ఎన్నో కార్యక్రమాలను నిర్వహించే శక్తి ఆ శ్రీకృష్ణపరమాత్మ ప్రసాదించాడనీ చెప్పేవారు. అంతేకాదు ఆయనను ఆ కృష్ణపరమాత్మ అన్నివేళలా ఆదుకుంటున్నాడనీ, పిలిస్తే పలుకుతున్నాడనీ ఎంతో భక్తిప్రపత్తులతో పలుసార్లు అనేవారు. ఆ కృష్ణుడి పేరుతోనే కృష్ణచైతన్య అనే సంస్థను స్థాపించి, తద్వారా అవినీతి నిర్మూలన, పర్యావరణ కాలుష్య నివారణ వంటి అంశాలపై విశేషంగా కృషిసల్పారు. శ్రీకృష్ణపరమాత్మే అన్నీ సమకూరుస్తున్నారని గట్టిగా చెబుతుంటే విన్నవారికి వారిలో ఆధ్యాత్మిక ఆనందాన్ని కనులారా చూడగలిగేవారు. ఆయన స్వగృహానికి వెళ్తే, పోతుకూచివారు ఒక ఖాదీ టవల్ మొలకు చుట్టుకుని, తలకు బాబావారిలా గుడ్డ చుట్టుకుని, చేతిలో ఒక దండంతో, పరమాచార్య వారిలా గోచరించేవారు.

- డా. పులివర్తి కృష్ణమూర్తి