ఉన్నమాట

యువరాజే మారాజైతే కాంగ్రెస్ కొంప కొల్లేరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొట్టిబావ కాంగిరెస్సు
మేజరయ్యేదెప్పుడు?
పెంటకుప్ప పెరిగి మేరు
పర్వతమైనప్పుడు
-అన్నాడు శ్రీశ్రీ. మన కాలపు కాంగ్రెసు చిట్టిబాబూ ఆ బాపతే. కాని కాంగ్రెసు ఆత్మాహుతి దళవాయిలు ఆ మాట చస్తే ఒప్పుకోరు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ సాధించాలని ముచ్చటపడుతున్న నరేంద్ర మోదికి ఆ బంగారు అవకాశాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదలచలేదు. చారిత్రక అవసరమైన పుణ్యకార్యమేదో తామే లాగించి, ఆ ఘనత యావత్తూ తామే కొట్టెయ్యాలని వారు కంకణం కట్టుకున్నట్టుంది. బహుశా అందుకే - రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు నడుము విరిగీ విరగగానే, అది విరగడానికి ప్రధాన కారకుల్లో ఒకడైన యువరాజాను ఏకంగా పార్టీకే మహారాజును చెయ్యాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.
రాచరిక వ్యవస్థలో ఒక ఇబ్బంది ఉన్నమాట నిజం. రాజ్యంలో యోగ్యులు, సమర్థులు ఎంతమంది ఉన్నా సింహాసనం మాత్రం రాజకుమారుడికే దక్కాలి. స్వతంత్రం రావడానికి ముందు పరిస్థితి ఎలా ఉన్నా స్వతంత్రమనబడేది వచ్చాక కాంగ్రెసు రాజ్యం నెహ్రూ వంశానికి హక్కు భుక్తమైంది. కాబట్టి ఉత్తరాధికారం విషయంలో సదరు రాజవంశానికి వెలుపల ఛాయిస్ లేనే లేదు.
ప్రజాస్వామ్యపు చాదస్తాలను పట్టుకు వేలాడిన పాతరోజుల్లో ఏడాది తిరిగేసరికి కాంగ్రెసుకు అధ్యక్షుడు మారుతూండేవాడు. మహాత్మాగాంధీ అంతటివాడు కూడా కాంగ్రెసుకు అధ్యక్షుడుగా ఉన్నది ఒకే ఒక సంవత్సరం. ఆనువంశిక పాలన వచ్చాక జవాహర్‌లాల్ నెహ్రూ 4 ఏళ్లు, ఇందిరాగాంధి 7 ఏళ్లు, రాజీవ్‌గాంధీ 6 ఏళ్లు మాత్రం అధ్యక్ష స్థానం అధిష్ఠించగా సోనియా మైనో మదాంగారు పూర్వపు రికార్డులన్నీ బద్దలుకొట్టి ఏకబిగిన 18 ఏళ్లుగా ఏకచ్ఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. ఇంగ్లిషువాడు ఎ.ఒ.హ్యూమ్ స్థాపించిన కాంగ్రెసు మహాసంస్థకు ఇటలీ మహిళ అత్యధిక కాలం అవిచ్ఛిన్నంగా సర్వాధికారి కావడం చారిత్రకవైచిత్రి.
ఇప్పుడైనా సోనియాజీ పెత్తనానికి వచ్చిన గత్తర ఏమీ లేదు. కావాలనుకుంటే ఆమె జీవిత పర్యంతం అధ్యక్ష పీఠాన్ని అంటిపెట్టుకునే ఉండవచ్చు. కాంగ్రెసు ప్రజలు ఎవరూ వద్దనరు. తప్పనరు. అధికార దండం అర్జంటుగా వదిలెయ్యాలన్న ఆలోచన అమ్మవారికి కూడా లేదు. ఎటొచ్చీ కాంగ్రెసు ఆస్థానంలోని కొందరు వీరవిధేయులే రాజమాతను ఒప్పించి రాకుమారుడికి పట్ట్భాషేకం చెయ్యాలని ఓవరైపోతున్నారు. బయటివాడి పేరెత్తడం నిష్కృతిలేని నేరం. ముద్దుల యువరాజును మారాజును చెయ్యాలంటే చల్లని తల్లి ఏమీ అనుకోదు; కోపగించదు. ఆ సంగతి యువమేళం వాళ్లకు తెలుసు. ఎన్నికల్లో వరసగా మట్టికరుస్తూ ఒక రాష్ట్రం తరవాత ఒక రాష్ట్రం చెయి జారిపోతూ, పార్టీ మనుగడే ప్రమాదంలో పడిన అపత్కాలంలో ముంపును అరికట్టి, కొత్త తెరచాప ఎత్తి కాంగ్రెసు పడవను గట్టెక్కించటం కుమార్రాజా వల్లే అవుతుందని వారు ఢంకా కొట్టి చెబుతున్నారు. చిరకాలంగా పాతుకుపోయి, పార్టీని తిన్నగా నడవనివ్వని పనికిమాలిన సజ్జును ఊడ్చేసి, కొత్తరక్తం ఎక్కించగల రాహుల్జీకి రాజ్యాభిషేకం చేస్తే గాని కాంగ్రెసుకు దశ తిరగదనీ పెద్ద ప్రచారం జరుగుతున్నది.
