యువ
మీ ‘వైఫై’ ఎంత భద్రం?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్మార్ట్ఫోన్లతో అంతర్జాలంలో విహరించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నందున వైఫై కనెక్షన్ల ద్వారా కూడా సైబర్ దాడులకు అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైఫైను వినియోగించే నెటిజన్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వైఫై నెట్వర్క్లకు రక్షణగా నిలిచే ‘వైఫై ప్రొటెక్టెడ్ యాక్సిస్-2’ (డబ్ల్యూపిఎ-2) ప్రొటోకాల్లో భద్రతాపరమైన లోపాలు ఇటీవల బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్, ఐవోస్ (యాపిల్), విండోస్, లైనెక్స్ లాంటి అన్ని ఆపరేటింగ్ వ్యవస్థలతో నడిచే డిజిటల్ పరికరాలనూ హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. వైఫైలో భద్రత ప్రశ్నార్థకం కావడంతో క్రెడిట్ కార్డు నెంబర్లు, పాస్వర్డులు, ఎస్ఎంఎస్లు, మెయిల్స్, ఫొటోలు ఇతర కీలక సమాచారాన్ని సైతం తస్కరించే అవకాశం ఉంది. బెల్జియంలోని కేయూల్యూవెన్ విశ్వవిద్యాలయం నిపుణులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ అంశాలు వెలుగు చూశాయి. బెల్జియంకు చెందిన మాథీ వాన్హో, ప్రాంక్పీసెన్లు వైఫై రక్షణ వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్ల మీద తాము దాడి చేయగలిగామని ప్రకటించారు. వైఫైని వాడే లైనెక్స్, ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్లకు ముప్పు ఉందని వారు తేల్చిచెప్పారు. ‘డబ్ల్యూపిఎ-2’ వైఫై భద్రతా వ్యవస్థలోని లోపాలే ఇందుకు వీలు కల్పిస్తున్నాయని వారు తెలిపారు.
వైఫై సంకేతాలను వినియోగిస్తూ రౌటర్తో అనుసంధానమయ్యే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఇతర పరికరాలను లక్ష్యంగా చేసుకునే ‘కీ రీఇన్స్టాలేషన్ ఎటాక్’లపై బెల్జియంకు చెందిన పరిశోధకులు తమ దృష్టి సారించారు. వీటి సాయంతో వైఫై వ్యవస్థలోని ‘డబ్ల్యూపిఎ-2’ ప్రొటోకాల్ను అదుపులోకి తీసుకోవచ్చని వారు కనుగొన్నారు. విలువైన సమాచారాన్ని దొంగిలించడమే కాదు, వైరస్లను చొప్పించేందుకు ర్యాన్సమ్వేర్ ఇతర మాల్వేర్లతో హ్యాకర్లు తమ ప్రతాపం చూపిస్తారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే డిజిటల్ పరికరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కేవలం పాస్వర్డులను తరచూ మార్చితే చాలదు, రౌటర్లోని ఫర్మ్వేర్ను అప్డేట్ చేస్తుండాలి. అప్డేట్ చేయకముందే పాస్వర్ట్లను మార్చాలి. లేకుంటే అదనపు భద్రతాచర్యలు అవసరమవుతాయి. వైఫై పరికరాలను అప్డేట్ చేసుకునేవరకూ ‘డబ్ల్యూఇపి’ వంటి ప్రొటోకాల్లను ఆశ్రయించడం ఉత్తమమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
వైఫైలో భద్రతపై అనుమానాలు చెలరేగుతుండగా మరోవైపు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, వైఫై అలయన్స్లు మాత్రం ‘సమాచారం తస్కరణ’కు తగిన ఆధారాలు లభించాలన్సి ఉందని తేలిగ్గా తీసిపారేస్తున్నాయి. అయితే, ‘యునైటెడ్ స్టేట్స్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెడీనెస్ టీమ్’ ఈ సమస్యపై ఆరా తీయడం ప్రారంభించింది. ఇటీవల వైఫై, ఆండ్రాయిడ్ పరికరాల ఉత్పత్తి సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ- రెడ్హాట్, ఇంటెల్, జునిపర్ నెట్వర్క్ లాంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే దాడులకు గురైనట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు ఆటోమేటిక్ అప్డేట్స్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాయి.
దాడులకు అవకాశం
మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సౌకర్యార్థం బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో వైఫై హాట్ స్పాట్లను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ తరహా వినియోగం అనూహ్యంగా పెరిగినందున సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ప్రభుత్వ ఏజెన్సీ అయిన ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ (సిఈఆర్టి) స్పష్టం చేసింది. మరోవైపు అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా 7.5 లక్షల పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను నెలకొల్పాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రముఖ ప్రైవేటు మొబైల్ ఆపరేటర్లతో కలిసి పనిచేసేందుకు వ్యూహం ఖరారైంది. తక్కువ ఖర్చుతో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడం, ఈ-గవర్నెన్స్, డిజిటల్ అభివృద్ధిని గ్రామీణులకు సైతం అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ రకంగా వైఫై సేవలు ఎంతవేగంగా విస్తరిస్తున్నాయో అదే రీతిలో సైబర్ నేరాలకు సైతం అవకాశం కలుగుతోంది.