సాహితి

సెరిబ్రల్ పాల్సీకి - కవి భిషక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కవి భిషక్కు’ - ఈ మాట ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో వుండేది. ఆయుర్వేద వైద్యానికి, కవిత్వ రచనకు అవినాభావ సంబంధం వున్నట్లుగా బాగా దాఖలాలున్న ఆ రోజుల్లో- అలాంటి మహనీయులను ‘కవి భిషక్కు’లనేవారు. సాహిత్య సృష్టిలోనూ, వైద్య చికిత్సలోనూ ఆరితేరినవారు ‘కవి భిషక్కు’లు. ఆధునికంగా అలాంటి ‘కవి భిషక్కు’ అనడానికి నిలువెత్తు నిదర్శనంగా వుండేవారు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి.
గత నెల ఆగస్టు 17వ తేదీన కాలధర్మం చెందిన శ్రీరామమూర్తిగారు వైద్యంలో, సాహితీ సేద్యంలో రెండింటిలోనూ నిష్ణాతులు. జూన్ ఒకటిన సప్తతి పూర్తిచేసుకుని రెండు నెలలయినా కాకముందే, తొందరపడి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని ధేనువకొండ గ్రామానికి చెందిన ఆయన రామసుబ్బారావు, ఆదిలక్ష్మమ్మ దంపతులకు 1947లో జన్మించారు. చీరాల స్థిరనివాసంగా సంగీత సాహిత్యాల కుటుంబ నేపథ్యంలో ఎదిగి, ఒంగోలు సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో పి.యు.సి చదివి, అనంతరం హైదరాబాద్ ప్రభుత్వ ఆయర్వేద కళాశాలలో బి.ఎ.ఎమ్.ఎస్ (బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసన్ అండ్ సర్జరీ) పట్టా పొందారు. మూడు దశాబ్దాలపాటు భారతీయ వైద్యశాఖలో వివిధ హోదాలలో పనిచేసి, 2002లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లో ‘శ్రీయం’ పేర (సిద్దేశ్వరి రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం) సంస్థను ఏర్పాటుచేసి ఆయుర్వేద వైద్య విధాన విస్తృతికి అపారమైన కృషిచేశారు. కవిగా, కధకునిగా, వ్యాసకర్తగా తనదైన సాహితీ సృజనతో విమర్శకుల మన్ననలు కూడా సమాంతరంగా అందుకున్న ప్రతిభామతి ఆయన. అంతేకాదు ‘స్నిగ్ధ్ఛాయ’ అనే నవల, ‘కామరూప’ అనే నవ్య ధారావాహిక నవలికలతో నవలకారునిగా కూడా వాసికెక్కారు.
గురజాడ అన్నట్లు ‘కొత్తపాతల మేలుకలయిక క్రొమ్మెరుంగుల్ చిమ్మగా’ భాసించిన రచయిత ధేనువకొండ. ఎంత సంప్రదాయ అభిజ్ఞులో అంత ఆధునికత సంతరించుకున్న సృజనశీలి.
శ్రీలలితాసహస్రనామ వైశిష్ట్యమ్ 2003లో వ్యాసాలుగా రాసిన సంప్రదాయం ఒకవంక, తన వృత్తి అయిన ఆయుర్వేద వైద్య విషయాలు రచనలుగా చేసిన శాస్ర్తియ దృక్పథం మరోవంకా ధేనువకొండ శ్రీరామమూర్తిగారి సొత్తు. హైదరాబాద్‌లో నివశిస్తున్నా ఒంగోలులోని వాడరేవు ప్రాంతంలో నాలుగు దశాబ్దాలకుపైగా ఆయుర్వేద వైద్యునిగా తన సేవలు అందిస్తూనే వచ్చారు. ప్రతినెలా అక్కడికి విధిగా వెళ్లి అక్కడి ప్రజల యోగక్షేమాలు చూసేవారు. ముఖ్యంగా వైద్యునిగా సెరిబ్రల్ పాల్సీ చికిత్సలో ఆయన వైద్య విధానం ఎంతో ప్రశస్తిపొందింది. శిశువు ఎదుగుదలో మెడ నిలపలేకపోవడం, కూర్చోలేకపోవడం, చూపు నిలపలేకపోవడం, మాటలు అస్పష్టంగా రావడం, నడక సరిగ్గా లేకపోవడం, బుద్ధిమాంద్యం, చిన్న శబ్దానికే ఉలిక్కిపడడం, ఫిట్స్, చొంగకార్చడం, గ్రహణశక్తి లోపం, తొందరగా అన్నం నమిలి మింగలేకపోవడం వంటి లక్షణాలు కొందరి పిల్లల్లో పూర్తిగాను, మరికొందరిలో కొన్ని లక్షణాలే వుండటం గమనిస్తూంటాం. ఈ లక్షణాల కలయికనే సెరిబ్రల్ పాల్సీ అంటారు. తన ఆయుర్వేద విధానంలోని కొన్ని ప్రత్యేక చికిత్సలతో ఆయన విజయవంతమైన ఫలితాలు సాధించి కొద్ది వారాలలోనే అటువంటి పిల్లలను ఆరోగ్యవంతులుగా చేశారు. సెరిబ్రల్ పాల్సీకి మూలకారణం మెదడులో వుంటుంది. ఆయుర్వేద మేధ్య రసాయనాలతో, తైలాలతో, లేపనాలతో చేసే క్లిష్టతర చికిత్సలలో అందెవేసిన చేయిగా ఎందరో శిశువులకు కొత్త జీవితం ఇచ్చిన ఆయన వ్యక్తిగా పసిహృదయుడే. తన ఆధ్యాత్మిక, సాహిత్య జ్ఞానంతో కూడా చికిత్స చేసే నిజమైన కవి భిషక్కు ఆయన.
