సబ్ ఫీచర్

ప్రజారోగ్యంపై కొరవడిన ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

70 వసంతాలు భారతదేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్న తరుణంలో ప్రజారోగ్య వ్యవస్థ రోజురోజుకు గాడితప్పుతూ సామాన్య మానవునికి నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిందనేది చేదు నిజం. నేడు శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకుని వైద్యరంగం ముందుకు వెళుతూ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంలో భారతదేశ గ్రామీణ ప్రాథమిక వైద్యరంగం నేటికీ వౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక ప్రజాఆరోగ్య పథకాలు ఆశించిన రీతిలో అమలుకు నోచుకోక పునాది స్థాయిలోనే వైఫల్యం చెంది ప్రజారోగ్య వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. తద్వారా సామాన్య ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటూ రోడ్డున పడుతున్నారు.
ప్రస్తుతం రోజురోజుకు విజృంభిస్తున్న కాలుష్యం, పరిసరాల అపరిశుభ్రత, పౌష్టికాహార లోపం, కల్తీ ఆహార పదార్థాలు, అవగాహన లేమితో భారత్‌లో పలురకాల వ్యాధుల ముప్పు పొంచిఉందని అనేక ఆరోగ్య సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు ఆసాంక్రమిక వ్యాధులు, వినూత్నమైన బాక్టీరియా మరియు వైరస్ సంబంధిత వ్యాధుల బెడద తీవ్రరూపాన్ని దాల్చుతున్నవేళ వాటి కట్టడికై నేటికీ సమగ్రమైన శాస్ర్తియ ప్రజారోగ్య విధానం లేకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు లేని వైద్యవిద్య మరియు వైద్య కళాశాలలు, లోప భూయిష్టమైన వైద్య విధానం, ప్రైవేటు వైద్యశాలలో జరుగుతున్న దోపిడీ, ప్రభుత్వ వైద్యశాలల్లో వౌలిక వసతులు లేమి, చుక్కలనంటుతున్న మందుల ధరలు ప్రజారోగ్య వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కంటితుడుపుగానే మిగులుతూ, దశలవారీగా ప్రజారోగ్యం వ్యవస్థనుంచి ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నంచేయడం జరుగుతుందనేది నిర్వివాదాంశంగా చెప్పవచ్చు.
ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన ప్రజారోగ్య పథకాలను, వైద్యవిద్యలో సంస్కరణలు, వైద్య విధానంను, ఔషధ ధరల నియంత్రణ మరియు కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణను పునఃసమీక్షించి అందరికీ నాణ్యమైన ఆరోగ్యం సేవలు అందేలా ప్రభుత్వాలు కృషిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కావున ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యంతో పటిష్టమైన ఆరోగ్య ప్రణాళికలు మరియు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం వుంది. అదే విధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలలో వౌలిక వసతులను కల్పిస్తూ ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించేటట్లు కృషిచేయాలి. వైద్య బృందాల ద్వారా ప్రజారోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలానుగుణ వ్యాధులు మరియు జీవనశైలి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడాలి. చివరగా ప్రజారోగ్య వ్యవస్థలో అతి ప్రాముఖ్యతగల అంశం నిధులు, కావున ప్రతియేటా ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి సరిపడా నిధులు కేటాయిస్తూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి కృషిచేయాలి.

- సంపతి రమేష్ మహారాజ్, 9959556367