సబ్ ఫీచర్

వాగ్గేయకారుడు రామదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు భక్త రామదాసు జయంతి సందర్భంగా...)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, భద్రాచల దేవాలయ నిర్మాణానికి కారకుడు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామ వాస్తవ్యుడు, ఒకనాటి కంచర్ల గోపన్న నామధేయుడు, భక్తరామదాసుగా ఆబాలగోపాలానికి చిరపరిచితుడైన మహనీయుడి జయంతిని ఆ గ్రామస్తులు సాదు రాధాకృష్ణమూర్తిగారి ఆధ్వర్యంలో ఏటేటా జరుపుకుంటున్నట్లే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం అభినందించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, భద్రాచల దేవస్థానం దీనికి ఇతోధికంగా తోడ్పాటు అందిస్తున్నది. ఖమ్మం కలెక్టర్ కర్ణన్ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలను దగ్గరుండి జరిపిస్తున్నారు.
భక్తరామదాసుగా ప్రసిద్ధికెక్కిన కంచర్ల గోపన్న పుట్టిన నేలకొండపల్లి గ్రామం ఖమ్మం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం - కోదాడ రహదారిపై ఉంటుంది. తండ్రి లింగనమంత్రి, తల్లి కామాంబ. ఆత్రేయస గోత్రీకులు.. ఆరువేల నియోగి బ్రాహ్మణులు. భార్య కమల, కుమారుడు రఘురాముడు. నేలకొండపల్లిలోని వేణుగోపాలస్వామి వారి వరప్రసాదంగా పుట్టారని భావించిన తల్లిదండ్రులు, గోపన్నగా నామకరణం చేశారు. నేటికి ఆ వూళ్లో వేణుగోపాలస్వామి దేవాలయం వైభవంగా భక్తులను ఆకర్షిస్తూనే వుంది. రామదాసు జన్మతిథి గురించి కొన్ని భిన్న వాదనలు ప్రచారంలో వున్నవి. అనేక చారిత్రక పరిశోధకుల అధ్యయనాల ఆధారంగా రామదాసు 1620లో జన్మించి వుండవచ్చని కొందరంటుంటే, మరికొందరు 1633లో జన్మించారని నమ్ముతారు. ఏదేమైనా ఆయన జన్మ తిథి మాఘశుద్ధ తదియ.. జన్మనక్షత్రం పూర్వాభాద్ర అని నిర్థారణ జరిగింది. ఈ ఏడాది ఇది ఫిబ్రవరి 8వ తేదీన వచ్చింది. ఇదేవిధంగా ఆయన ఆరోధనోత్సవాలు వైశాఖమాసం మొదట్లో, అంటే సాధారణంగా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు.
జగమెరిగిన పాత్రికేయులు స్వర్గీయ జి.కృష్ణ రాసిన ‘ప్రముఖ వాగ్గేయకారులు’ పుస్తకంలో భక్తరామదాసు గురించి అనేక విషయాలు తెలుస్తాయి. కంచర్ల గోపన్న కుతుబ్‌షాహిల కాలంలో, తాసీల్దారుగా, భద్రాచలం సమీపంలోని పాల్వంచలో పనిచేసేవాడు. రామభక్తుడైనందున వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. నేలకొండపల్లి సమీపంలో నాయకులగూడెం అనే వూళ్లో రఘునాధ భట్టరు అనే వైష్ణవ స్వామి గోపన్నను వైష్ణవమతంలో చేర్చాడు. అన్నమయ్య కూడా ఇలానే స్వీకరించాడని అంటారు. వైష్ణవ మతం స్వీకరించిన నాటినుంచి ఆయన పేరు రామదాసుగా మారింది. ప్రభుత్వంలో కొలువు చేస్తూనే, తరచూ భద్రాచలం వెళ్తుండేవాడు. ఆవేశం కొద్దీ కీర్తనలు తానే రాసి పాడేవాడు. ఆయన తదనంతరం కొందరు పండితుల పుణ్యమా అని ఆయన కీర్తనలు ఏర్చికూర్చి కొన్ని సంకలనం చేయడం జరిగింది. రామదాసు గోల్కొండ మంత్రులైన అక్కన్న మాదన్నలకు మేనల్లుడు. రాముడిమీద వున్న భక్తితో ప్రభుత్వ ధనంతో గుడి కట్టించారనీ, దానికి కోపగించిన అబుల్ హసన్ తానీషా ఆయన్ను జైల్లో పెట్టించారనీ, స్వయంగా శ్రీరాముడే వచ్చి తానీషాకు కనిపించి రామదాసును విడుదల చేయించాడనీ అంటారు. దీనికి తగిన ఆధారాలు కూడా వున్నాయి కాబట్టి నమ్మాలి.
