తెలంగాణ

బయట తిరగకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాల వరకు సెలవులు ఇచ్చామని, సెలవులు ఇచ్చింది పార్క్‌లకు, మాల్‌లకు, పర్యాటక కేంద్రాలకు తిరిగేందుకు కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తల్లిదండ్రులు టీవీల ద్వారా గమనిస్తున్నారు కదా అంటూ గుర్తుచేశారు. సెలవులు ఉన్నాయి కదా అంటూ ప్రయాణాలు చేయవద్దని, ఎక్కువమంది ఉండే ప్రాంతాలకు వెళ్లవద్దని, ప్రతి కుటుంబం కూడా తమ పిల్లలతో ఇంటికే పరిమితం అయితే మంచిదని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే గత 15 రోజుల నుండి తాము ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వాలంటే ప్రతిఒక్కరు సహకరించాలని మంత్రి కోరారు. భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాన్ని కూడా రద్దు చేశామని, పరిమిత సంఖ్యతోనే రామనవమి ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఇతర దేవాలయాల్లో కూడా భక్తులు భారీ సంఖ్యలో గుమికూడకుండా చూస్తున్నామన్నారు. ముస్లింలు నమాజును ఇళ్లల్లోనే చేసుకోవాలని, క్రిస్టియన్లు కూడా ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని మంత్రి సూచించారు. పెళ్లిళ్లు వాయిదా వేసుకోలేని స్థితిలో కొద్దిమంది సమక్షంలోనే చేసుకోవాలని మంత్రి కోరారు. జన్మదిన కార్యక్రమం, చీరకట్టే కార్యక్రమం తదితర శుభకార్యక్రమాలకు ఎక్కువ మంది జమ కాకుండా చూడాలన్నారు. వీలైతే వీటిని రద్దు చేసుకోవాలన్నారు. ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు తదితర కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది శానిటైజర్లు వాడాలని, ఇళ్లలో సబ్బుతో చేతులను కడుక్కోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రజల్లో ఎవరికి కూడా ఇప్పటివరకు కరోనా సోకలేదన్నారు. విదేశాల నుండి వస్తున్న వారికి మాత్రమే కరోనా ఉన్నట్టు నిర్ధారణ అవుతోందని, బుధవారం వరకు ఆరుగురికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయిందన్నారు. స్కాట్లండ్ నుండి వచ్చిన 21 సంవత్సరాల యువకుడికి కరోనా పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ కావడంతో అతనికి కూడా చికిత్స ఇస్తున్నామన్నారు. కరోనా సోకిన ఆరుగురిలో ఒకరిని దవాఖానా నుండి డిశ్చార్జి చేశామని, మిగతా వారికి గాంధీ దవాఖానాలో చికిత్స అందిస్తున్నామన్నారు. కరోనాతో చనిపోయిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు గుల్బర్గా వెళ్లివచ్చిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురికి పరీక్షలు నిర్వహించామని, నెగెటివ్‌గా నివేదిక వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనాపై అత్యంత జాగ్రత్తగా ఉందని, ప్రపంచంలోని దేశాల్లో కరోనా ఉన్న దేశాల నుండి మన దేశానికి వస్తున్న వారికి పరీక్షలు నిర్వహించి, అనుమానితులను క్వారంటైన్ చేస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో 40 బస్సులను సిద్ధంగా ఉంచామని, అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ఈ బస్సులను ఉపయోగిస్తున్నామన్నారు. విమానా
శ్రయంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండి పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లాస్థాయి అధికారులతో బుధవారం తాము వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు. విదేశాల నుండి వస్తున్న వారిని క్వారంటైన్ చేసి, పరిశీలనలో పెట్టేందుకు 20 వేల మందికి కూడా జిల్లాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి క్వారంటైన్ కేంద్రంలో డాక్టర్, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారని, రెవెన్యూ శాఖ ద్వారా భోజనం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు వైద్య చికిత్స సమర్థతగా ఉండేలా చూస్తున్నామన్నారు.

*చిత్రం... వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్