తెలంగాణ

దేశవ్యాప్తంగా ఇంటింటికీ మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణలో ప్రతీ ఇంటికీ సురక్షిత మంచినీరు అందించినట్టే దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. ప్రజలకు మంచినీటిని అందించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటిని అందించే పథకాన్ని చేపట్టాలని యోచిస్తున్నామన్నారు. ఇక్కడి ప్రగతిభవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో కేంద్ర మంత్రి షెకావత్ సమావేశమయ్యారు. మంచినీటి పథకాన్ని అమలు చేయడంతో పాటు మురుగు నీటిని ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో శుద్ధిచేసి వ్యవసాయానికి, గృహ అవసరాలకు వినియోగించాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ పథకం అమలుపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు ప్రతీ నిత్యం అందించడానికి మిషన్ భగీరథ పథకం చేపట్టాం. తెలంగాణలో చాలాచోట్ల మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. చాలాచోట్ల ఫ్లోరైడ్ సమస్య ఉండేది. అలాగే కొన్నిచోట్ల మంచినీరే లభించని పరిస్థితి. కొన్నిచోట్ల దొరికినా శుభ్రంగా ఉండకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యేవారు. ఈ నేపథ్యంలో గోదావరి, కృష్ణా జలాలు శుద్ధి చేసి ప్రతినిత్యం ఇంటింటికీ మంచినీరు అందించడానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పథకం దాదాపు పూర్తయింది. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలకు ఇబ్బందులు తప్పాయి. వారి జీవన పరిస్థితులు మెరుగయ్యాయి. రాబోయే 30 ఏళ్ల దాకా పెరిగే జనాభాను అంచనా వేసి అప్పటి అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుకు డిజైన్ చేశాం. ఇలాంటి పథకం దేశమంతా అమలైతే మంచిది. ప్రజలకు మంచినీరు అందించడానికి చేసే కార్యక్రమాలను ఆర్థిక కోణంలో చూడవద్దు’ అని సీఎం కేసీఆర్ వివరించారు. ‘దేశంలో ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ లక్ష్యాన్ని సాధించింది. మిషన్ భగీరథ పథకం నిర్వహణకు ఆర్థిక సహకారం అందించండి’ అని కేంద్ర మంత్రిని సీఎం కేసీఆర్ కోరారు. 11వ శతాబ్దంలోనే కాకతీయులు వేలాది చెరువులు తవ్వించారని, సమైక్య పాలనలో అవన్నీ నాశనమయ్యాయని సీఎం అన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగిందని సీఎం వివరించారు. అలాగే చెరువుల కింద 90 శాతం ఆయకట్టు స్థిరీకరించినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కేంద్ర మంత్రి షెకావత్ ప్రశంసిస్తూ క్షేత్రస్థాయిలో మరోసారి పర్యిటించి అమలును స్వయంగా పరిశీలించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షం నాయకుడు నామా నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సోమవారం సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి