వీక్ పాయింట్

‘మమీ’ పోయ చిన్నమ్మ వచ్చె...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్తిపోయి సుత్తి వచ్చె ఢాంఢాంఢాం
మమీపోయి చిన్నమ్మ వచ్చె ఢాంఢాంఢాం
చిన్నమ్మ శశికళకు పార్టీ పట్ట్భాషేకంతో తమిళనాట అధికారపు బదిలీ ద్రవిడ కజగాల సంప్రదాయం ప్రకారం యథావిధిగా జరిగింది. పార్టీ పేరు అన్నాడిఎంకె అయినా దానిని అమ్మా డి.ఎం.కె. అనడమే సబబు. ప్రధాన కార్యదర్శికి కనీసం ఐదేళ్లు పార్టీలో పనిచేసిన అనుభవం ఉండితీరాలని పాత రోజుల్లో రూలు పెట్టినా అమ్మల జమానాలో అవసరమైనప్పుడు దాన్ని తుంగలో తొక్కితే తప్పులేదు. పార్టీలో ఎన్నడూ ఏ బాధ్యతా లేని, ఏ ఎన్నికలోనూ నిలబడి ఎరుగని చిన్నతల్లి కంటే అమ్మ కుర్చీలో కూచో గలిగిన శాల్తీ అరవ అధికార పక్షంలో కంచుకాగడాతో వెదికినా వేరొకరు కానరారు.
నాయకత్వ లక్షణాలు ఏ కోశానా లేవన్న నమ్మకం నూటికి నూరుపాళ్లు కలిగించగలిగిన కట్టు బానిసలను మాత్రమే నాయక స్థానాల్లో కూచోపెట్టాలన్నది పాలిసీగా పెట్టుకున్న పార్టీలో ఒక నియంత మరణిస్తే తదుపరి నియంత అంతఃపురం నుంచే రావాలి. దగ్గరి బంధువుల్లో ఎవరూ తన చాటున తోకలు జాడించకుండా జయమ్మే కత్తిరించి వేసింది కాబట్టి అధికార వారసత్వానికి కుటుంబం నుంచి పోటీదారు లేరు. రాగాపోగా మిగిలింది ఒకే ఒక శశికళ.
ఎంత నెచ్చెలి, సహచరి అయినా అధికారపు వంగతోట దగ్గర కాదు! ముద్దుల శశికి పార్టీలోగాని, ప్రభుత్వంలోగాని ఎన్నడూ ఏ పదవీ ఇవ్వకుండా పెద్దమ్మ జాగ్రత్త పడితేనేమి? పోయెస్ గార్డెన్ రాణివాసం నుంచి ఆమెనూ, ఆమె తెచ్చిపెట్టిన మన్నార్ గుడి మాఫియాను గెంటేసి, సాక్షాత్తూ పురచ్చి తలైవే ఆమెను పార్టీ నుంచి ఒకటికి రెండుసార్లు బహిష్కరిస్తేనేమి? మాయ చేసో మంత్రం వేసో పిన్నమ్మ మూణ్నెల్లకే మళ్లీ వెనక్కి రాగలిగింది కదా? అమ్మకు మందుపెట్టి స్లోపాయిజన్ ఎక్కించిందనీ, ఆ సంగతి అప్పట్లో గుజరాత్‌ని ఏలుతున్న నరేంద్రమోది ఉప్పందించగా ఆమెకు దేవిడీమన్నా అయిందనీ ఐదేళ్ల కింద తెహల్కావాడు రట్టు చేస్తేనేమి? జయలలిత ఉసురు తీసిన చివరి రోగం కూడా తప్పుడు మందుల వాడకంవల్ల ముంచుకొచ్చిందేనని ఎన్ని వదంతులు పొక్కితేనేమి? పెద్దావిడ నమ్మినా, నమ్మకపోయినా... చిన్నావిడే అమ్మకు తోడు, నీడ అని పార్టీ జనాల్లో ఒక నమ్మకం నెలకొంది. పల్లకి ఎక్కేందుకు అదే ఆమెకు పనికొచ్చింది.
ఏమి లేనిచోట ఆముదపు చెట్టే మహా వృక్షం! పోటీదారులేని ఒంటి స్తంభం మేడలో - ఏ చుట్టరికమూ లేని... ముప్ఫై ఆరేళ్ల కింద ఎక్కడో వీడియో కాసెట్లు చేసి పెట్టి పొట్టపోసుకుంటూ జయ పంచన చేరిన... దారిన పోయే దానమ్మే అఖండ రాజ్యాధికారానికి హక్కుదారు!! తన నీడను కూడా నమ్మని జయలలితకు నీడగా పేరు పడగలగటమే శశికళా నటరాజన్ గొప్పతనం. ఎలాగో తంటాలుపడి పెద్దామె ప్రాపకం సంపాదించగలగటం ఒకటే కాదు. శశికళకు ఒడుపుగా పావులు కదిపి, రాజకీయ చదరంగంలో నెగ్గగల నేర్పూ కావలసినంత ఉంది.
కిందటి సెప్టెంబర్ 22న అంతుపట్టని జబ్బుతో ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించినట్టు ఎట్టకేలకు డిసెంబర్ 5 రాత్రి ఆధికారికంగా ప్రకటించేదాకా రాణిలేని రాజ్యాన్ని తెరచాటున పాలించింది శశికళేనన్నది బహిరంగ రహస్యం. మామూలు జ్వరమే; రెండురోజుల్లో తిరిగొచ్చేస్తుందంతే - అని ఆస్పత్రివాళ్ల చేత చెప్పించడం మొదలుకుని... అమ్మ లేచి కూచుంది; వార్డుకు తిరిగొచ్చింది; నర్సులతో ఆడుకుంటోంది; ఆదేశాలిస్తున్నది; సినిమాలు చూస్తున్నది - అంటూ రోజుకో తీపికబురు చెప్పిస్తూనే... ఆప్త బంధువులు సహా నరమానవులెవరూ దరిదాపులకు వెళ్లకుండా, ఒక్క ఫోటోను తియ్యనివ్వకుండా అమ్మచుట్టూ దుర్భేద్యమైన దడి కట్టించడం వరకూ అంతా ఆమె కనుసన్నల్లోనే జరిగిందని పోల్చుకోవటానికి షెర్లాక్ హోమ్సే అక్కర్లేదు.
తమ ప్రియతమ అధినేతకు గుండెపోటు వచ్చి పరిస్థితి విషమించిందన్న కబురు విని వేలాది జనం నిద్రాహారాలు లేకుండా అహర్నిశలూ అపోలో ఆస్పత్రి ముందు మూగి ఉంటే... ఆమె కన్ను మూసిందన్న వార్త వెలువడటానికి కొన్ని గంటల ముందునుంచే ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యే గాని, ఆ పరిసరాల్లో జాడలేరేమి? ముఖ్యమంత్రి ప్రాణం కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయని ఆస్పత్రి వారు ప్రకటిస్తున్న సమయంలోనే పర్మనెంటు స్టెపినీ పన్నీర్ సెల్వానికీ, మొత్తం మంత్రులందరికీ రాజ్‌భవన్లో హడావుడిగా ప్రమాణస్వీకారం జరిగిందేమిటి? డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆధికారికంగా మరణించి, మర్నాడు మధ్యాహ్నానికల్లా శశికళ చేతుల్లో సమాధి కాబడిన జయలలిత బుగ్గమీద మృతదేహాన్ని చాలా రోజులు చెడకుండా భద్రపరిచే రసాయనిక ప్రక్రియ జరిగిన గాట్లు కనిపించాయట ఎందువల్ల? ఆమె చాలా రోజుల కిందే చనిపోయిన మాట నిజమైతే ఆమెను చూశాం, పలకరించాం అంటూ మహామహా వివిఐపిలు ఎందుకు బుకాయించారు? అమ్మ అంటే వాడుక భాషలో ఎలాగూ ‘మమీ’యే కాబట్టి ఈజిప్షియన్ తరహాలో ఒళ్లు చెడకుండా ఆమెను మమీని చేసి గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి పెట్టాలన్న భలే ఐడియా ఎవరిది?
ఇలాంటి ఇరుకున పెట్టే ప్రశ్నలు మనం అడగకూడదు. మర్యాదస్తులు విననూ కూడదు. ముఖ్యమంత్రి మృతదేహాన్ని వెలికితీసి పరీక్ష ఎందుకు చేయించకూడదని స్వయానా మద్రాసు హైకోర్టే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనేమి? అంతా సలక్షణంగా జరిగిందని అద్భుత ప్రహసనంలో ఘరానా పాత్రధారులందరూ సెలవిచ్చిన దానే్న మమ అనుకోవడం మన ఒంటికి మంచిది. ఇంతకీ జయలలిత ఎప్పుడు గతించిందని బేతాళుడు అడిగితే విక్రమార్కుడంతటి వాడు కూడా బదులు చెప్పలేడు. అంత్యక్రియల్లో చిన్నమ్మకు ఒదిగి ఉన్న తీరు, మమ్మల్ని ఇక తమరే ఏలాలంటూ పార్టీ చేసిన తీర్మానాన్ని పట్టుకెళ్లి ఆమెకు భయభక్తులతో సమర్పించిన తీరు గమనించిన వారెవరూ పన్నీర్ సెల్వానికి అంత రాజకీయ మంత్రాంగం నెరపే సీను ఉన్నదని కలలోనైనా అనుమానించలేరు.
సోషల్ మీడియాలో ఎవరో జోకినట్టు ఒ.పి.ఎస్. (ఒ.పన్నీర్ సెల్వం) గారు వట్టి యు.పి.ఎస్.గారు! మెయిన్ పవరు పోయినప్పుడే, మళ్లీ అది తిరిగొచ్చేంత వరకే యు.పి.యస్.కి పని! ముఖ్యమంత్రిగా కూడా తమరే ఉండి మమ్ములను ధన్యులను చేయాలని తంబిదొరై లాంటి అన్నాడిఎంకె అతిరథులు శాస్త్రోక్తంగా చేసిన విన్నపాన్ని మన్నించాలా? యు.పి.ఎ. హయాంలో సోనియా మాత మోడలులో సర్వాధికారాలూ చలాయిస్తూనే ప్రభుత్వాన్ని కొంతకాలం ‘యు.పి.ఎస్.’ మీద కొనసాగనివ్వాలా- అన్నది చిన్నమ్మ ఇష్టం. అరవల ప్రాప్తం.
*
-సాక్షి

-సాక్షి