సబ్ ఫీచర్

శాతకర్ణి.. బ్రాహ్మణ చక్రవర్తే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారైన శాతవాహన రాజుల తొలి నివాసం తెలంగాణలోని కోటిలింగాల. ప్రజానురంజకంగా పరిపాలించిన శాతవాహన వంశీయులు అసహాయ శూరులు, అరివీర భయంకరులు. శాతకర్ణి బ్రాహ్మణుడే, బ్రాహ్మణ చక్రవర్తి అని చెప్పడానికి ఎన్నో చారిత్రక పుస్తకాలలో సాక్ష్యాధారాలున్నాయి. అసలు సిసలు బ్రాహ్మణుడైన గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే. ‘బ్రాహ్మణరాజ్య సర్వస్వం’ పేరుతో స్వర్గీయ బి.ఎన్.శాస్ర్తీ రచించిన బృహత్ గ్రంథానికి భూమిక రాసిన డాక్టర్ గంగాపురం హరిహరనాథ్ పలు చారిత్రక అంశాలను ఉదహరించారు. క్రీస్తు పూర్వం 184 ప్రాంతంలో మగధ వంశపు చివరి రాజైన బృహద్రథుడిని, ఆయన భోగలాలసతను సహించలేని మహామంత్రి పుష్యమిత్రుడు చంపి, సింహాసనాన్ని అధిష్టించిన తదనంతర పరిణామాలలో ఏ విధంగా బ్రాహ్మణ రాజ్యాలేర్పడ్డాయో సవివరంగా పేర్కొన్నారు. పుష్యమిత్రుడు సింహాసనాన్ని అధిష్ఠించడంతో మంత్రి, సామంత, దండనాయక పదవులందుకున్న బ్రాహ్మణులందరూ స్వతంత్రులై అఖిల భారత వ్యాప్తంగా స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారని హరిహరనాథ్ రాశారు. ఆ బ్రాహ్మణ రాజులే శుంగులుగా, శాతవాహనులుగా, కాణ్వులుగా పేరొందారు. దక్షిణాపథానికి మహోజ్వల చరిత్రనందించడమేకాకుండా, భారతదేశ మహోన్నత చరిత్రకు శ్రీకారం చుట్టిన వారు శాతవాహనులని, సుమారు 450 ఏళ్లు పాలించిన వారి కాలంలో వైదిక ధర్మం వర్ధిల్లిందని హరిహరనాథ్ అంటారు. బ్రాహ్మణ రాజ్యాలకు సంబంధించిన మరెన్నో ఆసక్తికరమైన విషయాలు బి.ఎన్.శాస్ర్తీగారి గ్రంథంలో లభ్యమవుతాయి. బ్రాహ్మణులు కేవలం మంత్రి, దండనాయక, పురోహిత పదవులనే అలంకరించారే తప్ప సామ్రాజ్యాలను స్థాపించలేదని మొండిగా వాదించేవారికి కనువిప్పు కలిగేలా ఈ ‘సర్వస్వం’లో ప్రసిద్ధమైన 26 బ్రాహ్మణ రాజ్య వంశాల గురించి పరిశోధనాత్మకంగా, సోదాహరణంగా నిరూపిస్తూ విపులీకరించారు శాస్ర్తీగారు. ఈ గ్రంథంలో ఇంకా ఆర్య బ్రాహ్మణులు, ఋగ్వేదం, ఋగ్వేద ఋషులు, రాజులు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ఆర్యుల వ్యవసాయం, సాంఘిక అంశాలు, జనపదాలు, గణతంత్ర రాజ్యాల సంక్షిప్త సమాచారం లాంటి అనేక విషయాలున్నాయి. అందులో భాగంగానే గౌతమీపుత్ర శాతకర్ణి వంశమైన ‘శాతవాహనుల’ గురించి కూడా వివరించారు.
జనరంజకంగా పాలించిన శాతవాహన రాజులు అప్రతిమాన ప్రతిభావిశేషాలు కలవారని శ్లాఘించారు శాస్ర్తీగారు. తెలంగాణలోని కోటిలింగాల వారి గణతంత్ర రాజ్యంగా వుండేది. శాతవాహన వంశీయులు అశ్వగణానికి చెందినవారు. మత్స్య, వాయు పురాణాలలో శాతవాహనుల చరిత్ర గురించి ప్రస్తావన వుంది. గ్రీకు రచయితలు, చైనా యాత్రీకులు కూడా వీరి గురించి రాశారు. ఈ రాజవంశపు పరిపాలకుల్లో హాల శాతవాహన చక్రవర్తి గొప్ప కవే కాకుండా తన ఆస్థానంలో కుమారిల, శ్రీపాలిత లాంటి మహాకవులను పెట్టుకున్నాడు. ఈ వంశీకులకు సంబంధించిన అనేక కథలు, గాథలు ప్రచారంలో వున్నాయి. ఇపుడు సినిమా రూపంలో కూడా వెలువడుతున్నాయి. కాకపోతే చారిత్రక ప్రమాణికాలు కాని కొన్ని అంశాలను సినిమాల్లో చొప్పిస్తున్నారు. గాథా సప్తశతి, బృహత్క్థ, జాతక కథలు, కొన్ని జానపద కథలు కొంతవరకు శాతవాహనుల చరిత్రను తెలియచేస్తాయి. బిఎన్ శాస్ర్తీ తన పుస్తకంలో శాతవాహన వంశానికి చెందిన 30 మంది రాజుల గురించిన వివరాలు పొందుపరిచారు.
