తెలంగాణ

వలస.. అదే వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచార బతుకులకు బంగారు బాటలు పడేదెప్పుడు?
పోయేవారే తప్ప తిరిగొచ్చేవారేరి?
ఆగని పాలమూరు మట్టిమనుషుల వలస ప్రయాణం
తెలంగాణ వచ్చినా మారని దుస్థితి
ప్రభుత్వానివి కాకి లెక్కలే
పోషించేవారు లేక, దిక్కులేని వృద్ధులు
పిల్లలపై పడుతున్న వలసల ప్రభావం

పిల్లల కోసమే
వలసలు

లక్ష్మీబాయి, శాంతయ్య దంపతుల ఆవేదన (కోయిలకొండ గ్రామం)
మా బాధ ఎవరికి చెప్పుకున్నా తీరదు. ఉన్న భూమి బీడువారింది. ఇద్దరు పిల్లలను చదివించుకోవాలి. వారిని ప్రయోజకులుగా చేయాలి. మాకు అదృష్టం బాగులేదు. పిల్లలతో కలిసి మా బంధువులందరికి దూరంగా వెళ్తున్నాం. భవన నిర్మాణ కూలీలుగా మేమిద్దరం పుణెలో పని చేస్తున్నాం

మహబూబ్‌నగర్, మే 7: తెలంగాణ వస్తే పాలమూరు ప్రభ వెలిగిపోతుందని అంతా ఆశపడ్డారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మట్టిమనుషుల వలసలు ఆగిపోతాయనుకున్నారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ బతుకు కోసం బయటకు వెళ్లిన వారంతా పొలోమని వెనక్కి వచ్చేస్తారని నమ్మారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లయింది. అడపాదడపా నాయకులు ఉత్తుత్తి ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు. పాలమూరు నుంచి వలసలు తగ్గాయంటూ కాకిలెక్కలు చెప్తూనే ఉన్నారు. అద్భుతం ఏదో జరిగిపోతుందంటూ ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ, ఈ మూడేళ్లలో పాలమూరులో ఎక్కడా పరిస్థితి ఇసుమంతైనా మారలేదు. వలసలు ఆగలేదు. ముఖ్యంగా గిరిజన తండాల్లోకి వెళ్తే అక్కడి పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా కనిపిస్తోంది. తల్లికి బిడ్డ దూరం.. బిడ్డకు తల్లి దూరం.. తండ్రి ఏమయ్యాడో తెలియదు. ఎక్కడికి ఎందుకు వెళ్లాడో అర్థం కాదు. తండ్రి చేతులు పట్టుకుని తిరిగే వయస్సులో తల్లి కొంగు పట్టుకుని ఆడుకుకోవలసిన చిన్నారుల బతుకులు లేత వయసులోనే ఛిద్రమవుతున్నాయి. పూట గడవక సుదూర ప్రాంతాలకు వలసలకు వెళ్లిన తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నోచుకోని పిల్లల పరిస్థితి వర్ణనాతీతం. గిరిజన తండాలో పరిస్థితి దారుణంగా మారింది. పలక బలం పట్టాల్సిన చిట్టి చేతులు సైతం పెద్దల వెంట వెళ్లి పనులు చేయాల్సిన దుస్థితి పాలమూరు బిడ్డల బతుకు వెతలకు అద్దం పడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలమూరు వలస కూలీల బతుకుల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నవారు లక్షల్లో ఉన్నారు. పాలమూరు జిల్లాకే ప్రజలు వలసలు కడతారన్న నాయకుల ప్రసంగాలు ఎప్పుడు నిజమవుతాయోనని కొండంత ఆశలు మట్టి మనుషుల మనుస్సులను ఎప్పుడూ తొలుస్తూనే ఉన్నాయి. ప్రతి ఏటా ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 14లక్షల మంది పాలమూరు బిడ్డలు ముంబయి, పుణె, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఒడిశా, దుబాయ్, మలేషియాలకు వలసలు వెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతికి సైతం వలసబాట పట్టారు. అక్కడ భవనాల నిర్మాణం కోసం పాలమూరు కార్మికులనే కాంట్రాక్టరు ఆశ్రయిస్తున్నారు. దీంతో గుండుగుత్తాతో పనులకు వెళ్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు గిరిజన