నెల్లూరు
కల్యాణి-కావేరి (కథ)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అది ఒక చిన్నపాటి ఊరు. ఇటు పూర్తిగా
పల్లెకాదు. అటు పూర్తిగా పట్నంకాదు.
మధ్యస్థంగా ఉంటుంది. ఆ ఊళ్లో ఒక సివిల్,
క్రిమినల్, జ్యుడిషియల్ కోర్టు కూడా ఉంది. ఆ
కోర్టులో చంద్రుడు పేరుమోసిన క్రిమినల్
లాయర్. చంద్రుడు పూర్తిపేరు
జయచంద్రుడు. అతడి భార్య సఖ్యతాదేవి
సివిల్ లాయర్ వాళ్లిద్దరి సంపాదన బాగానే
ఉంది. వాళ్లిద్దరికి ఇద్దరు అబ్బాయిలు. ఒకడి
పేరు అశ్విన్, ఇంకో అబ్బాయి పేరు వైభవ్.
ఇద్దరు మెడిసిన్, ఇంజనీరింగ్
చదువుతున్నారు. హాలిడేస్లో తప్ప
వాళ్లింటికి కూడా రారు. సొంతిల్లు, ఒక
చిన్నపాటి కారు కూడా ఉంది
జయచంద్రుడికి. అయితే ఒకే ఒక సమస్య.
తల్లిదండ్రులు చనిపోతూ ఇద్దరు
అమ్మాయిలు చెల్లెళ్లను ఆస్తిగా
ఇచ్చేసిపోయారు. ఇంతవరకు వాళ్లకు ఏ
సంబంధం కుదరక పెళ్లికాని జయచంద్రుడి
చెల్లెళ్లు అంటూ పేరుపడిపోయింది.
కోర్టు ఆవరణలో తోటి లాయర్లు ‘హలో
జయచంద్రుడుగారు మీ చెల్లెళ్లకు ఏదైనా
సంబంధం కుదిరిందా’ అంటే చాలు
జయచంద్రుడికి చాలా కోపం వచ్చేసేది.
అలాగే సఖ్యతాదేవికి కూడా ‘ఏమండి
సఖ్యతా గారు మీ ఆడబిడ్డలకి ఎక్కడైనా
సంబంధం కుదిరిందా’ అనగానే నొసలు
ముడేసి ‘నన్ ఆఫ్ బిజినెస్’ అంటూ లేచి
వెళ్లిపోయేది. ఇద్దరికీ ఇది చాలా అసౌకర్యంగా
అనవసర ఇబ్బందిగా పరిణమించింది.
అందరూ అడిగేవాళ్లేకాని ఒక్క సంబంధం
చక్కబెట్టేవాళ్లే లేరు అనుకునేది కోపంగా.
ఇదిలావుండగా ప్రతిదినం దగ్గర్లోనే ఉన్న
రామాలయం ఊడ్చి, కడిగి ముగ్గులు పెట్టి
వచ్చేది కల్యాణి. కావేరి ఇంటిపనులు
చక్కపెట్టేది. రామాలయం సంగతి కాగానే
ఇంటికి వచ్చి తను చెల్లెలి పనుల్లో
పాలుపంచుకుంటూ రోజూ ట్యూషన్లు
చెబుతూ వచ్చిన డబ్బుతో చెల్లెలికి తనకి
ఖర్చులు చూసుకునేది. కల్యాణి
ఇంటిపనులు చేస్తూ ట్యూషన్లు కూడా
చెబుతూ తమ ఖర్చులు తామే చూసుకునే
ఆడబిడ్డల మీద కోపగించుకోవాలన్నా కోపం
వచ్చేదికాదు సఖ్యతా దేవికి. ఎవరైనా వాళ్ల
పెళ్లిళ్ల గురించి అడిగినపుడే ఆమె మూడ్
మారిపోయేది.
ఎక్కడైనా ‘కల్యాణిని.. కల్యాణిని కనులున్న
మనసుకు కనిపించు గానాన్ని’ అంటూ
పాట వస్తే అలాగే వింటూండిపోయేది కల్యాణి.
ఏయ్ కల్యాణి ఎక్కడ ఉన్నావ్ అంటూ ఒక
కేక వేస్తే ఈలోకంలోకి వచ్చేది. ఆ పాటంటే
చాలా ఇష్టం కల్యాణికి. అందులో
కథానాయికది తన సమస్యే. ఆమెకు ఒక
చెల్లెలు ఉంటుంది. తనకిమల్లే అదేదో తన
గురించే ఆ పాట రాశాడేమో ఆ రచయిత.
తన గురించే ఆ పాట పాడినట్లున్నారు
మృదుమనోహరంగా సుశీల, బాలుగారు
అనుకునేది కల్యాణి.
వాళ్ల పెళ్లి సమస్య పాతదే అయినప్పటికీ తన
కొడుకులకు పెళ్లిళ్లు చేయాలంటే వీళ్లిద్దరి
అడ్డు తొలిగిపోవాలి అనుకునేది సఖ్యతాదేవి.
అనుకున్నట్లుగానే ఒక రోజు గుడి శుభ్రం
చేస్తోంది కల్యాణి. అప్పుడే దైవదర్శనానికి
జనాలు ఒకొక్కరు వస్తున్నారు. పక్కూరి
ఎక్స్ ఎమ్మెల్యే ఆ గుడికి వచ్చి దర్శనానికి
నిలబడ్డాడు. అప్పటికే పని ముగించుకున్న
కల్యాణి తలారా స్నానం చేసిన కురులు
సవరించుకుని తనేసిన రంగవల్లి కేసి
ఒకసారి చూసి సంతృప్తితో తలాడించి
వెళ్లడానికి ఉద్యుక్తురాలైంది. అపుడే
ఆమెకేసి చూసిన సంపత్కు ఆమె చాలా
నచ్చింది. ఈ అమ్మాయి ఎవరై ఉంటుందా
అనుకుని తీర్థప్రసాదాలనంతరం పూజారిని
ప్రశ్నించాడు. ‘ఇక్కడ ముగ్గు పెడుతున్న
అమ్మాయి ఎవరండి పూజారిగారు, ఆమెకు
పెళ్లయిందా’ అంటూ కల్యాణి గురించి అన్ని
వివరాలు చెప్పిన దీక్షితులు గారు ‘పాపం
చాలామంచి అమ్మాయి బాబు ఎవరు
చేసుకున్నా అతను అదృష్టవంతుడే ఆ
అమ్మాయిని’ అంటూ చెప్పారు.
తను రాజకీయాల్లో ఉండడంతో తన
ప్రాణానికి హాని ఎపుడైనా జరగవచ్చు
అనుకుని ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు.
ఇపుడు తనకు ముప్పయి ఆరేళ్లు. తనకు
చెప్పి..చెప్పి ఈ మధ్యే బామ్మ కూడా
మానుకుంది. తన ఇద్దరు తమ్ముళ్లు పెళ్లిళ్లు
చేసుకుని ఒకరు చికాగోలో, ఒకరు సిడ్నీలో
స్థిరపడ్డారు. వాళ్లిద్దరికీ చెరో అబ్బాయి.
వాళ్లంతా హేపీగానే ఉన్నారు. వాళ్లు
ఎపుడోకాని ఇండియాకు రారు.
వచ్చినపుడంతా ‘పెళ్లి చేసుకో అన్నయ్యా,
రాజకీయాల్లో ఉండేవాళ్లు ఎవరూ మ్యారేజి
చేసుకోలేదా, నీదంతా అనవసర భయం’
అంటూ ధైర్యం చెప్పేవారు. కల్యాణిని చూసిన
తర్వాత తనుకూడా పెళ్లి చేసుకుంటే
బావుంటుందే అంటూ డిసైడ్ అయ్యాడు.
కనీసం కల్యాణి ఒక్క భారమైన
జయచంద్రుడికి తప్పించవచ్చు
అనుకున్నాడు సంపత్.
ఇంటికి వెళ్లగానే బామ్మగారితో ఈ విషయమే
చెప్పాడు సంపత్. ‘మా నాయనే నీకెంత
మంచి ఆలోచన వచ్చింది నాయనా’ అంటూ
బామ్మ ఆనందపడిపోయింది. అన్నట్టుగానే
కల్యాణిని ఫలానారోజు బామ్మకు
చూపించాలని దీక్షితులు గారిని అడిగి ఫోన్
చేయించాడు సంపత్ జయచంద్రుడికి.
