మంచి మాట

మధురభక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి శాస్త్రంలో శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అను నవవిధ భక్తిమార్గాలనే గాక వాత్సల్యభక్తి మధురభక్తి అనే మరో రెండు భక్తి విధానాలను వివరించడం జరిగింది.
వాత్సల్య భక్తిలో భగవానుని తమ బిడ్డగా భావించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా శ్రీరాముని కనిన కౌసల్యా దశరథులు, శ్రీకృష్ణుని పొందిన వసుదేవ దేవికీదేవిలను తమ భక్తిని వాత్సల్యరూపంలో ప్రకటించారు. అంటే వీరు ఆ భగవానుని బిడ్డగా భావించి, ఉపాసన చేసి బాల రూపంలో ఆ భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇటువంటివారిలో జటధారి, శ్రీరామకృష్ణపరమహంస, అఘోరమణి, సూరదాసు మొదలైన వారున్నారు.
జటధారి సన్యాసి. ఆయన వద్ద ఒక చిన్న రామ్‌లాల్ విగ్రహం ఉండేది. బాలరాముడు ఆయన వెనుక గంతులు వేస్తూ తిరిగేవాడట. ప్రతిదినం బాలరాముని స్నానం చేయించడం, ఎత్తుకొని లాలించడం, అన్నం తినిపించడం చేసేవాడు జటధారి. ఇది ఆయన వాత్సల్య భావోపాసనా ఫలితమని చెబుతారు.
శ్రీరామకృష్ణ పరమహంస ఎంతో సాధన చేసి బాలరాముని, నందకిశోరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. వారిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించి ఆడుకున్నాడు. ఈ వాత్సల్య భావంతో భగవంతుడు పసివాడై భక్తుని ఒడిలో ఒదిగి చిలిపి పనులతో ఆ భక్తుని అలరింపజేసి ఆనందాన్నిస్తాడు. అఘోరమణి దేవి బాలకృష్ణుని ఉపాసకురాలు. ఆ బుల్లికృష్ణుడు ఎల్లప్పుడూ ఆమెను అంటిపెట్టుకొని వుంటూ అలరించేవాడట. బాలకృష్ణునిమీద అంత వాత్సల్యం చూపించిన ఆమె ఎంత ధన్యాత్మురాలో!
ఇక మధుర భక్తిలో అలౌకికమైన అరమరికలు లేని సంబంధం ఉంది. భగవంతుని భర్తగా ఆరాధించడం, భగవానుడు భరించువాడని- భరింపబడువాడు భక్తుడని అంటారు. భగవంతుడొక్కడే పురుషోత్తముడనీ, జీవులందరూ స్ర్తిలని- అంటే జీవులెల్లరూ భరింపబడువారనీ అసలు అంతరార్థం. ఈ బంధాన్ని భార్యాభర్తల సంబంధంతో అన్వయం చేశారు. నదులు ఏ విధంగా తమ నామ రూపాదులను విడిచి సముద్రంలో లీనం అవుతున్నాయో అదేవిధంగా జీవులంతా తమ నామ రూపాలను త్యజించి బ్రహ్మానంద సాగరంలో చేరుతారని వర్ణించింది శాస్త్రం.
అందుచేత ఈ భక్తి భగవానుల సంబంధం అనిర్వచనీయమైనదని చెప్పాలి. భగవంతుని భర్తగా భావించి ఆరాధించిన వారిలో అత్యున్నత స్థానాన్ని అందుకున్నది మీరా స్వాధి. వివాహం యొక్క అర్థం తెలియని చిన్ని వయస్సులో ఒక పెళ్ళి ఊరేగింపును చూసింది బాల మీరా. అదేమిటని పెద్దలను ప్రశ్నించి, సమాధానం రాబట్టుకొని తనకు కూడా భర్త కావాలని పేచీ పెట్టింది. ఆ గొడవ భరించలేక పెద్దలు ఓ చిన్న కృష్ణవిగ్రహాన్ని భర్త అని చెప్పి ఆ పసిమీరాబాయకి అందించారు.
నాటి నుండి తన భర్త ఆ గోపాలుడే అని గాఢంగా, త్రికరణశుద్ధిగా ఆమె విశ్వసించింది. ఆమె భావనను పెద్దగా పట్టించుకోని పెద్దలు యథావిధిగా వివాహం చేసివేశారు. అయినా విషయ విముఖియై కృష్ణ్భక్తిని ఆస్వాదిస్తూ లౌకిక విషయాలనంటలేదామెకు. సంపదలను ఆశించలేదు. రాచమర్యాదలను పాటించలేదు. అనేకానేకకష్టాల కోర్చి, చివరకు విషాన్ని కూడా ఆ గిరిధారికి నివేదించి త్రాగి- తన భక్తిచే సర్వాటంకాలను అధిగమించింది. ఆ మురళీమోహనుని, ఆ నందకిశోరుని గూర్చి ‘మీరాకే ప్రభు’ అని మీరా కే ప్రభూ అంటూ ఆ గిరిధరబాలుని కీర్తించింది. అనేక కీర్తనలు రచించి, భక్త మీరాబాయిగా తన జీవితానికి ధన్యతను కలిగించుకొన్నది. ఆమె భక్తికి మెచ్చి, ఆమె పాటలకు ముగ్ధుడైన నందనందనుడు మీరాబాయికి ముక్తిని అనుగ్రహించాడు.
అదేవిధంగా సూరదాసు కూడా సూరదాసప్రభు అని తన జీవితాన్ని ఆ బాలగోపాలునికి అర్పణ చేసుకున్నాడు. నేటికీ భక్తమీరాబాయి, సూరదాస విరచిత కీర్తనలు గానం చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవారున్నారు. ఈ మధుర భక్తిలోని మధుర రసాస్వాదన చేసేవారు, వాత్సల్య భక్తిలో ఓలలాడేవారు ధన్యులు.

-చోడిశెట్టి శ్రీనివాసరావు