సబ్ ఫీచర్

ఆదిత్యుని పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షుడు ఆదిత్య విగ్రహ పూజ చేశాడని చరిత్ర చెపుతున్నది. ఆ కాలపునాటి మయూర కవి సంస్కృతంలో సూర్య శతకం వ్రాశాడు. సూర్య విగ్రహపూజ ఆరంభ తొలినాళ్ళలో, ఆంధ్రదేశాన ఎక్కువగా సూర్యరథ పూజ జరుగుతుండేది. క్రీ.శ.మూడు, నాలుగు శతాబ్దులలో కృష్ణా, గోదావరీ మధ్య తీరాన్ని ఏలిన శాలంకాయనులు చిత్రరత స్వామి భక్తులు. ఆరాధిత మూల విగ్రహం సూర్యునిదే అయినా చిత్ర రథస్వామి అనే పేరు వ్యావహారికమైంది. కవి మారన విరచిత మార్కండేయ పురాణంలో సూర్య స్తుతి రథపరంగా సాగింది.
‘‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు’’ అంటాడు పోతనామాత్యుడు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, ఆర్క, భాస్కర నామాలతో ద్వాదశాత్మకుడని సూర్యోపాసకులు వర్ణిస్తారు. వివిధ నామాలన్నింటికీ మూలం రథరూప పూజ. రథ సప్తమి అందులోనుండే పుట్టింది. అదే సూర్య జయంతి. సకల చరాచర జీవరాసుల ప్రాణ ప్రదాతయైన సూర్య భగవానుని జయంతిని ‘‘సూర్య జయంతిగా, రథ సప్తమి’’గా పేరెన్నికగన్న మాఘ శుక్ల పక్ష సప్తమి నాడు సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తర గతిని సూచిస్తాయని, ఈదినం సూర్య గ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భక్తుల భావన.

‘‘మతం అని ఒకదానిని ఎంచుకోవలసి వస్తే, లోకానికి అంతటికీ వెలుగును ప్రసాదించే సూర్యుడిని దేవునిగా ఎంచుకుంటాను’’ అన్నాడు నిఖిల లోక విఖ్యాతుడైన నెపోలియన్ చక్రవర్తి. భారతావనిలో సూర్యారాధన ప్రాచీనమైనది. రుగ్వేదంలో సూర్యుని స్తుతితో పది రుక్కులు ఉన్నాయి. వేదమంత్రం గాయత్రి సూర్యపరమైనదే. వేదంలోని సూర్యస్తుతిలో సూర్యరథ, సూర్య గుర్రాల ప్రస్తావన ఉంది. సూర్యుడు ప్రత్యక్ష దైవం. అయినా ఆదిలో విగ్రహ పూజ, ఆలయాలు లేకుండేవి. నవగ్రహాలలో సూర్యపూజ ఉత్కృష్టమైనది. వేదాలలో సౌరసూక్తాలు, రామాయణంలో ఆదిత్య హృదయం భారతదేశంలో సూర్యపూజ పౌరాతనాన్ని స్పష్ట పరుస్తాయి. యాలెన్ అనే చరిత్రకారుని ప్రకారం ఆదిలో సూర్యుని రూపానికి ప్రతినిధిగా కిరణాలతో కూడిన బింబం పుట్టి, పూజార్హమైంది. ఆదిలో నాణాల మీద క్రీ.పూ.రెండు, ఒకవంద ఏళ్ళ మధ్య తొలుత కిరణాల బింబం కానవచ్చేది. పాంచాలంలోని రాజులైన సూర్యమిత్ర, భానుమిత్ర నామముల నాణేలపైన ఉండేవి. విగ్రహ రూప మిత్ర (సూర్య) పూజ పారశీకమున (ఇరేనియన్) ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. సూర్యాలయాలు భారతావనికి శకనృపులతో వచ్చిన మగి పూజారుల భిక్ష. కృష్ణుని కుమారుడు సాంబుడు చంద్రబాగా (చీనాబ్) నదీ తీరాన సూర్యదేవాలయం నిర్మించాడని భవిష్యత్ పురాణ కథనం. నంబాపురం లేదా మూలాస్థానం (ముల్తాన్)లో ఒక సూర్యాలయం ఉందని హూయన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. ఒరిస్సాలోని కోణార్కాలయం మగి బ్రాహ్మణ పూజారుల ప్రాబల్యానికి ప్రతీకగా ఉంది. గుప్తుల పాలనానంతరం, హర్షవర్ధనుని కాలాన సూర్యారాధన పెరిగి, ఆదిత్య భక్తులైన ఆయన తండ్రి తాతలకు ప్రభాకర, ఆదిత్య వర్ధన నామాలున్నాయి.
నవ గ్రహాలలో సూర్యపూజ ప్రధానమైనందున, అట్టి సూర్యుని కొలుచుట ఏడాదికోసారి మాత్రమే, రథ సప్తమినాడే కావడం విశేషం. ఈశ్వరుడు మాఘ శుద్ద సప్తమి నాడు సూర్యుడిని సృష్టించాడని పేర్కొంటారు. పంచాంగ కర్తలు ఈదినానే్న ‘సూర్య జయంతి’గా, ‘రథ సప్తమి’గా, ‘మన్వాది’గా పేర్కొంటారు. రథ సప్తమిని రాజపుటానాలో సౌర సప్తమియని, వంగదేశంలో భాస్కర సప్తమియని, కొన్ని చోట్ల జయంతి సప్తమియని, మరికొన్ని చోట్ల మహా సప్తమియని అంటారు. సూర్యునికి వివస్వంతుడని పేరు. వివస్వంతుని కుమారుడు ఏడవ మనువైన వైవస్వతుడు. మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినమైనందున పితృదేవతలకు ప్రియకరమైనది. ఒకప్పుడు భారత దేశంలో వైవస్వత మన్వాది తిథి సంవత్సరాదిగా చెప్పబడి, ఉగాది పండగగా ఉండేదని భావించ బడుతున్నది. తెలుగుదేశంలోనూ రథసప్తమినాడు అనేక స్ర్తిల వ్రతాలు పట్టే ఆచారం ఉంది. సూర్య ఆరాధన ప్రధానంగా ఆచరించే ఈనాడు సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తర గతిని సూచిస్తాయని పురాణ కథనం. రథ సప్తమినాడు సూర్య గ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భావించే భక్తులు సూర్యోదయానికి పూర్వమే స్నానాదులు ఆచరించి, దానాదులు సూర్యోదయానంతరం చేయాలని ధర్మ సింధువు స్పష్ట పరుస్తున్నది. అతి పుణ్యప్రదమైన గ్రహణ కాలాలు వేయింటి ఫలితం ఒక్క రథ సప్తమికే ఉండగలదని మత గ్రంథాలు వివరిస్తున్నాయి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494