భక్తరామదాసుకు సంస్కృతం, తెలుగు-రెండింటిలోనూ పాండిత్యం వుంది. రెండు భాషల్లోనూ కవిత్వం రాశారు. వీటిని శతక ప్రక్రియకు చెందిన ‘దాశరధి శతకం’, నిబంధ పద రచనకు చెందిన ‘తెలుగు సంస్కృత కీర్తనలు’, వృత్తపదానికి చెందిన ‘పాహిరామ ప్రభో’ అనే దీర్ఘవృత్తం, అనిబంధ కవిత్వానికి చెందిన ఒక ‘సంస్కృత చూర్ణిక’ శీర్షికలతో నాలుగు భాగాలుగా విభజించవచ్చని దాశరథుల బాలయ్యగారు రాసిన ఎంఫిల్ సిద్ధాంత వ్యాసంలో పేర్కొనడం జరిగింది. బహుళ ప్రచారం పొందిన 103 పద్యాల దాశరధి శతకంలో మకుటం ‘దాశరధీ కరుణాపయోనిధీ’. ఇక ‘పాహిరామ ప్రభో’ వృత్తపదం ‘‘పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో.. పాహి భద్రాది వైదేహి రామప్రభో!’’ అంటూ ప్రారంభమై, ‘‘పాహి శ్రీరామ నీ పాద పద్మాశ్రయుడ.. పాలింపుమా భద్రశైల రామప్రభో!’’ అంటూ ముగుస్తుంది. కీర్తనలలో ‘అదిగో భద్రాద్రీ గౌతమి’, ‘అబ్బబ్బ దెబ్బలకు తాళలేరా’, ‘ఇక్ష్వాకు వంశ తిలక ఇకనైన పలుకవె’, ‘ఏ తీరుగ నను దయజూచెదవో’, ‘తక్కువేమి మనకు’, ‘నను బ్రోవమని చెప్పవే’, ‘పలుకే బంగారమాయెనా’,‘రామాచంద్రులు నాపై చలము చేసినారు- సీతమ్మ! చెప్పవమ్మా’ లాంటివి అందరూ పాడుకునే అపురూప కీర్తనలు.
ఇదంతా గతం.. ఇక వర్తమానానికి వస్తే- భక్తరామదాసు మరువలేని ఆయన పుట్టిన గ్రామస్తులు సుమారు 60సంవత్సరాల క్రితం (1955-61) నేలకొండపల్లిలో, రామదాసు నివసించిన స్థలంలో ఆనాటి గ్రామ సర్పంచ్ స్వర్గీయ పెండ్యాల సత్యనారాయంరావు నేతృత్వంలో భక్తరామదాసు ధ్యాన మందిరం నిర్మించారు. రామదాసు వాడిన బావి కూడా నేటికి ఆ స్థలంలోనే వుంది. అయితే కారణాలు ఏవైనా, ఆ మందిరం చాలాకాలం ఖాళీగా ఉండిపోయి, సామాజిక అవసరాలకు ఉపయోగించారు. దరిమిలా, పెండ్యాల సత్యనారాయణరావు మరికొందరు గ్రామస్తులు కలిసి రామదాసు స్మారక కమిటీని ఏర్పాటుచేసి, 1974నుంచి భక్తరామదాసు స్మారక ఉత్సవాలను జరిపించసాగారు. నాల్గవ వార్షికోత్సవంలో, అంటే 1977వ సంవత్సరంలో శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ స్వామి వారి శిలా విగ్రహాలను, రామదాసు శిలా విగ్రహాన్ని 1986లో స్వర్గీయ భీకంసింగ్, స్వర్గీయ రావులపాటి రంగారావు, స్వర్గీయ గండికోట శేషభూషణరావు, స్వర్గీయ గండికోట రాజేశ్వరరావు, పెండ్యాల రాంమోహన్‌రావు, మరికొందరు భక్తులు కలిసి ‘శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం’ అనే సంస్థను స్థాపించి ఆరాధనోత్సవాలను చేయడం ప్రారంభించారు. అదే సంస్థ ఈనాటికీ మాఘశుద్ధ తదియ రోజున రామదాసు జయంతిని, వైశాఖ మాసం ప్రారంభంలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
2000 సంవత్సరంలో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో, నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఎ.గిరిధర్ చొరవతో ధ్యాన మందిరం ఆధునీకరించబడి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు స్వర్గీయ బాలమురళీకృష్ణ చేతులమీదుగా పునఃప్రారంభించబడింది. 2007 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం దీన్ని దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒక అర్చకున్ని నియమించి నిత్య పూజలు, దూప, దీప నైవేద్యాది కైంకర్యాలు జరిగేట్లు చూస్తున్నారు. శ్రీరామనవమి, దసరా, ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.
