సంకల్పబలంతో సక్సెస్
Published Sunday, 10 June 2018ఈ స్వతంత్ర భారతంలో తాము పౌరులమనీ, ఈ దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామనీ భావించేవారు ఎందరు? చాలా కొద్దిమంది. అటువంటివాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో స్థిరపడి ఉండవచ్చు. కానీ తన దేశం పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయనను తిరిగి మన దేశానికి వచ్చేలా చేసింది. మొదట ప్రజలు ఆయనను విశ్వసించనప్పటికీ, అహింసాయుతమైన పద్ధతుల ద్వారా తాను దేశానికి స్వాతంత్య్రం సాధించగలననే దృఢ విశ్వాసం ఆయనకు ఉండేది.
మహాత్మాగాంధీ విద్యార్థిగా ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లాలని అనుకున్నాడు. కానీ గాంధీగారి తల్లి పుత్లీబాయికి ఇది ఇష్టం లేకపోయింది. ఆ పరాయి దేశంలో గాంధీ ఆకర్షణలకు లోబడి తన జీవితాన్ని పాడుచేసుకుంటాడని ఆమె భయపడింది. తాను మద్యం, మాంసాలను ముట్టుకోనని, స్ర్తిలతో సాంగత్యం పెట్టుకోననీ తనకు ప్రమాణం చెయ్యమని పుత్లీబాయి కోరింది. ఒక క్షణమైనా సందేహించకుండా మోహన్దాస్ ఆమె షరతులకు అంగీకరించాడు. అతడికి అది అంత సులభమైన పని కాలేదు. చాలాసార్లు అనేక ఆకర్షణలు ఆయనను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాయి. కానీ తల్లికి ఇచ్ని మాటకు కట్టుబడి ఉండటమే ఆయనను అన్ని అపాయాలనుండి కాపాడి తనకు ఎదురైన కష్టాలన్నింటినీ అధిగమించే గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఆయనకు ఇచ్చింది. కట్టుబడి ఉండటమే బాధ్యతను తీసుకునే లక్షణాల్ని రూపొందిస్తుంది.
విచక్షణా జ్ఞానాన్ని రూపొందించుకోవడానికి కావలసిన మరో లక్షణం సంకల్పశక్తి. ఒట్టు పెట్టడం సులభమే కానీ దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. భీష్ముడికి ఉన్నటువంటి సంకల్ప శక్తి మనకు కావాలి. ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఉండటానికి ప్రతిజ్ఞ చేసి, దాన్ని శ్రద్ధతో ఆచరించి చూపాడు. బలహీనమైన మనస్సు ఉండేవాళ్ళు ఏవో కుంటిసాకులు చెప్పడానికి చూస్తారు. మనస్సు చంచలమైనది. స్వాభావికంగా అశాంతిగా ఉంటుంది. ఎప్పుడూ ఊగిసలాడుతూ, క్షణానికి ఒక ఆలోచన చేస్తూ వుంటుంది. ఎవరైతే దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారో, గొప్ప పనుల్ని సాధించాలన్న దృఢనిశ్చయాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళు తమ మనస్సులు చెప్పేది వినరు.
మహారాజు అయిన విశ్వామిత్రుడు గర్విష్టి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుణ్ణి రకరకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాలు ఫలించక భంగపడ్డాడు. వశిష్ఠుడి వద్ద ఉన్నది ఆధ్యాత్మిక శక్తి అని గ్రహించి తాను కూడా తపస్సు చేసి బ్రహ్మర్షి కావాలని నిశ్చయించుకున్నాడు. కానీ మేనక అతణ్ణి ఆకర్షించినప్పుడు కామ సుఖాల వలలో చిక్కుకుపోయాడు. బ్రహ్మర్షి స్థితిని సాధించడం కోసం కోపం, ద్వేషం, అసూయ, గర్వం, ఈర్ష్య, భ్రమలు మొదలైన అడ్డంకులన్నీ దాటవలసి వచ్చింది. అయితే తన అమోఘమైన సంకల్ప శక్తి వల్లనే విజయం సాధించాడు. ఓటమి పాలయ్యానని ఆయన ఎప్పుడూ తన గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ఆయన యొక్క దృఢనిశ్చయం, దృఢసంకల్పం ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలిపి, గెలుపుబాటలో నడిపించాయి.
బాధ్యతలకు కట్టుబడి ఉండి, దృఢమైన సంకల్పంతో గమ్యం, లక్ష్యాలపై స్పష్టత కలిగి ఉంటే విచక్షణారాహిత్యం అనే సమస్యే ఉండదు. ఈ ప్రపంచంలోని ఏ అంశం కూడా ఒక్కదానిగా ఉండదు. ఎన్నో కారణాలు, ప్రభావాలు దాని వెనుక ఉంటాయి. అలాగే విచక్షణాజ్ఞానం అన్నది కూడా ఓ విడి అంశం కాదు. ఎన్నో విషయాల మిశ్రమం. ఆ లక్షణాల్ని అలవాట్లుగా మార్చుకుంటేనే విచక్షణాజ్ఞానం విన్నింగ్ పాయింట్గా మారుతుంది.