నిజమే. ఇప్పటి కాంగ్రెసు పరిస్థితిని చూస్తే దాని పూర్వవైభవం తెలిసిన వారెవరికైనా కడుపు తరుక్కుపోతుంది. స్వాతంత్య్రం వచ్చాక చాలా ఏళ్లు మొత్తం దేశాన్ని, అన్ని రాష్ట్రాలను ఆ పార్టీ ఏకచ్ఛత్రంగా ఏలింది. ఎమర్జన్సీ అఘాయిత్యాన్ని యావద్దేశం ఏవగించుకున్న 1977 ఎన్నికల్లోనూ లోక్‌సభలో 154 స్థానాలను కాంగ్రెసు గెలుచుకోగలిగింది. బోఫోర్స్ అవినీతితో రాజీవ్‌గాంధి ‘మిస్టర్ క్లీన్’ ఇమేజి మంట కలిసి, అధికారం కోల్పోయినా 1989 ఎన్నికల్లో 197 లోక్‌సభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకోగలిగింది. త్యాగమయ సోనియాజీ గారి పదిహేనేళ్ల పార్టీ పెత్తనం, పదేళ్ల బినామీ పరిపాలన దరిమిలా 2014 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి 543 స్థానాలుగల లోక్‌సభలో దాదాపుగా 500 స్థానాలూ గల్లంతై వట్టి 44 మాత్రం కాంగ్రెసుకు నిలిచాయి. ఆఖరికి ప్రధాన ప్రతిపక్షమన్న గుర్తింపునకు కూడా నోచుకోక తృణమూల్ కాంగ్రెస్, ఎ.డి.ఎం.కె.ల్లాంటి ప్రాంతీయ పార్టీల స్థితికి జాతీయ కాంగ్రెస్ దిగజారింది.
దేశంలో 69 శాతం ప్రాంతం బి.జె.పి., దాని మిత్రపక్షాల ఏలుబడిలో ఉంటే ఇప్పుడు కాంగ్రెసు కూటమి చేతిలో మిగిలిన ప్రాంతం 14 శాతం మాత్రమే. 2014 శృంగభంగం నాటికి 13 రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీ రాజ్యమేలుతున్నది. ఈ రెండేళ్లలో ఆ పార్టీ వరసగా 6 రాష్ట్రాల్లో చిత్తుగా ఓడింది. కేరళ, అసోంలు మొన్నటి ఎన్నికల్లో రాంరాం అన్నాక కాంగ్రెసు అధికారం కేవలం 6 రాష్ట్రాలకు, దేశ జనాభాలో మొత్తం కలిపి 6 శాతానికి కుంచించుకు పోయింది. ఆ ఆరింటిలోనూ మూడు ఈశాన్య ప్రాంతంలో రాజకీయ ప్రాముఖ్యం బొత్తిగా లేని బుల్లి రాష్ట్రాలు (మణిపూర్, మేఘాలయ, మిజోరం). ఉత్తరాఖండ్‌లో చావుతప్పి, కన్నులొట్టబోయి సుప్రీంకోర్టు దయవల్ల దక్కిన అధికారం ఎన్నాళ్లు నిలుస్తుందో చెప్పలేము. హిమాచల్‌ప్రదేశ్‌లో అవినీతి సుడిగుండంలో చిక్కి సిబిఐ దర్యాప్తుతో సదమదమవుతున్న వీరభద్రసింగ్ ప్రభుత్వం ఎంతకాలం బతికి బట్టకడుతుందో తెలియదు. కాంగ్రెసుకంటూ నికరంగా మిగిలిన పెద్ద రాష్ట్రం కర్నాటక ఒక్కటే. అక్కడ కూడా సిద్దరామయ్యకు బయటకంటే ఇంటిపోరే ఎక్కువ. కాంగ్రెసు వారి విచ్చలవిడి అవినీతిని చూశాక ఎడ్యూరప్ప అవినీతి కన్నడిగుల కంటికి చిన్న నేరంగానే కనిపిస్తున్నది.
