సబ్ ఫీచర్

బంజారాల పవిత్ర పండుగ ‘తీజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంజారాలు అత్యంత భక్తిశ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకుంటారు. పూర్వం తండాలలో కాలం కాకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని పెళ్లికాని యువతులతో ఈ తీజ్ పండగ నిర్వహించేవారట. తీజ్ పండగలో ముఖ్యపాత్ర వహించే పెళ్లికాని యువతులకు మంచి లక్షణాలుగల వరుడు లభించి వివాహం అవుతుందని విశ్వాసం. కాలక్రమేణా ఈ తీజ్ పండగ పెళ్లికాని యువతులకు మంచి భర్తకోసమే చేసే పండగగా మారిపోయినది. ఒకప్పుడు తండాలలో కరువును పారద్రోలుతుందనే నమ్మకంతో జరుపుకునే తీజ్ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూడటం పెళ్లికాని యువతుల వంతైంది.
తీజ్ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తీజ్ పండగను ఆషాడ మాసం చివరి మంగళవారం లేదా శ్రావణ మాసం మొదటి మంగళవారం రోజు ప్రారంభించుకుంటారు. గిరిజన బంజారాలు కుల దేవత అయిన సీత్లభవాని మాతకు గిరిజనులు శుభకరంగా భావించే మంగళవారం రోజున పూజలుచేసి దాటుడు (గొర్రెలు, పశువులు, జీవాలు) పండగ ప్రారంభిస్తారు. తీజ్ పండగ(మొలకల పండగ)కు బంజారాల పండుగల్లో పవిత్ర స్థానం వుంది. బంజారాలకు ఏడుగురు స్ర్తిదేవతలు వున్నారు. వారి పేర్లు మేరమ్మ, హింగ్లా, తోల్జ, సీత్ల, ద్వాలంఘర్, కేంకళి, మంత్రాల్. బంజారా ఆడ పిల్లలు ప్రధాన పాత్రధారులుగా వుండి జరిపే పండగ తీజ్. పెళ్లీడు వచ్చిన అమ్మాయిల నాయకత్వంలో మిగతా అమ్మాయిలు కలసి భక్తిశ్రద్ధలతో ఈ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. వీరిలో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ బలంగా వుండేది. దానికి నిదర్శనంగా వీరి పండగలు నిర్వహిస్తారు. మేరమ్మ, తీజ్, మంత్రల్, సీత్ల దేవతల పేరున బంజారాలు పండుగలు జరుపుకుంటారు. వీరి నమ్మకం ప్రకారం మేరమ్మ దేవత తండాను రక్షిస్తే, తీజ్ పంటలను కాపాడుతుంది. సీత్ల పశుసంపదను వృద్ధిచేస్తుంది, మంత్రల్ పిల్లలకు ఎటువంటి రోగాలు రాకుండా చేస్తుంది.
తండాలో ఉన్న పెళ్లికాని యువతులు తండా కేంద్రంగా ఉండేచోట గుమికూడి చర్చించుకుంటారు. తదనంతరం తండా పెద్ద కార్ భారీ, నాయక్‌ల దగ్గరకు వెళ్లి వారి అనుమతితో తండాలో చాటింపు చేసి సమయాన్ని ప్రకటిస్తారు. తరువాత అమ్మాయిలు అందరూ కలసి తండా నాయకుని ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం శనగలు సేకరించి ఇత్తడి బిందెలో నానబెడతారు. తరువాత ఎర్రమట్టి, చెఱువుమట్టి, పుట్టమట్టి, ఆవు ఎరువు మొత్తం కలిపి మెత్తగాచేస్తారు. తండా మధ్యలో ఒక పందిరిని ఏర్పాటుచేస్తారు. తరువాత ప్రతి ఇంటినుంచి వెదురుకట్టెలతో చేసిన చిన్నచిన్న బుట్టలలో సగానికి తక్కువగా మట్టినివేసి, తరువాత గోధుమలు శనగ (నవధాన్యాలు) గింజలను వేసి ఆ పందిరి పైన పెడతారు. చేసే క్రమంలో గిరిజన బంజార సంస్కృతి సంప్రదాయాలతో నంగారా వాయిస్తూ ఆట పాటలతో నృత్యాలతో పందిరిపై బుట్టలను ఉంచుతారు.
ఈ కార్యక్రమాలన్నిటికి ఒక అమ్మాయి నాయకురాలిగా వ్యవహరిస్తుంది. ఆ నాయకురాలు తొమ్మిది రోజులపాటు ఆకు కూరలు భుజిస్తూ శుద్ధిగా ఉంటుంది. నాయకురాలి సమక్షంలో కనె్న పిల్లలు కలిసి బావి దగ్గరకివెళ్లి పరిశుభ్రమైన ఇత్తడి బిందెలలో నీళ్లు తెచ్చి ఉదయం సాయంత్రం పాటలు పాడుతూ ఆ బుట్టలపై నీళ్ళు చల్లుతారు. తరువాత రాత్రిపూట సమయంలో తండాలో ఉన్న చిన్న పెద్ద స్ర్తిలు కలిసి పందిరి వేదికగా నంగారా డప్పు వాయస్తూ ఆటపాటలు పాడుతారు.