శాతవాహన వంశానికి మూల పురుషుడు శ్రీముఖుడు రాజకీయ చతురుడు, పరాక్రమవంతుడు. ఇతడి తండ్రి శాతవాహనుడు. అశోక చక్రవర్తి మరణానంతరం స్వతంత్రుడై, విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలించాడు. శ్రీముఖుడికి ముందు కోటిలింగాల పరిసరాల పట్టణ సమాఖ్యను పాలించిన రాజు శాతవాహనుడు. తండ్రి మీద గౌరవంతో ‘శాతవాహన’ పేరును తమ వంశనామంగా శ్రీముఖుడు పెట్టుకున్నాడు. శ్రీముఖుడు మహారాష్టల్రోని కొంత ప్రాంతాన్ని జయించి మరాఠీ అమ్మాయితో తన కుమారుడైన మొదటి శాతకర్ణికి వివాహం జరిపించాడు. శ్రీముఖుడి మరణ సమయంలో కొడుకు చిన్నవాడైనందున అతడి సోదరుడు కృష్ణుడు కొంతకాలం పాలించి శాతకర్ణి యుక్తవయస్కుడైన తరువాత రాజ్యాన్ని అప్పగించాడు. దక్షిణాపథాన సమస్త రాజ్యాలనూ జయించిన శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. మొదటి శాతకర్ణి ప్రతిభావంతుడు, పరిపాలనా దక్షుడు, మహాబలవంతుడు. అతడి తరువాత పూర్ణోత్సంగుడు, స్కంద స్తంబి పాలించారు. ఆ తరువాత రాజ్యాన్ని అధిష్ఠించినవాడు రెండవ శాతకర్ణి. ఇతడు 56 సంవత్సరాలు శాతవాహన రాజ్యాన్ని పాలించినట్లు, విదేశీయుల దురాక్రమణను ఎదుర్కొని, దేశీయుల దండయాత్రలను నిరోధించి, తన సామ్రాజ్యంలో శత్రుభయం లేకుండా చేసినట్లు ఆధారాలున్నాయి. మగధ సామ్రాజ్యాన్ని సైతం జయించి చక్రవర్తి పదవిని పొందాడు.
రెండవ శాతకర్ణి అనంతరం- గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ముందు రాజ్యాన్ని పాలించినవారు వరుసగా- లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి శాతకర్ణి, స్కంద స్వాతి, మృగేంద్ర శాతకర్ణి, స్వాతివర్ణ, పులోమావి, గౌరకృష్ణుడు, హాల శాతవాహనుడు, మందూలకుడు, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివ స్వాతి. గౌతమీపుత్ర శాతకర్ణి అనంతరం పాలించినవారు వరుసగా- రెండవ పులోమావి, శివశ్రీ, శివస్కంద, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయ శాతకర్ణి, చంద్రశ్రీ, నాల్గవ పులోమావి. వీరిలో హాల శాతవాహనుడు ఆ వంశపు రాజన్యులలో సాహిత్య పోషకుడిగా, మహాకవిగా, సంస్కృత ప్రాకృత భాషల అభిమానిగా, వాటిని ఆదరించి పోషించిన వాడిగా ప్రసిద్ధికెక్కాడు. ఇతడి కాలంలోనే గాథాసప్తశతి రూపుదిద్దుకుంది. ఆయన ఆస్థానానికి వచ్చిన కవుల గాథలను ఏర్చి కూర్చి గాథాసప్తశతి గ్రంథాన్ని తయారుచేశారు. చంద్రశ్రీతో శాతవాహన వంశపు ప్రధానశాఖ అంతరించిందనే అనాలి. నాల్గవ పులోమావి శాతవాహన వంశంలో మరోశాఖకు చెందినవాడు. శాతవాహన వంశపు చివరి రాజులు అంతఃకలహాలలో మునిగి వివిధ ప్రాంతాలలో చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు.