కవి మిత్రుడు, మంచి విమర్శకుడు గుడిపాటి ధేనువకొండకు మంచి స్నేహితుడు. గుడిపాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధానికి ధేనువకొండ శ్రీరామమూర్తి ఆయతనమ్, ఐలాండ్ విల్లా, కోర్టు సెంటర్, క్రౌంచవియోగం, జలయజ్ఞ సమిధలు, దక్షిణపొలం, పశుర్వేతి, పశ్యంతి వంటి అద్భుతమైన కథలు రాశారు. తమ ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం పంతులు గారు నివసించిన ఇల్లు భూమికగా ఆయన రాసిన ‘ఐలాండ్ విల్లా’ కథల సంపుటి ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చింది. ఆ సంపుటికే 2009లో ఆయన శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సేవా సమితి నుండి కుర్రా కోటాసూర్యమ్మ స్మారక సాహిత్య పురస్కారం అందుకున్నారు. ‘ఐలాండ్‌విల్లా’ ఆడియో కథా సంపుటిగా కూడా రూపొందడం ఒక విశేషం. అలాగే మరో కథా సంపుటి ‘మోహతిమిరం’ కూడా కథకునిగా ఆయన స్థానాన్ని తెలుగు కథా ప్రపంచంలో చాటి చూపింది.
కథకునిగా ఆయన కథలు మానవ జీవన పార్శ్వాలను మహోన్నతంగా కనులముందు నిలుపుతాయి. శంకరాభరణం శంకరశాస్ర్తీలా ధేనువకొండ శ్రీరామమూర్తిగారి ‘ఆయతనమ్’ కథలోని చయనులు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అనీ, తాను విశ్వసించిన సంస్కృతీ సంప్రదాయాలకు అంకితమైన చయనులు విశ్వనాథవారి ధర్మారావు కంటే ఉన్నతుడిగా గోచరిస్తాడు అనీ- కె.పి.అశోక్‌కుమార్ ‘ఆయతనమ్’ కథ ఒక్కటి చాలు కథకునిగా ధేనువకొండ శిఖరస్థాయిని తెల్పడానికి అని చెప్పడం అతిశయోక్తి అనలేము. ఆధునికత పేరుతో బ్రాహ్మణ కుటుంబాలలో విచ్ఛిన్నమవుతున్న సంప్రదాయరీతుల పట్ల ఆర్తి, ఆవేదన, సంస్కృతి సంప్రదాయలపట్ల కథకుని వల్లమాలిన ఆపేక్ష ‘ఆయతనమ్’, ‘యజ్ఞోపవీతం’, ‘జలయజ్ఞ సమిధలు’ వంటి కథలలో కానవస్తుంది. ‘క్రౌంచ వియోగం’ కథలోని శేషయ్య తాత భోజన ప్రియత్వం ‘మిధునం’ సినిమాలోని బాలసుబ్రహ్మణ్యం పాత్రను తలపిస్తుంది. ధేనువకొండలోని తాత్త్వికత, ఆధ్యాత్మిక చింతన మఖమల్ గులాబీ, దక్షిణపొలం వంటి కథల్లో తొంగి చూస్తుంది. నేటి కార్పొరేట్ రంగపు యువతీ యువకులు చదివి తీరాల్సిన కథ - ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు. డాట్‌కామ్’. అలాగే ‘మోహతిమిరం’ కథ చదివితే వివాహేతర సంబంధాలవల్ల ఒనగూడే అనర్థాలు కనువిప్పు కలిగించేలా తెలుస్తాయి. ముందు చెప్పుకున్న డాక్టర్‌గా ఆయన చికిత్స చేసే ‘సెరిబ్రల్ పాల్సీ’ నేపథ్యంలోనే ‘చిగురించిన శిశిరం’ అనే అద్భుతమైన కథను రాశారు. వృత్తినీ ప్రవృత్తినీ అందంగా ముడివేసిన కలం నైపుణి అది. సంగీతం పట్లగల ఆసక్తితో రాసిన కధేతివృత్తాలు కూడా కానవస్తాయి. ఆయన కథల్లో కవిత్వ భాష వుంది. అందుకు వౌలికంగా ఆయన ‘కవి భిషక్కు’ కావడమే కారణం.