తీజ్ పండుగలో సేవాభాయ, దండి యాడి (మేరమ్మ) దేవతలను పూజిస్తారు. అయతే మేరమ్మ దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని విశ్వసిస్తారు. ఏడవ రోజు ‘‘్ఢమోళి’’అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యం పిండితో రొట్టెలు (చుర్మో) చేసి వాటిని బ్లెలంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్ ఉన్న ఇంటి ఆవరణలో సేవాభాయ, మేరమ్మలకు పూజలు నిర్వహిస్తారు. ఇంటిముందు జొన్నలు నింపిన గోనె సంచులు దాని ముందుపెట్టి ఒక చిన్న కడవలో నీళ్ళుపోసి అందులో ‘‘లింబేర్ పాన్’’ (వేప మండలు)చేసి పెడతారు. ఆ కడవకు మూడు పసుపు కుంకుమ బొట్లుపెడతారు. మేకపోతుని తెచ్చి గోనె సంచులకు ఎదురుగా నిలబెట్టి దాని తలకు కాళ్ళకు పసుపు, కుంకుమ రాస్తారు. నోటిలో నీళ్ళు పోస్తారు. మేరమ్మ తల్లికి బలి ఇవ్వడం ఆచారం. వెండితో చేసిన మేరమ్మ భవాని విగ్రహాన్ని కానీ లేదా ‘‘ఏక్ రఫియా’’ (ఒక రూపాయి బిళ్లను) పెట్టి మేకపోతును బలిఇస్తారు.
మేరమ్మ పూజ జరిగిన కొంచెం దూరంలో సేవాభాయ పూజచేస్తారు. ఈ పూజను ‘‘కడావ్’’అని అంటారు. సేవభాయ శాకాహారి అందుకే ఆయనకు శాకాహార పదార్థాన్ని నైవేద్యంగా ఇస్తారు. దీర్ఘచతురస్త్ర ఆకారంలో గొయ్యి తీసి అందులో కట్టెలుపెట్టి మంటవేసి ఒక పెద్ద గినె్నలో ‘‘కడావ్’’ వండుతారు. కడావ్‌లో సిద్ధమైన తరువాత బెల్లం, రొట్టెలు కలిపిన సాత్ (7) చుర్మో ముద్దలను మహిళలు ఒక పళ్లెంలో పెట్టుకొని పందిరి వేదికగా పెడతారు అప్పుడే సేవభాయ కడావ్ నైవేద్యాన్ని సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు ‘‘గణగోర్’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తండాలో ఉన్న చెఱువు దగ్గరకి కనె్నపిల్లలు వెళ్ళి నల్లరేగడి మట్టిని తీసుకుని ఒక అనుభవజ్ఞురాలు దగ్గరికి వెళ్ళి ఒక ఆడ, మగ బొమ్మను తయారుచేస్తారు. ఆడబొమ్మను బంజారా వివాహిత వేసుకునే సంప్రదాయ వస్త్రాల వంటి (పేట్యా, చాంక్లి, టూక్రి) వస్త్రాలను చిన్నవిగా తయారుచేసి ఆడబొమ్మని తయారుచేస్తుంది. ఆడబొమ్మ పేరు ‘‘ఘణ్’’ అంటే మేరమ్మ దేవత. మగ బొమ్మ పేరు ‘‘గోర్’’అంటే సేవాభాయ. ఈ దేవతలను ఆటపాటలతో సేవిస్తారు. తొమ్మిదవ రోజు కనె్న పిల్లలు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉయ్యాలకు సంబంధించిన పరికరాలను పందిరి దగ్గర సిద్ధం చేసుకొని ఉయ్యాల (హింజలో) ఆటను ఆడుతారు. అమ్మాయి ‘‘గన్ గోర్’’ను పట్టుకొని ఉయ్యాలతోపాటు ఆడిస్తారు పాటలు పాడుతారు.
బోరడి అంటే రేగి ముళ్లని, మస్కెరో అంటే గుచ్చడం అని అర్థం. కనె్నలు రేగుముళ్లను నానబెట్టిన శనగలని గుచ్చుతారు. దీక్షతో రేగుముళ్లకు గుచ్చిన శనగలని యువ కులు రాల్చడంతో బోరడి మస్కెరో కార్యక్రమం మొదల వుతుంది. కన్యలతో నాయకురాలు ఈ రోజు మొత్తం ఉపవాసం ఉంటుంది. తొమ్మిదవ రోజు సాయంత్రం తీజ్ ఉన్నచోట అన్నదమ్ములంతా తలపాగాలు కట్టుకొని వరుసగా కూర్చుంటారు. తాము పెంచిన బుట్టల నుండి గోధుమ నారును తుంచి తాతలు, అన్నదమ్ముల తలపాగా లో పెడతారు. తర్వాత తీజ్ బుట్టలను తీసుకొని ఆట పాట లతో వూరేగింపుగా బయలుదేరతారు. నీళ్లలో వదిలేందుకు విచార వదనాలతో ఉన్న కనె్నల పాదాలను వారి సోదరులు కడిగి తోచిన విధంగా డబ్బులతో వారిని ఓదారుస్తారు. నిమజ్జనానం తర్వాత మళ్లీ తీజ్ వేదిక వద్దకు ఆటపాటలతో వచ్చి ఎవరిళ్లకు వారు వెళ్లిపోతారు. దీంతో తీజ్ పండుగ ముగుస్తుంది.

- తేజావత్ నందకుమార్ నాయక్ సెల్: 9000222550