మెయిన్ ఫీచర్

మరువలేని మహనీయుడు వాసుదాసస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రామాయణం క్షీర ధార. వాసుదాసుగారి శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, మందార మకరంద మాధుర్యాలే. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి, కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు)గారు. ఆయన సొంత, స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగు నేల నాలుగు చెరుగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో, ఓ శతాబ్దం క్రితమే సంతరించుకున్నాయి. దురదృష్టవశాత్తు కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. తెలుగు పాఠకలోకం వారి రచనలను మరిచిపోతున్నారు. 1909 సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై)లోని ‘శ్రీ వైజయంతీ ముద్రాశాల’లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా ‘కాలిఫోర్నియా (అమెరికా) విశ్వవిద్యాలయం’కు చెందిన ‘బర్క్‌లీ’ గ్రంథాలయం చేరుకుని గూగుల్ సంస్థ డిజిటలైజ్ చేసిన వాసుదాసుగారి ‘శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం’ మొదటి సంపుటిలోని గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. తెరమరుగవుతున్న వందేళ్లనాటి అపురూపమైన తెలుగు సాహిత్యంలోని అత్యంత ఆదరణీయమైన వాసుదాసుగారి అలనాటి ‘నిర్వచన రామాయణం’లో ఆయన ఎందుకు ఎలా వాల్మీకి రామాయణం చదివింది, ఎలా రాసింది, ఎలా అంకితం ఇచ్చింది లాంటి విషయాలనేకం ఉన్నాయి.
వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి ‘మందర’ మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలను, నాలుగుచెరుగులా పంచి ఆ మధనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, తెలుగువారి హృదయ కేదారాలను ప్రపుల్లం చేసిన పరమ భావగతోత్తములు ‘ఆంధ్ర వాల్మీకి’ వాసుదాస స్వామి.‘రామభక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే’ అన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసుదాస స్వామి. ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన, అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు, ‘శ్రీ మద్రామాయణం మందరం’ పారాయణ పరులై తమ పరంపరకు శ్రీ వాసుదాస స్వామి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్టమొదటగా తెనిగించి, పదే పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల తెలుగువారికి అత్యుత్సాహాన్ని కలిగించి, ‘రామ భక్తి సామ్రాజ్యం’ అంటే, తెలుగునాడే సుమా, అనిపించిన నిరుపమ రామభక్తులు వాసుదాస స్వామివారు.
ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలతో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులు, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందోయతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ, పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి తదనంతరం ‘మందరం’ అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.తెలుగు పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది, ఆదరించింది. వాసుదాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. తెలుగు భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్ధ పూర్తి కలిగి, కావ్య, ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించారీ గ్రంథాన్ని వాసుదాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా తెనిగించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేసారు. ఆయన రచించిన నిర్వచన రామాయణం, ఆయన జీవిత కాలంలోనే నాలుగైదు సార్లు ముద్రించబడింది.
వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి నిర్వచన రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్ధమవుతుందని మిత్రులంటారాయనతో. మూలగ్రంథం రాయడం కంటే వ్యాఖ్యానం రాయడం కష్టమనుకుంటారాయన మొదట్లో. బాగా ఆలోచించిన తర్వాత, శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. ‘మందరం’ అంటే క్షీర సాగరాన్ని మథించడానికి కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది సాధారణంగా ఎవరికైనా. కాని, వాసుదాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం ‘మందరం’ అంటే మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, ‘క్షీరవారాసి’గా సంభావించి, దానిని మధించిన తమ ‘మేథ’ అందించిన మకరందాలను, మధురిమలను, ముచ్చటగా ‘మందరం’అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా, అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా, నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి ‘మందరం’ అని నామకరణం చేయడంలో తను కొంతవరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. ఇందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాలవారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసుదాసుగారు.
తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసుదాసు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్ధ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్ధాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీ రామాయణ వ్యాఖ్యానంలో ‘జ్ఞాన పిపాసి’కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది. ఇక ఆయన రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస, ఆటవెలది, తేటగీతి, కంద, శార్దూలాలు, మత్త్భాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగ ప్రయోగించారు.
వాసుదాస ఆంధ్రవాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతి కాండ, ఒక్కోరకమైన విజ్ఞాన సర్వస్వం.ప్రతి కాండలోని, ప్రతిపద్యానికి, ప్రతిపదార్ధం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్ధాలను, అంతరార్ధాలను, ఉపమానాలను ఉటంకిస్తూ సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరంకోరి చదవాల్సిన విషయాల్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే అర్ధం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదవగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒకసారి ధర్మశాస్త్రం, ఇంకోసారి రాజనీతి శాస్త్రం లాగా, మరోచోట ఇంకో సందర్భోచిత శాస్త్రం లాగా బోధపడుతుంది. ప్రతి కాండ ఒక భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా,సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురాతత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. అద్భుతమైన రహస్యాలు అవగతమవుతాయి. పాదరసంనుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి అనేకమైనవి తెలుసుకోవచ్చు.
వావిలికొలను సుబ్బారావు కడప జిల్లా జమ్మలమడుగులో 23 జనవరి 1863లో జన్మించి జూలై 1, 1936లో పరమపదించారు. 1893-1904 మధ్యకాలంలో పదకొండేళ్లు రెవిన్యు శాఖలో ఉద్యోగం చేసారు మొదట్లో. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వత మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మ ధ్య కాలంలో పనిచేసారు. కళాశాలలో చేరకముందే ‘శ్రీ కుమారాభ్యుదయం’ అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి నాటి ఉద్దండ కవి పండితులను ఆశ్చర్యపరిచారు. ఆయన ప్రతిభకది తొలి హారం.
తెలుగు పండితునిగా పనిచేస్తున్న రోజుల్లోనే భార్యా వియోగం కలగడంతో, వాసుదాసు భక్తి, యోగ మార్గం పట్టారు. పండిత పదవీ విరమణ చేసిన అనంతరం తన జీవితమంతా భక్తిమార్గంలోనే గడిపారు. ఈ నాటికీ క్రమం తప్పకుండా గుంటూరు జిల్లా తెనాలి దగ్గరున్న అంగలకుదురు నుంచి ప్రచురించబడుతున్న ‘్భక్తి సంజీవని’ అనే భక్తి, జ్ఞాన, కర్మ యోగాలను తెలిపే ఆధ్యాత్మిక మాసపత్రిక సంస్థాపక సంపాదకులుగా-వాసుదాసుగా,ఆంధ్ర వాల్మీకిగా, కవిసార్వభౌమగా ప్రసిద్ధి కెక్కారు. అంగలకుదురులోని శ్రీ కోదండ రామ సేవక ధర్మ సమాజం స్థాపించింది ఆయనే. కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి ఈనాటికీ దర్శనీయమైన రీతిలో శాశ్వత కైంకర్యం చేసిన వాసుదాసుగారు, వాజ్ఞ్మయ ప్రపంచంలోని భక్త కవులలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.
వాసుదాసుగారు ‘కౌసల్యా పరిణయం’ అనే ప్రబంధం, ‘సుభద్రా విజయం’ అనే నాటకంతోపాటు, ‘హిత చర్యలు’, ‘ఆధునిక వచన రచనా విమర్శనం’, ‘పోతన నికేతన చర్చ’, ‘పోతరాజు విజయం’, ‘రామాశ్వమేథం’, ‘ఆంధ్ర విజయం’ కూడా రాసారు. ‘ఆర్య కథానిధులు’ అన్న పేరుతో ఆయన రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగు వారందరికీ అత్యంత ఆదరణీయమైనాయి. ‘సులభ వ్యాకరణం’ తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయనరచించిన ‘కృష్ణావతార తత్వం’ ప్రశస్త కృతిపాండిత్యంతో, ఆధ్యాత్మిక భావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపింపచేసి తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు, మహామనీషి వావిలికొలను సుబ్బారావుగారు.

- వనం జ్వాలా నరసింహారావు