ఒకప్పుడు ఎదురులేకుండా ఏలిన దేశంలో వరస పరాభవాలతో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయి రాజకీయ అస్తిత్వం నామమాత్రమైన దుస్థితిలో చతికిలపడిన పార్టీని మళ్లీ పైకిలేపి, పరుగులెత్తించడం ఒక్క రాహుల్ వల్లే అవుతుందని కాంగ్రెస్ వారిలో కొందరి దింపుడు కళ్లం ఆశ. పార్టీని బతికించటానికి అర్జంటుగా మేజర్ సర్జరీ చేయాలని దిగ్విజయ్‌సింగ్ వంటి పాతకాపులే తెగబడి గొంతు లేపటం కాంగ్రెసు స్కంధావారాన్ని కమ్మిన భయవిహ్వలతకు సూచిక. తక్షణం పెద్దాపరేషను చేయాలనే వారు కూడా ఆ పనిని పాత సర్జనే్ల చేయాలంటారు. రోగం ఎంత ముదిరినా బయటి డాక్టర్లను ఆశ్రయించడానికి కాంగ్రెసు సంస్కృతి అనుమతించదు. చావైనా రేవైనా ఒకే కుటుంబం పెత్తనం కిందే కనుక ఆ కుటుంబం నుంచే కొత్త పెత్తందారును ఎన్నుకుంటే కాంగ్రెసు బతుకు బాగుపడుతుందేమోనని కొందరు వెంపర్లాడటం అర్థం చేసుకోదగ్గదే.
ఎటొచ్చీ ఒకటే చిక్కు. కాంగ్రెసుకు పట్టిన రోగంకంటే వారు కోరుతున్న వైద్యమే ప్రాణాంతకమైనది. ఇప్పటిదాకా చవిచూసిన పరాజయాలన్నిటికీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధి, ఆమె చుట్టూ ఉన్న కోటరీదే బాధ్యత అయితే... రాహుల్‌జీకి ఎటువంటి పాలుగాని, ప్రమేయంగాని లేకపోతే - తలను మార్చినందువల్ల పార్టీ తలరాత మారుతుందన్న ఆశాభావానికి ఆస్కారం ఉంటుంది. రాహుల్‌గాంధీ పార్టీలో ఏమి జరుగుతున్నదో తెలియని స్థితిలో బయట ఎక్కడో లేడు. అధిష్ఠానవర్గంలో భాగంగా, అధ్యక్షురాలైన తల్లికి కుడి భుజంగా, పార్టీకి ఉపాధ్యక్షుడిగా నెంబర్ టు స్థానంలో ఇంతకాలమూ లోపలే ఉన్నాడు. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ వంటి కొద్దిమంది అంతేవాసులకు అధినాయకురాలి దగ్గర ఉన్న పలుకుబడిని తగ్గించటం, వారిని కాదని తన మాటను నెగ్గించుకోవటం కొన్ని సందర్భాల్లో కుమర్రాజాకు కుదరలేదేమో. కాని రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలు వంటి కీలక వ్యవహారాలన్నీ అబ్బాయిగారి కనుసన్నల్లోనే జరిగాయి. పార్టీలో లేచిన తిరుగుబాట్లూ అసమ్మతి ఔద్ధత్యాలూ చాలావరకూ మైనరుబాబు కట్టుకున్న పుణ్యమే.
ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెసు ఘోరంగా దెబ్బతిన్నది అసోంలో. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో దానికి గెలిచే ఆశ కలలో కూడా లేదు. కేరళలో ఒకసారి గెలిచిన కూటమి మరుసటి ఎన్నికల్లో కూలిపోయి తడవకో ప్రభుత్వం రావటం మామూలే. కాబట్టి అక్కడ ఈ మారు కాంగ్రెసు కూటమి ఓడిపోయినందుకు కుమిలి పోవలసిన పని లేదు. కాంగ్రెసుకు ప్రతిష్ఠాత్మకమైనది అసోం ఒక్కటే. అక్కడ ఆ పార్టీ మట్టికరవటం రాహుల్ ప్రయోజకత్వమే.
