తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మెడలు వంచి రండి దండ ధరించ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు డిగ్రీల వేడి పెరిగిపోయింది. ఎక్కడ చూసినా... మహాసభల వేడుకల ప్రచారమే.. మొదట మూడు సభల్లో లేనంత సందడి. సందడి చేసేది ప్రజలు కాదు. పత్రికా రంగం, దృశ్య మాధ్యమాలు. తమ ఇంట్లో పెళ్లివైభవాలు జరిగి ఆబ.... ఎంతగా ఉవ్విళ్లూరుతున్నారంటే ఏదో ఒకటి రాయకపోతే ఏమి అనర్థం జరుగుతుందోనన్నంత..
తెలుగుకి విశిష్ట భాషాహోదా కోసం ఆందోళన జరిగినప్పుడు, తెలుగు భాషోద్యమ వేదికలు ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంత సంచలనం జరగలేదు. ఇప్పుడే ఎందుకింత హడావిడి. ఉరుకులు పరుగులు. ఎవరైనా చెప్పగలరా? ఊహించైనా సరే. రాజు తలచుకుంటే రాజ్యం ఎగపోస్తుంది. అనుకున్నదే తడవు అన్నీ అమరిపోవాలి. ప్రజలు చెల్లించిన పన్నులు నిండిన బొక్కసం ఉంది. అది సరిపోకపోతే ప్రపంచబ్యాంకు అప్పు రెడీగుంది. మనకేం తక్కువ మహారాజ! అనే కోటరీ ఉంది. ఏ ఖర్చయినా ప్రజల మీదేకదా. వాళ్లు చెల్లించే పన్నులు విలాసాలకు సరిపోకపోతే కొత్త పన్నులు వేయవచ్చు. అంతెందుకు? అప్పులు చేసి తలసరి చొప్పున రుణగ్రస్తుల్ని చేయవచ్చు. ఈ కొత్త ఆర్థిక సూత్రాలు పాటించే కొత్త బిచ్చగాళ్ల తెలివితేటలు చిన్నవేం కాదు. పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకన్నా పురోగామి లక్షణం కలది అని రాసిన పెద్దలు గుర్తించని కోణం ఒకటి ఉందని తెలుసుకోవాలి. అత్యాధునిక పెట్టుబడి లోతుల్లోకెళ్లి చూస్తే అది భూస్వామ్య రాచరిక వ్యవస్థల్ని చిగురింప చేసే లక్షణం, లక్ష్యం కలగలసి ఉందని తెలుస్తుంది. మేధావుల చిలుకపలుకుల కొటేషన్స్ వినివిని కొత్త దొరలుహాయిగా సేదదీరుతున్నారు. లోగడ తమ పూర్వీకులు సమర్థవంతంగా నిర్మించలేని భూస్వా మ్య చట్రాన్ని ఇప్పుడు మరింత పకడ్బందీగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనే ఇవాంకా భజన, తెలుగు సభల గానాబజానా.
తెలుగువైభవం పేరుతో జరిగే సభలు భూస్వామ్య విలువల పునరుత్థానం కోసమే.
చెరువుల పూడిక, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి పథక రచన చేసి, పాట్లుపడి అనుమతులు తెచ్చుకుని, హైకోర్టుల మొట్టికాయల బొప్పి కట్లతో కాస్త విసిగిన మనసులకి ఓ పండుగ కావాలి. లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేస్తే వేల కోట్ల ఇనాం సులభంగా దక్కుతుంది. ఎక్కడైనా ‘‘కంకణాల చేయి ఆడితే కడియాలు చేయి పెడుతుంది’’ అనే నానుడి నిజం. ఒక వ్యవస్థని కరప్ట్ చేస్తే దశాబ్దాల దాకా అది అలాగే ఉంటుంది. జలయజ్ఞం అనుభవం తాలూకూ ప్రభావం పోలవరంగా, మల్లన్నసాగర్‌గా, కాళేశ్వరంగా ఇంకా అనేక తవ్వకం పనులుగా తిరిగి తిరిగి పునర్జీవిస్తుంటాయ. కట్టే కాంట్రాక్టు పనులుగా కొవ్వెక్కించే విధంగా తయారుచేస్తుంటాయి. ఇది లోకం రివాజు. వీటి కోసమే అధికారం కావాలని ప్రజానాయకుల గోల. వారి గోలకి ప్రజల పేరు పెట్టి... కలలు కనేటట్లు చేయగలిగేదే రాజకీయం. సినిమా అదే చేస్తుంది. రాజకీయ రంగం అదే బాట నడుస్తుంది. అందుకే రెంటికి సయోధ్య.
తెలుగు సభల సినిమా కల ఒకటి విడుదల కానుంది. ప్రతి సినిమా విడుదల సందర్భంలో ఇలాంటి ఒక సంచలనం ఉంటుంది. ఐతే విచిత్రం ఏమంటే ఈ సభల సినిమా పట్ల ప్రజలు దూరంగా ఉన్నారు. పత్రికలకి పండగలు ఉండవు. సినిమా ప్రకటనలే వాళ్లకి పండగ. ఇలాంటి సందర్భాల్లో పత్రికలు ప్రజాసేవ చేస్తున్న తృప్తి పొందడానికి, ప్రకటనల తాయిలాలు స్వీకరించడానికి ఆసక్తి చూపుతాయి. పత్రికలు తెలుగు కాకపోతే ఆంగ్లంలో తీస్తాయి. ఇదే వ్యాకరణం ఫాలో అవుతాయి. వాటికి భాషాభేదం లేదు. తెలుగు పేర సంస్కృతమూ, ఇంగ్లీషో ఏదైనా పదజాలం ఒకటే. ప్రజలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు పండగ పత్రికలకే.
ప్రజలు రోజూ, మూడేళ్లుగా, ఆగకుండా నిరంతరం ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోవు. ఎందుకు? పాలకులు పట్టించుకోవడం లేదుగా. పట్టించుకుంటే ప్రకటనలు రావుకదా? పదహారు పేజీల ఆవరేజిలో ఒక్క పూర్తి పేజీ కూడా ప్రజల కోసం ఇవ్వడం లేదు. పైగా ఆ పాఠకులు డబ్బులు పెట్టి పత్రిక కొనాలి. చదవాలి. కానీ వారి కోసం మనం మన బాధ్యత మరిచినా ఫరవాలేదు. ఈ నేపథ్యంలో...తెలుగు పండగ! తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముతో. సీమాంధ్రులకు ఒక బొనాంజా. రాష్ట్రేతరులకి ఆరువందలు మాత్రమే. రాష్ట్రాంధ్రులకి వందే రుసుం. ఇదే తరుణం. మించిన దొరకదు. ఒక్క భాష.. రెండు రాష్ట్రాల పిట్టలు.
రాష్ట్రాలు విడిపోయాక జరగరానిదేదో జరుగుతుందని రాజకీయ నాయకులు, పత్రికలు అనుకున్నాయి. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా హాయిగా, పొరపొచ్చాలు లేకుండా జీవించడం ఆనందించవలసిన విషయం.
కెసిఆర్ ఈ సందర్భంగా చేయవలసిన ఒక పని ఉంది. ఎం.పి. లగడపాటి రాజగోపాల్‌ని పిలిచి, ఆ వేళ అడ్డుగోడలు అనే పాట రాయించి భాషా సేవ చేసినందుకు ప్రత్యేక సన్మానం చేస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య మరింత గాఢమైన స్నేహ బంధానికి ఆస్కారం ఏర్పడుతుంది. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, చక్కని పదబంధాన్ని సృష్టించిన చంద్రబాబుకి భాషా గండబేరుండ బిరుదునిచ్చి సత్కరిస్తే ముచ్చటగా ఉండదా.
బయటవాళ్లకి ఇలా సన్మానాలు చేస్తూ పోతే మా కవులం ఏం కావాలి అని తెలంగాణ వాళ్లు బాధపడిపోనక్కరలేదు. వీరికి సామూహిక సన్మానం పేరుతో వందమందికి మరో వందమంది కలసి ఐదు నిముషాలకొక్క దఫాగా సన్మానించవచ్చు. ఈసారి మిస్ అయినవారికి ఏడాదికోసారి జరిగే మహాసభలలో మరచిపోకుండా సన్మానిస్తారు. అస్మదీయులకు ప్రతిసారి చేస్తారు. ఎవరూ ఏమీ బాధపడవలసిన పనిలేదు. ఇది సభల కాలం. సన్మానాల యుగం.
జరిగేవి తెలుగు మహాసభలు. ఉత్తరాంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు ఈ సభలలో చర్చింపబడుతుందా. లేదా జాతరలో వాటిని విస్మరిస్తారా అని అప్పలనాయుడు శ్రీకాకుళం నుండి ఫోను చేశాడు. నిజమే మరి! సౌదా, నామిని సుబ్రహ్మణ్య నాయుడు, రాసానిల రాయలసీమ భాష గురించి ఒక్కరైనా ప్రసక్తి చేస్తారా? కేవలం రెండున్నర జిల్లాల భాషే మళ్లీ ప్రాధాన్యత వహిస్తుందా? ఈ భాష మీద ఫోకస్ చేయడానికి తెలంగాణ నడిబొడ్డులో సభలా? మళ్లీ గురజాడ వీరేశలింగాల పల్లకిమోత తప్పదా? ఏమో ఏమీ అర్థం కావడం లేదంటాడు గడీల సుధాకర్ రెడ్డి.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అని పాడకుండా తెలుగు సభలు జరపడం సాంకేతికంగా ఒక తప్పు. పాటల కోట అయిన తెలంగాణకి ఒక అధికారిక గీతం లేకపోవడం ఎంత విచిత్రం. ఈ సభలలో అది కొట్టొచ్చే విషయం. సరే. పాట లేకపోయినా తెలుగుతల్లి విగ్రహం అయినా ఉంటుందా? ఉంటే ఆమెకి ఏ పాట నైవేద్యంగా అర్పిస్తారు.
ఇప్పుడు దేశభక్తుల కాలం. వందేమాతరం పాడి జనగణమనతో ముగిస్తే హాయి. లేదా తొందరపడి ఏదో ఏక బలహీన గీతాన్ని అధికార బలంతో ప్రకటించినా బాగుండు. జనం తమకై తాము కొత్త రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్న అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’ గీతం ప్రజలు ఆపకుండా పాడుకుంటారు. అప్పుడు సర్కారు గీతమా? ప్రజల గీతమా? ఏది ప్రశస్తమైన ఉర్రూతలూపే గీతం అవుతుందో తెలిసిపోతుంది. అంటే మళ్లీ బ్రాహ్మణ పెత్తందారీ వర్గాల కవుల గీతమే తీసుకుంటే పాలకవర్గాల స్వభావాన్ని అది బట్టబయలు చేస్తుంది.
కులం అని పలకగూడదు. కాని ఒక సాంస్కృతిక రంగ సలహాదారు, సియంవో అధికారి, అధికార భాషాసంఘం అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్... అందరూ నన్నయ్య వారసులే. ఇక పాలకురికి సోమనాథుడు, పోతన, వేమనలు ఆ నిచ్చెనమెట్ల కింద దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగంలో, అమరావతి నిర్మాణంలో ఒకే సామాజిక వర్గం ఎలా అయితే ప్రకంపనలు సృష్టిస్తున్నదో తెలంగాణలో ప్రపంచ సభలు పుణ్యమా అని పాలకుల కులస్వభావాన్ని బట్టబయలు చేసింది.
దీనిని వ్యతిరేకించేవారిని నిరసనకారులు, అసమ్మతివాదులు అంటారు. వీరు సభలకి ‘దూరం’! వారు ‘పాల్గొనరు’ పైపై బహిష్కరిస్తారు. ఆపై శిష్ట వర్గం వారితో చెట్టపట్టాలు వేసుకుంటారు. వారిలో విప్లవనామ రచయితలు చిన్నాపెద్దా అందరూ ఉంటారు. ఇది ఒక నాటకం.
లోలోపల బాధపడినా పైకి ఏమీ అనలేని పరిస్థితి. ఐనా తెలంగాణ ఎప్పుడూ ప్రజాపక్షపాతే. పాలకులు ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేం చెప్పిందే వేదం అంటారు. అలా అన్నప్పుడే జరగవలసింది జరుగుతుంది. ఏభై కోట్ల పెట్టి భాషా సాహిత్యాలకి ఏం ఒరగపెడతారో చూడాల్సిందే.
ఒక రజనీకాంత్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన సినిమా హైదరాబాదులో ఐదు రోజులు ఆడబోతోంది. ప్రజలు తిలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ‘రీలు’ సిద్ధమైంది. ఈలలు, కేకలు వేసే కవులూ రెడీ.
పాపం 56 తెలుగు అక్షరాలే ఎందుకో దిగాలుగా ఉన్నాయి. వాటిని ఓదార్చే నాథుడు కరువైనాడు. అందరూ జ్వర పీడితులే. రోగం ఏమిటో తెలుసు. మందే దొరకడం లేదు. మందులు రాయడానికి ‘కలం’ లేదు. అన్ని రంగుల కలాలు సభల ద్వారాల దగ్గర సన్మానాల కోసం వేచి ఉన్నాయ. వాటిని డిస్ట్రబ్ చేయకండి!