శాతవాహన వంశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపచేసిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. క్రీస్తుశకం 104లో సింహాసనానికి వచ్చి 21 సంవత్సరాలు పాలించాడు. ఆయన పాలనా పగ్గాలు చెపట్టేనాటికి శాతవాహన రాజ్యం చాలా చిన్నదిగా వుండేది. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి వీరమాత గౌతమీ బాలశ్రీ. ఇతడిని ‘ఏక బ్రాహ్మణ’ అనే బిరుద నామంతో సంబోధించేవారు. అసిక, అశ్మక, ములక, విదర్భ మొదలగు రాజ్యాలను జయించి, క్షహరాట వంశాన్ని నిర్మూలించి, ‘క్షహరాట వంశ నిరవశేషకర’ అనే బిరుదు కూడా పొందాడు. ఆయన మహాసామ్రాజ్య నిర్మాణంలో భాగంగా పూర్వీకులు కోల్పోయిన ప్రాంతాలనే కాకుండా, అనేక ఇతర రాజ్యాలను జయించాడు. సహపాణుడిపై గెలిచాక విజయ సూచనగా ఆతడి పేరుమీద వున్న నాణాలను పునర్ముద్రించాడు. శాతవాహన వంశ ప్రతిష్టను ఉద్ధరించడమే కాకుండా, తన రాజ్యంలో చక్కటి పాలనావ్యవస్థను ప్రవేశపెట్టాడు. ప్రజానురంజకంగా పాలన చేశాడు. వింధ్య, అచీవతి, వింధ్య పర్వత ప్రాంతం, ఆరావళీ పర్వతాలు, పశ్చిమ కనుమలలోని సహ్యాద్రి పర్వతపంక్తి, నీలగిరులకు పడమట వున్న కన్హగిరి, మలయ పర్వతం, మహేంద్రగిరి, చకోర పర్వతం, శ్రీశైల శ్రేణులు, సెటగిరి, సిరికణ పర్వత శ్రేణులతో శాతకర్ణి రాజ్యం సువిశాలంగా వ్యాపించి వుండేది.
గౌతమీపుత్ర శాతకర్ణి దృఢకాయుడని, స్ఫురద్రూపి అని, అతడు ముద్రించిన నాణాల మీద వున్న చిత్రాల ఆధారంగా భావించాలి. సమున్నత శరీరంతో శాతకర్ణి అరివీర భయంకరుడని, సమర శిరసి విజిత రిపు సంఘాతుడని, ఉదార పాలకుడని, ప్రజల సుఖదుఃఖాలు తెలిసినవాడని, వైదికధర్మ నిరతుడని, ఆగమ నిలయుడని, ఏక బ్రాహ్మణుడని, విప్రులను ఆదరించి వేదవిద్యలను ప్రోత్సహించాడని, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిని పొందిన మహామనీషి అని ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’లో బిఎన్ శాస్ర్తీగారు అభివర్ణించారు. తల్లి గౌతమీ బాలశ్రీ ప్రోత్సాహంతో బౌద్ధ సన్యాసులకు విరివిగా దానధర్మాలిచ్చిన తనయుడు శాతకర్ణి - ‘అవిపన్న మాతృ శుశ్రూషక’ అన్న బిరుదు కూడా పొందాడంటారు శాస్ర్తీగారు. అతడి పాలనాకాలంలో శాతవాహన రాజ్యం సమున్నత స్థితిలో వుండి, తెలుగువారి కీర్తి దిగ్దిగంతాలలో వ్యాప్తిచెందింది. అప్పుడే తెలుగువారు సముద్రయానం చేసి ప్రాక్పశ్చిమ దేశాలతో వ్యాపారాలు కూడా సాగించారు.
సుమారు నాలుగున్నర శతాబ్దాలు దక్షిణాపథాన్ని, దక్షిణ భారతదేశాన్ని, ఉత్తరాపథాన్ని, మగధ సామ్రాజ్యాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకొని ప్రజానురంజకంగా పాలించిన శాతవాహన రాజుల చరిత్ర తెలుసుకోవడానికి అనేక ఆధారాలు శాసనాల రూపంలో, పురాణాలు, గ్రంథాల రూపంలో, దేశ విదేశీయుల రాతల రూపంలో, నాణాల రూపంలో, అప్పటి బౌద్ధారామాల రూపంలో, కథలు, గాథల రూపంలో సులభంగా లభ్యమవుతున్నాయి. శాతవాహనులు తెలుగువారైనందున ఈ ప్రాంతంతో వారికి పటిష్టమైన సంబంధ బాంధవ్యాలున్నాయి. శాతకర్ణి ‘బ్రాహ్మణుడే, బ్రాహ్మణ చక్రవర్తే’ అని చెప్పడానికి ఒక్క ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వం’ పుస్తకమే కాకుండా మరెన్నో పుస్తకాలలో పలు ఆధారాలున్నాయి. నాణాలలో కనిపించే ఆయన రూపురేఖలు గౌతమీపుత్ర శాతకర్ణి- నిజమైన బ్రాహ్మణుడే అనడానికి స్పష్టమైన నిదర్శనం. అలాంటప్పుడు చరిత్రను వక్రీకరించి గౌతమీపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణేతరుడిగా చిత్రీకరించడం భావ్యమా?

- వనం జ్వాలా నరసింహారావు సెల్ : 80081 37012