తెలంగాణ
మల్లన్నసాగర్లో మాయగాళ్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిద్దిపేట, జనవరి 12: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం అదనుగా చేసుకుని నకిలీ రికార్డులు సృష్టించి పరిహారం పేరుతో కోట్లు కొట్టేయాలని చూసిన కొందరి బాగోతం బట్టబయలైంది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతులకు చెందిన ముంపుప్రాంతంగా చూపించి, నకిలీ పట్టాలు సృష్టించి రూ. 15 కోట్ల మేర పరిహారం నిధులు స్వాహాకు చేసిన కుట్ర విఫలమైంది. కొందరు రైతులు ఇచ్చిన సమాచారంతో ఆర్డీఓ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుట్ర బయటపడింది. మరణించిన ఓ తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి, మరికొందరు ఉన్నతాధికారుల స్టాంపులకు నకిలీవి సృష్టించి దొంగ పట్టాపుస్తకాలు తయారు చేసిన కొందరు ఇప్పటికే లక్షల సంఖ్యలో రైతులనుంచి నగదు వసూలు చేశారు. మరికొందరినుంచి పరిహారం అందాక డబ్బు చెల్లించేలా బాండ్లూ రాయించుకున్నారు. అలా పొందిన రికార్డులపై సందేహంతో కొందరు రైతులు ఆర్డీఓకు అసలు విషయం చెప్పడంతో గుట్టురట్టయింది. ఈ బాగోతం సిద్దిపేట జిల్లాలో వెలుగుచూసింది. రెవిన్యూశాఖకు చెందిన కొందరి ఇళ్లపైన, జిరాక్స్ సెంటర్లపైన పోలీసులు దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఓ సర్పంచ్ భర్తతోపాటు మరొకరిని అరెస్టు చేశారు. ఓ తహశీల్దార్, విఎఒ, విఆర్ఓలతోపాటు మరికొందరి పాత్ర ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు విస్తుగొలిపేలా ఉన్నాయి.
మొదటినుంచి అదే తంతు..
మల్లన్నసాగర్ భూముల విషయంలో గతంలో తహశీల్దార్ దేశ్యానాయక్, విఆర్ఓలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు తహశీల్దార్ను సిసిఎల్ఏకు సరెండర్ చేయగా, విఆర్ఓలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ కొందరు రైతులు జరుగుతున్న మోసాలను తన దృష్టికి తీసుకురావడంతో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిపి ఆదేశాల మేరకు ఏసిపి నర్సింహారెడ్డి, తొగుట సిఐ సోంనారాయణసింగ్, వన్టౌన్ సిఐ సురేందర్ రెడ్డి తదితరులు ఏకకాలంలో దాడులు చేసి తొగుట మండలం రాంపూర్ సర్పంచు భర్త అప్పనపల్లి అంజనేయులు, మాజీ విఆర్ఏ కనకరాజు, విఆర్ఓ జగన్, విఆర్ఏ శంకర్లను గుర్తించి దాడులు చేశారు. సిద్దిపేటలో పద్మ జిరాక్స్సెంటర్ పై దాడులు నిర్వహించారు. పోలీసు విచారణలో నకిలీ పట్టా సర్ట్ఫికెట్లు, టైటిల్ డీడ్స్, డిఫాంలు తహశీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు.
ఇదీ అవినీతి బాగోతం
ఈ విషయం పై అధికారులు పూర్తి విచారణ జరుపగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి. తొగుట మండలం రాంపూర్లో 800 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. మల్లన్నప్రాజెక్టు నిర్మాణంలో ముంపుగ్రామాలకు ప్రభుత్వం ఎకరానికి 5-6 లక్షల వరకు పరిహారం చెల్లించనుంది.
ప్రాజెక్టు కింద రాంపూర్తో పాటు పరిసర గ్రామాలు కూడా ముంపునకు గురౌతున్నాయి. ఇదే అదనుగా ప్రభుత్వ భూమిని చూపించి పరిహారం కాజేయాలని సర్పంచు భర్త అంజనేయులు ప్లాన్ వేశాడు. గ్రామంలో అనుకూలంగా ఉన్నవారిని గుర్తించి ఒక్కొక్కరి నుంచి ముందుగానే 5వేల నుంచి లక్షలవరకు వసూలు చేశాడు. వారి పేరుమీద నకిలీ పట్టాలు, టైటిల్ డీడ్స్, డిఫాం, పట్టాదారు పాస్పుస్తకాలు రూపొందించారు. ప్రభుత్వం పరిహారం పొందితే ఒక్కో వ్యక్తినుంచి ఎకరానికి 25వేలు చెల్లించాలని బాండ్ పత్రాలను రాయించుకున్నారు. కాగా గ్రామంలో ఈ విధంగా 21మంది 44.27 ఎకరాల పట్టాలు అక్రమంగా పొందారు. ఇటీవలే తుక్కాపూర్, తొగుట గ్రామాల్లో భూకుంభకోణంలో తహశీల్దార్ దేశ్యానాయక్, ఇద్దరు విఆర్ఓల మీద వేటుపడింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు తాము పొందిన రికార్డులను ఆర్డీఓ ముత్యంరెడ్డికి అందించి విషయం తెలిపారు. దీంతో అవాక్కైన ఆర్డీఓ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు అంజనేయులుతోపాటు విఆర్ఏ కనకరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
భిక్కనూరు నుంచి పాస్పుస్తకాలు
కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో జారీ అయిన పట్టాదారు పుస్తకాలు ఇక్కడికి తెచ్చి వారి పేర్లురాసి నకిలీ పాస్పుస్తకాలు సృష్టించారు. తహశీల్దార్ , ఆర్డీఓ సంతకాలకింద తొగుట తహశీల్దార్, సిద్దిపేట ఆర్డీఓ స్టాంప్లు తయారు చేసినట్లు తెలిపారు. గతంలో తొగుట తహశీల్దార్గా చేసిన ప్రభుదాస్ సంతకాలు సైతం పాస్బుక్ తయారీలో వినియోగించినట్లు తెలిపారు. తహశీల్దార్ ప్రభుదాస్ ఇటీవల మృతి చెందినా ఆయన సంతకాలు ఫోర్జరీ చేసి పాస్బుక్కులు, టైటిల్డీడ్స్, డిఫాంలు తయారు చేశారు. ఏదేమైనా మల్లన్నసాగర్ భూకుంభకోణం వెలుగుచూడడంతో ఈ ప్రాంతలో ఉలిక్కిపడ్డారు. కోట్లాది రూపాయలు కాజేసేందుకు కుట్ర పన్నినా ప్రభుత్వం నుంచి పరిహారం అందకోకపోవడం గమనార్హం. దీంతోకోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. ఏదేమైనా కొంతమంది అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగిందని ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ చేస్తే అసలు విషయం ప్రజలకు తెలిసే అవకాశం ఉంది.
చిత్రాలు....ఫోర్జరీతో రూపొందించిన డిఫాం.. నకిలీ పట్టాదారు పాస్పుస్తకం