కవిగా ధేనువకొండ శ్రీరామమూర్తిగారు వెలువరించిన తొలి కవితా సంపుటి ‘ఆశల సముద్రం’ అలాగే ‘అమ్మఒడి’ అనే దీర్ఘకవితా సంపుటి వెలువరించారు. స్వల్ప వ్యవధిలోనే రెట్టింపు ముద్రణలు పొందింది ఆ కావ్యం. అలాగే ‘వల్మీకం’, ‘చింతయామి’ కవితా సంపుటులు కవిగా ధేనువకొండకు విమర్శకుల ప్రశంసలను ఉత్తాలంగా సమకూర్చిపెట్టాయి. ఎంపిక చేసిన కొన్ని కవితల ఆంగ్లానువాదాలతో ‘సమ్ సైలెంట్ మెలోడీస్’ అనే సంపుటి వెలువడింది. హిందీ కవితల అనువాదంతోనూ ఒక గ్రంథం వెలువడింది. భోపాల్‌లో జరిగిన ‘కవిభారతి’ కార్యక్రమంలోనూ కేంద్ర సాహిత్య అకాడమీయే 2014లో నిర్వహించిన దక్షిణ భారతీయ భాషల కవితోత్సవంలోనూ తెలుగు కవిగా ధేనువకొండ శ్రీరామమూర్తి పాల్గొన్నారు. తన సేవాతత్పరతతో ‘పాలపిట్ట’ సాహిత్య పత్రికకు, స్ప్రెడింగ్ లైట్స్ వంటి సేవాకృషికి బాసటగానిల్చిన వదాన్యత వారిది.
ఈ కవిభిషక్కు కవిత్వంలో తనదైన విలక్షణతను ముద్రవేసుకున్నాడు. ‘అమ్మఒడి’ కావ్యం తమను కవిత్వ ప్రేమికులను చేసిందని ప్రకటించినవారున్నారు. కవిగా తన సొంత గొంతుకను నిలుపుకుంటూ అఖిల భారత సమ్మేళనాలకు బెంగుళూర్, గోవా, కొచ్చిన్, భోపాల్‌లకు తెలుగు కవిత్వ ప్రతినిధిగా కేంద్ర సాహిత్య అకాడమీ పంపున వెళ్లి ప్రశంసలందుకున్న వారాయన. చింతయామి కవితా సంపుటికి నాలుగేండ్ల ఆయన మనుమడు ‘అచ్యుత్’ ముఖచిత్రాన్ని సంతరిచ్చి ఇచ్చాడు. కన్న తల్లినీ, ఉన్న ఊరునీ మరువని మట్టి పరీమళం, ఒక సంప్రదాయభిజ్ఞతతో కూడిన తాత్త్వికచింతన ఆయన కవితల మూలాధారనాడి. ‘జీవితం ఒకటి జ్ఞాపకాలు అనేకం’, ‘పురాతన శబ్దమాలికలు’, ‘మా కశ్చిత్ దుఃఖమాగ్భవేత్’, ‘మాజిక్ రియాలిటీ’, ‘మృత్యుముఖం నవ్వుతోంది’, ‘విశ్వాత్మ ఒక్కసారి కళ్ళుతెరు’ వంటి కవితా ఖండికలు ఆయన కవితా గరిమకు అరచేతి కంకణాలు.