తండాలలో వృద్ధులు తప్ప మరెవరూ కనపడటంలేదు. నారాయణపేట, మక్తల్, వనపర్తి, కొడంగల్, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ప్రాంతాలలో నిత్యం ప్రజలు బయటకు వెళ్లటమే తప్ప తిరిగి వచ్చేవారు లేరు. నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ డిపోల నుండి ముంబయికి వెళ్తున్న ఆర్టీసి బస్సులు వలస కూలీలతో ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. ప్రతి రోజు మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల సమయంలో అందరి ముఖాల్లో విషాదం అలుముకుంటుంది. కన్న పిల్లలను వృద్ధుల దగ్గర ఉంచి ముంబయి బస్సు ఎక్కుతుంటే తల్లుల, పిల్లల రోదనలు అక్కడి ఉన్నవారందరినీ కలిచివేస్తాయి. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు పాలమూరు నుండి 15 లక్షల మందికి పైగా వలసలు వెళ్లారనేది అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కానీ ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం వలసలు వెళ్లిన వారంతా తిరిగి పాలమూరుకు వస్తున్నారని బహిరంగ సభల్లో చెప్పుకుంటున్నారు. హన్వాడ మండలంలోని గొండ్యాల, వేపూర్, మునిమోక్షం, దామరగిద్ద మండలంలోని దాదాపు 22 గిరిజన తండాలు జనం లేక బోసిపోతున్నాయి. మద్దూరు మండలంలో దాదాపు 32గ్రామాలలో సగం మంది జనం వలసల బాట పట్టారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలలో ప్రతి గిరిజన తండాతో పాటు వివిధ గ్రామంలో దాదాపు రెండు వందలకుపైగా కుటుంబాలు వలసలు వెళ్లి బతుకుతున్నాయి. పండగలు, పెళ్లిలకు తప్ప సొంత గ్రామానికి వచ్చే దాఖలాలు ఏమాత్రం లేవు. కోయిల్‌కొండ మండలంలోనే ఏకంగా దాదాపు 15వేలకు మందికి పైగా వలసులు వెళ్లారంటే పాలమూరు జిల్లాలో ఏ మేరకు వలసలు వెళ్తున్నారో ఇదే నిదర్శనం. ఉపాధిహామీ పథకం అమలులో ఉన్నప్పటికినీ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. ఉపాధిహామీ పథకం కింద ఏటా రూ.450 కోట్ల నుండి రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ లక్ష్యం నెరవేర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిధులు ఖర్చు కాక వెనక్కి వెళ్తున్నాయి. అయితే ఇటీవల ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పలు సభలో పాలమూరుకు వలసలు వస్తున్నారంటూ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదంటూ జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పాలమూరు నుండి వలసలు పోయేవారే తప్పా ఇక్కడికి వచ్చేవారు లేరంటూ వ్యంగ్యాస్త్రాలు సైతం వెలువడుతున్నాయి.

సొంత గ్రామంలో బతుకుదెరువులేదు
* వలస కూలి బిస్లావాత్ నాయక్ (దామరగిద్ద గ్రామం)
సొంత గ్రామంలో బతుకుదెరువులేదు. అందుకే ముంబయికి వెళ్తున్నా. పదేళ్లుగా ముంబాయిలో కూలీపని చేసుకుంటూ భార్య పిల్లలను సాకుతున్నా

* ఉపాధి హామీ’ కూలీ ఇవ్వట్లేదు
* వలస కూలీలు వెంకటేష్, చందర్, లక్ష్మీ, బాబులు ఆగ్రహం

ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే సరిగా కూలీ ఇవ్వడంలేదు. నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. అందుకే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నాం.

చిత్రం... మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో ముంబాయి బస్సులో వలస వెళ్తున్న పాలమూరు కూలీలు