విజయవాడ
చరిత్ర అద్దంలో అంబేద్కర్ జీవన చిత్రం (పుస్తక సమీక్ష)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మహాత్ములు, మహర్షులు యుగానికొకరు జన్మిస్తే వారిని కారణజన్ములంటాం. అలాంటివారు ప్రపంచానికి ఆదర్శనీయులవుతారు. అలాంటి మహాత్ముల్లో మన దేశం గర్వించదగ్గ జాతీయ నేత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ ఒకరు. సర్వజన హితైషి అయిన అంబేద్కర్ జీవన గమనంపై వచ్చిన మరో పుస్తకం ‘డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర’. 48 అధ్యాయాలు, 240 పుటల్లో అంబేద్కర్ సంపూర్ణ జీవిత చరిత్రను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ రచయిత షేక్ అబ్దుల్ హకీం జానీ పాఠకులకు అందించారు. అంబేద్కర్ జీవిత చరిత్రపై ఎన్నో వ్యాసాలు, గ్రంథాలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ వచ్చాయి. ఎన్ని వచ్చినా ఆయనపై వచ్చే ప్రతీ రచనా ఒక్కో కాలానికి ఒక ఆణిముత్యంగా భాసిస్తుంది. అబ్దుల్ హకీం జానీ పరిశోధించి, విస్తృతంగా విషయ సేకరణ చేసిన గ్రంథం ఇది. బాల్యంలో అంటరానితనం వల్ల ఎన్నో అవమానాలు, అగచాట్లు పొంది, అవి తన జాతిజనులకు ఎదురుకాకూడదనే సత్సంకల్పంతో అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు డాక్టర్ అంబేద్కర్. ఆయన కృషి, దీక్ష, పట్టుదల, సమాజ సంస్కరణకు జరిపిన పోరాటాలను ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అయితే గతంలో వచ్చిన గ్రంథాలకన్నా భిన్నంగా కొన్ని విషయాలు అక్కడక్కడా ఈ పుస్తకంలో విశేషంగా ఆకర్షిస్తాయి. అంబేద్కర్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న కార్యశీలి. ప్రతి ప్రయాణంలో ఆయన చదివిన పుస్తకాలు, ఆయన చేసిన ప్రతి పోరాటం వెనుక చరిత్రను కూడా చక్కగా విశే్లషించారు. దేశ విభజన సమయంలో మహ్మదీయులు, హిందువుల మధ్య నెలకొని వున్న సామరస్య భావాన్ని వివరిస్తూ అంబేద్కర్ అన్ని జాతుల ప్రజలకు ఎంతలా, ఎలా చేరువయ్యారో మంచి వివరణలతో తెలియజెప్పారు రచయిత. అంబేద్కర్ కేవలం నిమ్నజాతుల ఉద్ధరణకే కృషి చేశారన్న సంకుచిత భావాన్ని పటాపంచలు చేస్తూ ఆయన అన్నివర్గాల వారికీ ఎలా మేలు చేశారనే విషయాలను వివరించటం రచయితకున్న మంచి విచక్షణాధికారాన్ని తెలియజెప్పింది. భారత రాజ్యాంగ రచనకు అంబేద్కర్ పడిన బాధలు, అనుభవించిన కష్టాలు ఒకవైపు, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా అహర్నిశలు శ్రమించి రూపొందించిన ముసాయిదా ప్రతి ఏమాత్రం మార్పులు లేకుండా ఆమోదం పొందటం ఆయనకున్న మేధోపటిమను తెలియజేస్తుందని హకీం జానీ స్పష్టంగా వివరించారు. సందర్భాన్నిబట్టి ఆనాటి ఛాయాచిత్రాలను పొందుపర్చటం పుస్తకానికి, రచనకూ నిండుదనం చేకూర్చాయి. రచయిత పడిన శ్రమ, పరిశోధన మనకు ప్రతి అంశంలో కనిపిస్తాయి. ప్రఖ్యాత కవి, పరిశోధకులు సి నారాయణరెడ్డి ఒక సందర్భంలో అన్నట్లు.. ‘అంబేద్కర్, జాషువాలను ఎవరు స్పృశించినా వారి రచనకు గౌరవం, వ్యక్తిత్వానికి ఔన్నత్యం ఇనుమడింపజేస్తారు’ అనే మాట ఈసందర్భంలో అక్షర సత్యం. అబ్దుల్ హకీం జానీ రచయితగా, సహస్రాది వ్యాసకర్తగా ప్రసిద్ధుడు. ఈ రచన చేయటం సాహసమే అయినా అంబేద్కర్ గురించి మరో కోణంలో సంపూర్ణంగా తెలియజెప్పటంలో ఆయన కృతకృత్యులయ్యారని అనటంలో ఎలాంటి సందేహం లేదు. అభిరుచి కలిగిన ప్రచురణకర్తనూ ప్రత్యేకంగా ప్రశంసించక తప్పదు.
ప్రతులకు :
లక్ష్మీశ్రీనివాసా పబ్లికేషన్స్,
ప్లాట్ నెం. 56, ఆర్టీసీ కాలనీ,
హయత్నగర్, హైదరాబాద్- 501505,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి : 8106989394, 8106990049