కనుల మూయకనే స్వప్నం
స్వాప్నిక ట్రాన్స్‌లో
నడుస్తూ, ఈదుకుంటూ ఎగురుకుంటూ
నెమ్మదిగా సాహసంగా, అమాయకంగా
శాశ్వతంగా శిథిలమైన
జలసమాధిలోని గ్రామాన్ని
మునిగిపోయిన మనిషి జాడను వెతుక్కుంటున్నాను
- అంటారొకచోట. ధేనువు తిరుగాడిన కొండ ధేనువకొండ అయింది. ఆ స్వచ్ఛత, పావనత హృదయంలో నిలుపుకుని సమాజహిత చింతనతో సేవాభావంతో జీవిక సాగించిన వారాయన. మానవ జీవితపు అనేక కోణాలను, అనేక పార్శ్వాలను చిత్రిస్తూ ఆయన రాసిన నవల ‘స్నిగ్థ్ఛాయ’. అనేక అవరోధాలను ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించడానికి మొక్కవోని జీవిత ప్రస్థానాన్ని సాగించిన స్ర్తి పాత్ర రేవతి. విమానంలో అమెరికా వెళుతూ తన జీవితాన్ని నాస్టాల్జియాగా మననం చేసుకోవడంతో మొదలయ్యే ‘స్నిగ్థ్ఛాయ’ నవల అద్యంతం ఆసక్తిగా చదివిస్తుంది. రచయిత తొలి నవలకు ఇచ్చే పదివేల రూపాయల నగదును ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు’, ‘స్నిగ్థ్ఛాయ’కు ప్రదానం చేసింది. 2015 ఏప్రిల్‌లో ఆవిష్కృతమైన ‘స్నిగ్థచ్ఛాయ’ పాఠకుల, పత్రికల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే గత సంవత్సరం నవ్య వారపత్రిక, లక్ష్మీనారాయణ జైని మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలో డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తిగారి ‘కామరూప’ నవలకు ద్వితీయ బహుమతి లభించింది. ధారావాహికగా పాఠకులను ఆకట్టుకుంటూ ఉత్కంఠభరితంగా సాగిన నవల ఇది. సరోగసీ, ఐఫీ పద్ధతుల్లో సంతానప్రాప్తి పొందటం వంటి నవీన వైద్య అంశాల చిత్తికపై మానవ జీవన పరిణామ విశే్లషణను తాత్వికంగా చేయడంలో అందులో కానవస్తుంది. ‘అతడి ధాతువును తన క్షేత్రంలో పోషించడం తప్పుకానప్పుడు అతన్ని కోరుకోవడంలో తప్పేంటి’ అని నీలాంబరి పాత్ర తన మనసునిండా రామచంద్రుడిని నిలుపుకోవడం, ఆమె ఏం చేయబోయింది? అనే ఉత్కంఠతో సాగే ఈ నవలలో మరో ప్రధాన ఆలోచనా ధార ఏమిటంటే- ‘‘మానవాతీత శక్తుల్ని కొట్టిపారేయలేం. కానీ ఒక వైద్యుడు వైద్యపరంగా పరీక్షలు జరిపి శాస్ర్తియ పద్ధతిలో నిర్థారణ చేసిన విషయాన్ని ఎక్కడో దూరంగా ఒక పల్లెటూర్లో కూర్చున్న నరసింహం పంతులుగారు సిద్ధయోగ మార్గం ద్వారా చెప్పగలిగారు. ఇదెలా సాధ్యమైంది? అదేవిధంగా వెంకట్రామన్ కూడా సియాన్స్ ప్రయోగం ద్వారా ఎక్కడో అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుంటున్న వ్యక్తి ప్రాణాలు కాపాడాడు! ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఈ విషయాలన్నీ ‘కామరూప’ నవల పాఠకులను పఠనాసక్తితో అలరింపజేసింది.
ధేనువకొండ శ్రీరామమూర్తి ధన్వంతరి జయంతి పాటించేవారు. ఆయుర్వేద వైద్యాన్నీ, సాహిత్య క్షేత్రంలో నవల, కథ, కవితా, వ్యాసరచనా సేద్యాన్ని ప్రతిభావంతంగా నిర్వర్తించిన సవ్యసాచి ఆయన. ఆయన మరణం వైద్య రంగానికే కాదు సాహిత్య ప్రపంచానికీ ఒక తీరని లోటు. ఆ ‘కవి భిషక్కు’ ధేనువకొండ శ్రీరామమూర్తికి అక్షరనివాళి!
ధేనువకొండలోని తాత్త్వికత, ఆధ్యాత్మిక చింతన మఖమల్ గులాబీ, దక్షిణపొలం వంటి కథల్లో
తొంగి చూస్తుంది. వృత్తినీ ప్రవృత్తినీ అందంగా ముడివేసిన కలం నైపుణి అది. సంగీతం పట్లగల ఆసక్తితో రాసిన కధేతివృత్తాలు కూడా కానవస్తాయి. ఆయన కథల్లో కవిత్వ భాష వుంది. అందుకు వౌలికంగా ఆయన
‘కవి భిషక్కు’ కావడమే కారణం.

- సుధామ, 9849297958