కాకపోతే ఇవన్నీ ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయని అంటున్నారు. చేయాల్సిన పనులెన్నో వున్నాయని, నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దాలని, భక్తులను, పర్యాటకులను అక్కడికి వచ్చేట్లుగా చేయాలని, మందిరాన్ని పూర్తిస్థాయి దేవాలయంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. లోగడ ఒకసారి రామాలయ నిర్మాణానికి ప్రయత్నం కూడా జరిగింది. సంగీత, సాహిత్య, భక్తి కార్యక్రమాల నిర్వహణకు అనుగుణంగా సమావేశ మందిరాన్ని, అతిథులు, భక్తులు, కళాకారుల సౌకర్యం కోసం కొన్ని విశ్రాంతి గదులను నిర్మించాలని, ఒక చక్కని పార్కుని అభివృద్ధి చేసి రామాయణ కథలకు, రామదాసు జీవిత విశేషాలకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటుచేయాలని, చిత్రకారులతో రామదాసు జీవిత విశేషాలను, కొన్ని కీర్తనలకు అనుగుణంగా వుండే చిత్రాలను వేయించి ప్రదర్శనశాలను ఏర్పాటుచేస్తే బాగుంటుందని గ్రామస్థుల అభిప్రాయం. వివిధ గ్రంథాలయాలలో నిక్షిప్తమై వున్న రామదాసు సాహిత్యాన్ని, గ్రంథాలను వ్యాసాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుంది. ఈ సంవత్సరం చేస్తున్నట్లే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ తదియ రోజు నుండి మూడు రోజులు రామదాసు జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ప్రారంభంలో మూడు రోజుల రామదాసు ఆరాధనోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా ఇపుడు నిర్వహిస్తున్నట్లే నిర్వహించాలి.
రామదాసు కీర్తనలను, భజనలు పాడేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. సంగీత విద్వాంసులతో కొన్ని బృందాలు ఏర్పాటుచేసి జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలలో రామదాసు కీర్తనలను ప్రచారం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ విధంగానైతే అన్నమయ్యకు విశేష ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నారో, తమిళ ప్రజలు త్యాగరాజుకు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో, అలాగే తెలంగాణ ప్రజలు రామదాసుకు తగిన గుర్తింపు ఇస్తే గ్రామస్తులు సంతోషిస్తారు. నేలకొండపల్లిలోని శ్రీ భక్త రామదాస ధ్యాన మందిరాన్ని, బౌద్ధ స్థూపాన్ని కలిపి ఒక మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దితే మంచిది.
గ్రామస్థుల ఆలోచనలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలమేరకు ప్రతి సంవత్సరం రామదాసు జయంతి ఉత్సవాలను మూడు రోజులపాటు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో చేయించిన రామదాసు శిలావిగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది.
ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధినుండి రామదాసు ధ్యాన మందిరాన్ని ఆధునీకరించడానికి 3కోట్ల రూపాయలు మంజూరు చేశారు కెసిఆర్‌గారు. నిధులు కూడా విడుదలయ్యాయి. భవిష్యత్తులో నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడాన్ని మనం చూడబోతున్నాం.

-వనం జ్వాలా నరసింహారావు 8008137012