ఆంధ్రప్రదేశ్‌

మరో రెండేళ్లు స్థానికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్షన్ 108 గడువూ పొడిగించాలి కేంద్రాన్ని కోరాలని ఏపీ నిర్ణయం
కాదంటే సుప్రీంకు వెళ్లే యోచన ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష మంత్రి కాలవ, పరకాల వెల్లడి

విజయవాడ, మే 19: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 108ని మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని ఏపీ కోరనుంది. అదేవిధంగా స్థానికత గడువూ మరో రెండేళ్లు పొడిగించాలంటూ కేంద్రాన్ని కోరాలని ఏపీ నిర్ణయించింది. సచివాలయం 1వ బ్లాక్‌లోని తన కార్యాలయంలో ఈ అంశాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారులతో సిఎం చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. విభజన చట్టం అమలు తీరు, స్థానికత, సెక్షన్ 108, షెడ్యూల్ 9, 10 సంస్థలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. సమీక్షలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమాచార మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పొందుపర్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వర్శిటీలు, పరిశోధన సంస్థలు తదితర 231 సంస్థల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే సెక్షన్ 108 కింద రాష్టప్రతికి నివేదించే అవకాశం ఉందన్నారు. అయితే జూన్ 1తో ఆ సెక్షన్ కాలపరిమితి ముగుస్తోందని, ప్రస్తుతానికి సమస్యలు ఏమీలేకున్నా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తతో ఆ సెక్షన్‌ను రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలని సిఎం నిర్ణయించినట్టు తెలిపారు. ఉన్నత విద్యామండలికి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని, అయితే దానికి విరుద్ధంగా కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరినట్టు మంత్రి కాలవ చెప్పారు. కేంద్ర ఉత్తర్వుల ప్రకారం ఏదైనా సంస్థ ప్రధాన కార్యాలయం ఏ భవనంలో ఉంటుందో దానినే హెడ్ క్వార్టర్ అనాలని, ఆ భవనం ఉన్న ప్రాంగణం మొత్తాన్ని పరిగణించరాదన్నారు. అయితే ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. 9వ షెడ్యూల్‌లోని 64 సంస్థలకు సంబంధించి షీలా బేడీ కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేసిందన్నారు. ఇంకా 35 సంస్థల సిబ్బంది విభజన ఆమోదించాల్సి ఉందన్నారు. విభజన చట్టంలోని హక్కులను చాలావరకు రాబట్టామని, అందులో లేనివి కూడా సాధించినట్టు పేర్కొన్నారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ తరచూ గవర్నర్‌తో సమావేశం అవుతున్నట్టు మంత్రులు తెలిపారు. ఆ సమవేశాలకు తెలంగాణ నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోందని, దానిని మరింత వేగవంతం చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్నారు. అన్ని అంశాలను తెలియజేస్తూ ఈనెల 11న కేంద్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినట్టు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించమని ఆ లేఖలో కోరామన్నారు. చట్ట ప్రకారం రావలసినవన్నీ దక్కించుకోవడానికి, న్యాయం జరిగే వరకూ కేంద్రం ద్వారా ప్రయత్నిస్తామన్నారు. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించి రావాల్సిన ఆస్తులను రాబడతామన్నారు. అలాకాని పక్షంలో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. త్వరలో తామిద్దరితో పాటు ఉన్నతాధికారులు కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి, హోం శాఖ అధికారులను కలిసి అన్ని అంశాలను వివరిస్తామని చెప్పారు.
వివాదాలు లేవు ఇబ్బందులే: పరకాల
ఉన్నతస్థాయిలో దఫదఫాలుగా సమావేశమవుతూ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరిస్తున్నట్టు పరకాల ప్రభాకర్ తెలిపారు. విభజన విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలేమీ లేవని, ఇబ్బందులు మాత్రమే ఉన్నాయన్నారు. వాటిపై పరిపాలనా పరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. ముందుజాగ్రత్త చర్యగా సెక్షన్ 108ని పొడిగించమని కోరుతున్నట్టు తెలిపారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్ విడిపోయి ఇంతకాలమైనా వాటికి సంబంధించిన ఆస్తులు, ఇతరత్రా విభజనలు ఇంతవరకు పూర్తికాని విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందని, ఆస్తులు, నగదు, భవనాలు, అప్పుల విభజనను పునఃపరిశీలించమని కోరుతున్నట్టు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు అన్ని విధాలా రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కొన్ని క్లిష్టమైన అంశాలు ఉంటాయని, అవికూడా త్వరగానే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్థానికత అంశం కూడా జూన్ 1తో ముగుస్తోందని, దాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు. అన్ని అంశాల్లో న్యాయం పొందేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామని, హక్కులను సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని, అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని పరకాల చెప్పారు.

చిత్రం... విభజన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు