సబ్ ఫీచర్

వృత్తి నైపుణ్యాలే బోధనకు గీటురాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)
ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. సుమారు 100 దేశాలు అంతర్జాతీయ గురు పూజోత్సవాన్ని పాటిస్తున్నాయి. భావి తరాలకు విద్యాప్రణాళికలు ఎలా ఉండాలనే అంశంపై ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టేందుకు విద్యాలయాలలో వేడుకగా దీన్ని నిర్వహిస్తున్నారు. విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ప్రధాన లక్ష్యం ‘విశ్వవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలను ప్రశంసించడం వారి నైపుణ్యాలను అంచనావేయడం, వాటిని మెరుగుపరచడం’. బోధనకు సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా పరిగణిస్తున్నారు.
మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. దీనితోపాటు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంతర్జాతీయంగా విద్యావకాశాల్ని వినియోగించుకునేందుకు అన్ని దేశాలతో అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇది దోహదపడుతుంది. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను తయారుచేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల బోధనతోనే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసుకుంటారు, ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రపంచంలో సుమారు 80కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో 23.8 కోట్ల మంది మనదేశంలోనే ఉన్నట్లు వెల్లడైంది.
‘యువ ఉపాధ్యాయులు-వృత్తి భవిష్యత్తు’ అనే ఇతివృత్తంతో 2019 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో అక్టోబర్ 5వ తేదీని ‘వరల్డ్ టీచర్స్ డే’గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రసిద్ధ గురువులు ఉన్నారు. న్యూటన్, పైథాగరస్, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలైనవారు ఆదర్శంగా నిలిచారు. దక్షిణామూర్తి, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరశురాముడు, ఆదిశంకరాచార్యులు, ద్రోణాచార్యులు, పరమహంస మొదలైన వారంతా పేరొందిన గురువులు. విద్య అనే ఆస్తిని సమానంగా పంచగల శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉంది. ప్రజాదరణ, అపారమైన గౌరవం ఉన్న కారణంగానే ఎంతోమంది ఉపాధ్యాయులు నాయకులయ్యారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక అధ్యాపకుడు భారత దేశానికి రాష్టప్రతిగా పనిచేసిన ఘనత ఆయనకే చెల్లింది. ఆయన పుట్టిన రోజును మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రఖ్యాత శాస్తవ్రేత్త అబ్దుల్ కలాం రాష్టప్రతిగా పదవీకాలం ముగియగానే చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. బోధన చేస్తూనే ఆయన తుదిశ్వాస విడిచారు. యావత్ ప్రపంచానికి ఆయన గొప్ప సందేశాన్ని అందించారు. జ్ఞాన సముపార్జన గురువు బోధన వలనే సంపూర్ణంగా సిద్ధిస్తుంది.
‘గు’శబ్దంధకారే స్సాత్/ ‘రు’శబ్దంతి నిరోధతః
అంధకార నిరోధితం/ గురురీత్య బిదీయతే
అనే ఆర్యుల మాటలను పరికించి చూస్తే ‘అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే కాంతులను వెలిగించేవారినే నిజమైన గురువులుగా భావించవచ్చు. నీతివంతమైన జీవనానికి అలవాటుపడే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దగలగాలి. సమాజాలు మారొచ్చు, సిద్ధాంతాలు మారొచ్చు. కానీ విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య సంబంధం శాశ్వతమైనది. ఈ విషయాన్ని యువ ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలి. విద్యార్థుల భవిష్యత్‌పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సమాచారం అందివ్వడంతోనే ఉపాధ్యాయుడి పాత్ర ముగియదని నిజానికి ఉపాధ్యాయుడు రకరకాల నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించవలసి ఉంటుందని కొఠారి కమిషన్ పేర్కొంది. జాతి నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత కీలకపాత్ర పోషించేది గురువే అవుతాడు. అనేక మంది గురువులు విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇందుకు ఉదాహరణలుగా శ్రీరాముడు- విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుడు- సాందీపుడు, శివాజీ- సమర్ధ రామదాసు, వివేకానంద- రామకృష్ణ పరమహంసలను పేర్కొనవచ్చు.
వివిధ దేశాల్లో...
వియత్నాంలో ఏటా నవంబర్ 20న విద్యార్థులు ఉపాధ్యాయుల ఇళ్లకువెళ్లి పువ్వులు అందజేసి గౌరవిస్తారు. ఇండోనేషియాలో నవంబర్ 25న, మలేషియాలో మే 16, సింగపూర్‌లో సెప్టెంబర్ 1, అమెరికాలో మే మొదటివారంలో, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, సిరియా, అల్జీరియా దేశాల్లో ఫిబ్రవరి 28న ఈ ఉత్సవాలను పాటిస్తారు. మాతృదేవోభవ- పితృదేవోభవ- ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదే అని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టేవారు తమ వృత్తిని ప్రేమించే లక్షణం కలిగి ఉండాలి. తాము భావి పౌరులను తీర్చిదిద్దుతున్నామనే భావన ఉండాలి. విద్యార్థి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం గురువు. ఉపాధ్యాయులు తమ మేధోసంపత్తిని పెంపొందించుకోవాలి. తమ జీవిత కాలంలో కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గమనించాలి. వృత్తినైపుణ్యాల పెంపు, కంప్యూటర్ వినియోగం, డిజిటల్ లిటరసీ కార్యక్రమాలను నిర్వహించాలి. బాలబాలికల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషిచేయాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘మార్చలేని గతాన్ని గురించి ఆలోచించవద్దు.. చేతిలోఉన్న భవిష్యత్తుకోసం శ్రమించు’ అనేవారు.
ఉపాధ్యాయుడు తన బోధనా పద్ధతుల్ని పునఃసమీక్షించుకొని తదనుగుణంగా విద్యార్థులను నవ సమాజానికి అందించాలి. విద్యారంగాన్ని సమూలంగా మార్చాలనే సంకల్పంతో ఉపాధ్యాయ వర్గానికి రాధాకృష్ణన్ తన జన్మదినాన్ని అంకితం చేశారు. ఒకప్పుడు గుమాస్తాలను తయారుచేసే విధంగా విద్యాలక్ష్యం వుండేది. నేడు సామాజిక ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశానికి పరిశోధకులు కావాలి. వ్యక్తుల స్వభావాన్ని, సామర్థ్యాన్ని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయవృత్తి అని ప్రవచించిన అబ్దుల్ కలాం పలుకులకు సార్థకత చేకూర్చాలి. నేటి యువ ఉపాధ్యాయులు అందుకు కంకణబద్ధులై వృత్తిని నిబద్ధతతో నిర్వర్తించాలి.

-కె.రామ్మోహన్‌రావు 9441435912