జయచంద్రుడు సఖ్యతతో ఈ మాట
చెప్పగానే ఆశ్చర్యపోయింది. కల్యాణి ఆరోజు
దేవుడికి దండం పెట్టుకుంటున్న యువకుణ్ణి
ఏదో కాస్త చూసిందికాని అతడికి తను
నచ్చిందని. పైసా కట్నం అవసరం లేదని
పేదోళ్లకు ఒకరోజు ఉచిత భోజనం, బట్టలు
పెట్టి వాళ్ల ఆశీర్వాదంతో తనను
పెళ్లిచేసుకుంటానన్న సంపత్ మాటలు బాగా
నచ్చాయి కల్యాణికి. తల్లి చీర వంగరంగు
పట్టుచీరకు ఆరంజ్ కలర్ బోర్డర్ ఉన్న
పట్టుచీర కట్టుకుని తలలో కనకాంబరాలు
ముడుచుకుని కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని
అందరికీ ఇచ్చింది కల్యాణి. బామ్మగారికి
అక్కడే నచ్చేసింది కల్యాణి. తన మనవడు
చెప్పినట్టు మంచి అమ్మాయి అనుకుంది.
తన మెళ్లో ఉన్న ముత్యాల దండ తీసి
కల్యాణి మెళ్లోవేసి కల్యాణి గడ్డం పట్టుకుని
ముద్దుపెట్టుకుంది బామ్మగారు.
దగ్గర్లోనే ముహూర్తం పెట్టుకున్నారు సంపత్,
కల్యాణి వివాహానికి. అనుకున్నట్టుగానే
సంపత్ పేదలకు అన్నదానం, వస్తద్రానం
చేసి కల్యాణి మెళ్లో తాళికట్టాడు. ఇలా
పెళ్లయిందో లేదో అలా ఎన్నికల్లో నిలబడి
గెలిచాడు సంపత్. ఇదంతా కల్యాణి కాలి
మహిమే అని నమ్మారు బామ్మగారు.
పుట్టింట్లో దురదృష్టవంతురాలిగా ముద్రపడ్డ
కల్యాణి మెట్టినింట్లో అదృష్టవంతురాలిగా
అందరితో అన్పించుకుంటోంది. సంవత్సరం
తర్వాత కల్యాణికి కొడుకు పుట్టడం, సంపత్
అధికార పార్టీ విస్తరణలో సాంఘిక సంక్షేమ
శాఖామంత్రి కావడం ఒక్కసారిగా
జరిగిపోయాయి. చెల్లెలి అదృష్టానికి
జయచంద్రుడి కుటుంబం, అక్క అదృష్టానికి
కావేరి పొంగిపోయారు. బామ్మగారు
కల్యాణిని కాలు కిందపెట్టకుండా
చూసుకుంటోంది.
ఇంకొక సంఘటన జరిగింది. చికాగోలో
ఉంటున్న సంపత్ తమ్ముడు వైభోగ్ భార్య
ఆక్సిడెంట్లో పోయింది. ఈ సంఘటనకు
అందరి మనసులు బరువెక్కాయి. సంపత్
ముందు కల్యాణి కన్నీరు మున్నీరైంది.
ఎందుకంటే తను రాగానే తనతో ఎంతో
చక్కగా కలిసిపోయిన తన చెల్లెలు వరుసైన
ఐక్యత చనిపోవడం ఆమెకు చాలా బాధ
కలిగించింది. పెళ్లయిన తర్వాత చెల్లెలి
సంబంధాలు చూస్తూనే ఉంది కల్యాణి.
కావేరికి ఒక్క సంబంధం కుదరలేదు.
ఇపుడు అక్కచేసే పనులన్నీ కావేరి ఆ గుళ్లో
చేస్తూనే ఉంది. ఒక్క చెల్లెలు బరువు
తగ్గినందుకు సంతోషంగానే ఉన్నా ఇంకో
బరువు తగ్గలేదని బాధగానే ఉంది
జయచంద్రుడికి.
మరో ఆరునెలలు గడిచాక తన ఆలోచన
భర్తతో చెప్పింది కల్యాణి. కావేరి చాలా
మంచిపిల్ల కాబట్టి అలా చేయడంలో
తప్పులేదనిపించి వైభోగ్తో తన అభిప్రాయం
చెప్పాడు సంపత్.
ఆడమనిషి లేని ఇంట్లో ఎన్నాళ్లు ఉండగలడు
వైభోగ్. కావేరితో వైభోగ్ పెళ్లికావడం. ఇద్దరూ
చికాగో వెళ్లిపోవడం జరిగిపోయాయి.
రామచంద్రుడి సేవ చేయడం కల్యాణికి
కావేరికి వివాహ యోగం ఇంటిల్లిపాదికి
ఆనందం కలిగించాయి. ఇపుడు
జయచంద్రుడు, సఖ్యతాదేవి గర్వంగా
తిరుగుతున్నారు.