అసోం కాంగ్రెసులో ముఖ్యమంత్రి గోగోయ్ తరువాత అత్యంత ప్రముఖుడు రాజకీయ దురంధరుడు అయిన హిమంత విశ్వశర్మ ఆ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగా లేదు అని రాహుల్‌గాంధీ చెవిన వేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కాని యువరాజు దర్శనమే దొరకలేదు. పట్టువదలకుండా వెంటపడగా ఎట్టకేలకు ఒకరోజు ఇంటర్వ్యూ మంజూరైంది. ఉన్న సమస్యలు ఇవి; వెంటనే వాటి సంగతి తేల్చకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుకు 20 సీట్లు కూడా రావు అని ఆ పెద్ద మనిషి మొత్తుకున్నాడు. ఆయన చెప్పేది కనీసం ఆలకించకుండా కుమార్రాజావారు పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కూచున్నాడు. ఇతడు ఉండగా పార్టీ బాగుపడదు అని తిట్టుకుంటూ శర్మ బయటికి వచ్చాడు. రాహుల్ మీద కసికొద్దీ బిజెపిలో చేరాడు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీని ఘనంగా గెలిపించి కాంగ్రెసును చిత్తుగా ఓడించాడు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెసు ముఖ్యమంత్రి ప్రవర్తన గిట్టని ఎమ్మెల్యే కలిఖో పుల్ హైకమాండుకు విసుగు లేకుండా ఫిర్యాదు చేశాడు. దయచేసి జోక్యం చేసుకోండి, మాకు న్యాయం చేయండి అని స్వయంగా రాహుల్‌గాంధీని వేడుకున్నాడు. షరా మామూలే. అతడి మొరను విననైనా వినకుండా చినబాబు అవమానించాడు. మనసు విరిగి పుల్ పార్టీని చీల్చి బయటికొచ్చాడు. బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు నుంచి వేరుపడి తనను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన తరవాత బిజెపిలో చేరిన సీనియర్ కాంగ్రెసు నాయకుడు విజయబహుగుణ కూడా రాహుల్జీ బాధితుడే. ‘మేము మొదటి నుంచీ కాంగ్రెసు వాదులం. మేము ఎంత వేడుకున్నా రాహుల్ టైము ఇవ్వలేదు. మమ్మల్ని కలవలేదు. అందుకే బయటికొచ్చాం’ అని అతడంటాడు.
మిగతా విషయాలు ఎలా ఉన్నా సోనియాగాంధికి రాజకీయ చాకచక్యం ఉంది. పార్టీలోని అన్ని వర్గాలనూ సముదాయించి, అందరు చెప్పేదీ వింటున్నట్టే కనపడి, ఎవరినీ దూరం చేసుకోకుండా, ఎవరూ ఎదురు తిరగకుండా చూసే నేర్పు ఆమెకు ఉంది. ఆ ఒడుపు ఆమె సుపుత్రుడికి లేదు.
2009లో కేంద్రాన రెండోసారి యు.పి.ఎ. గెలిచినప్పుడే తాను తప్పుకుని రాజదండం యువ నాయకుడికి (అనగా రాహుల్‌గాంధికి) అప్పగించటానికి బినామీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ సిద్ధపడ్డాడు. దానికి అది సమయం కాదు; పట్ట్భాషేకానికి కావలసినంత పరిణతి వంశాంకురానికి ఇంకా రాలేదని రాజకుటుంబం అప్పట్లో తలచింది. తరవాత ఏళ్లయితే తిరిగాయి. కావలసిన పరిణతి అబ్బాయకి అబ్బలేదు.
వయసు పెరిగినా బుద్ధి పెరగక రాజకీయ కౌశల్యంలో మైనరుగానే రాహుల్ మిగిలాడు. 2013లో ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ ఉపాధ్యక్షుడిగా పదోన్నతినిచ్చినా... ప్రధాని పదవికి మోదీకి ప్రతిద్వంద్విగా ప్రకటించి, 2014 ఎన్నికల ప్రచార బాధ్యత మొత్తం అప్పగించినా చేతకాక ఎన్నికల గోదాలో బొక్కబోర్లపడ్డ ఘనుడాయె! తన ముత్తాత ప్రతిభావ్యుత్పన్నతలతో పార్లమెంటును శోభిల్లజేస్తే తానేమో పార్లమెంటులో కునికిపాట్లతో దేశం దృష్టిని ఆకర్షించగలిగిన ప్రజ్ఞావంతుడాయె! నెలల తరబడి అయిపు లేకుండా ఎటో చెక్కేసి, అతి ముఖ్యమైన సమయంలోనే పార్టీని దాని కర్మానికి వదిలేసిన బుద్ధిమంతుడాయె. ఆడుకోవటానికి పార్టీని అచ్చంగా తనకు ఇచ్చెయ్యకపోతే మళ్లీ సెలవుమీద ఎటో వెళ్లిపోతానని బెదిరించటంవల్లే ఆయనకు మూర్ధ్భాషేకం చేయాలన్న హడావుడి కొత్తగా మొదలైందంటున్నారు. ఇంతటి సుగుణాల రాశి ఇంతటి పనిమంతుడు అధినాయకుడైతే కాంగ్రెసుకు దశ తిరిగినట్టే. కాంగ్రెసు నుంచి దేశమూ, దేశం నుంచి కాంగ్రెసూ ముక్తిపొందినట్టే.
స్వతంత్రం రాగానే కాంగ్రెసును కాలగర్భంలో కలపాలన్న మహాత్మాగాంధీ కోరికను ఏడు దశాబ్దాలు లేటుగానైనా ఈడేర్చటానికి ఈడేరని రాహుల్‌గాంధీ కంటే సమర్థుడెవరు?

ఎం.వి.ఆర్.శాస్ర్తీ