S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హేమంత ఋతువు వర్ణించి అన్నకు చెప్పిన లక్ష్మణుడు( అరణ్యకాండ)

పర్ణశాలలో నిష్టురాలైన సీతతో, తమ్ముడు లక్ష్మణుడితో ఎంతో సుఖంగా శ్రీరామచంద్రమూర్తి వున్న సమయంలో శరత్కాలం పూరె్తై, మంచుకాలం మొదలైంది. ఇలా హేమంత ఋతువు రాగా, ఆ ఋతువులో ఒకనాటి తెల్లవారుజామున రామచంద్రమూర్తి గోదావరి నదీ స్నానం చేయడానికి సీతాదేవితో పోతుండగా, లక్ష్మణుడు కమండలాలు తీసుకొని వెంటబోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో ఇలా అన్నాడు. ‘అన్నా! ఏ ఋతువు వల్ల సంవత్సరం ప్రకాశిస్తుందో, నీకు ఇష్టమైన మాసమేదో, అలాంటి మార్గశిరం, హేమంత ఋతువు అయిన మంచుకాలం ఇప్పుడు వచ్చింది కదా! ప్రజలకు దేహం కఠినమైంది. స్నానం చేయడానికి సాధ్యపడకుండా నీటికి పళ్లు వచ్చి కరవసాగింది. పైరుపచ్చలు కాంతితో కళకళలాడుతున్నాయి. అగ్నిహోత్రుడు గతంలో లాగా కాకుండా ఆప్తుడై ప్రజలను దగ్గరకు రానిస్తున్నాడు. తమకేది మంచిదో తెలుసుకొని కొత్త ధాన్యం రాగానే పాలలో పొంగించి దాన్ని పితృ దేవతలకు నివేదించి పాపరహితులవుతున్నారు. అన్నా! రాజులు యుద్ధానికి పోవడానికి, గ్రామాలలో వుండేవారు పాలు, పెరుగు తినడానికి, ఈ మంచుకాలం పనికొస్తుంది కదా? దక్షిణ దిక్కున సూర్యుడున్న కారణాన ఉత్తర దిక్కు ముతె్తైదువు చిహ్నమై, ముఖానికి శాశ్వత కాంతిని కలిగించే కుంకుమ బొట్టు లేని ఆడదాని లాగా ఉంది.’
(ఇది దక్షిణాయనమైనందున సూర్యుడు దక్షిణ దిక్కునే ఉంటాడు. శ్రీరామచంద్రమూర్తి ఉత్తర దేశాన లేనందున అది విధవలా ఉంది.)
‘హిమవత్పర్వతం స్వభావంగానే మంచుగడ్డలకు స్థానం. అందులో ఈ కాలంలో సూర్యుడు దూరంగా ఉండటం వల్ల మంచు కరగడం ఆగిపోయి హిమవంతుడు అనే పేరు వచ్చే అర్థంతో కాలమహిమ వల్ల అలరారుతున్నాడు. ఉదయం, సాయంత్రం మంచు ఎక్కువగా ఉండటం వల్ల జనాలు తిరగలేరు. మధ్యాహ్నం జనులంతా సుఖంగా తిరగడానికి కొంచెమే వేడి కల ఎండ ఉంటుంది. చెట్ల నీడల్లో సూర్యకిరణాలు ఎక్కువగా పడని కారణాన నీళ్లు జిల్లుమంటూ తాకడానికే కష్టంగా ఉంటాయి. ఎండలు కొంచెమే వ్యాపించడం వల్లా, మంచుతో కప్పబడటం వల్లా, చల్లటి గాలి వీస్తూండటం వల్లా, వనాలలో మనుష్య సంచారం లేదు. ఇక పక్షుల కీళ్లు పట్టుకుని పోయి, అవయవాలు ముద్దపడి వుంటాయి. పగలీ విధంగా ఉంటుంది. రాత్రుళ్లు బయట పడుకొనేవారుండరు. పుష్యా నక్షత్రం చూసి పొద్దు తెలుసుకోవాల్సి ఉంటుంది. రాత్రుళ్లు బూజు పట్టినట్లు తెల్లపారి, చలిగాలి వీస్తూంటుంది. ఆహ్లాదం కలిగించేవాడు కాబట్టి చంద్రుడికి ఆ పేరొచ్చింది. ఇప్పుడా పేరును తనకు వ్యర్థం చేసుకొని, లోకులను సంతోష పర్చడానికి ఆ శక్తిని సూర్యుడికి ఇచ్చాడు. ఆ కారణాన తపనుడు అనే పేరు సూర్యుడికి వచ్చి చంద్రుడిలాగా అయ్యాడు. అంటే సూర్యుడు చంద్రుడిలాగా ప్రజలకు సంతోషం కలిగించేవాడయ్యాడు. చంద్రుడేమో మంచు కురవడం వల్ల ప్రజలకు బాధ కలిగించేవాడయ్యాడు.’
‘అంతే కాకుండా మంచు తుంపరలు వ్యాపించడం వల్ల, చంద్రబింబం నోటి ఆవిరి కమ్మడం వల్ల గుడ్డి అయిన యుద్ధం లాగా కనపడుతున్నది. నిండు పున్నమి నాటి రాత్రి మంచుతోమలినం కావడం వల్ల సంతోషం కలిగించలేక పోయింది. ఇది ఎండ వల్ల నల్లబడ్డ సీతాదేవి లాగా ఉంది కానీ ఆమెకున్న కాంతి మాత్రం లేదు. పడమటి గాలి స్వభావంగా చల్లగా ఉంటుంది. దానికి తోడు మంచు బిందువులు చేరాయి. కాబట్టి ఉదయం వేళ గాలి ఇనుమడించిన చలితో కూడి ఉంది. యవగోధూమాల పైరుల వల్ల ప్రకాశించే మంచు బిందువులతో కప్పబడిన అడవి సూర్యోదయ సమయం కావడాన క్రౌంచ పక్షులు వీటి ధ్వని వల్ల ప్రకాశిస్తున్నాయి. ఖర్జూరపు పూల లాంటి కాంతి కలిగి, ఎన్నులు, వడ్ల గింజలతో నిండి ఆ బరువుకు తలలు వంచి పండటం వల్ల అపరంజి బంగారు కాంతి కలిగిన పైరు చూశావా? సూర్యుడు ఉదయించినా మంచంతా పోలేదింకా. తుంపరగా, సన్నగా, వ్యాపించే ఉంది. ఆ కారణాన సూర్యుడు ఉదయించి చాలా పొద్దు పోయినా చందమామలాగా ఉన్నాడు. శ్రీరామచంద్రా! మధ్యాహ్నానికి ముందు ఎండ వేడి లేక సుఖంగా దేహాన్ని తాకుతూ, మధ్యాహ్నంలో కొంచెం ఎరుపు, కొంచెం తెలుపుగా సూర్య కిరణాలున్నాయి.’
‘మంచు తుంపరలు రాలడం వల్ల కొంచెం తడిసి ఉన్న లేపచ్చిక పట్టులలో సూర్యుడి నీరెండ పడిన విధం చూశావా రామా! సూర్యకాంతి ఈ బిందువుల మీద పడటం వల్ల అవి వజ్రాలలాగా కనపడుతున్నాయి. అన్నా! ఈ అడవి ఏనుగును చూడు. అది మిక్కిలి దప్పికతో బాధపడుతూ నీళ్లు తాగాలని తొండం కొనతో నీటిని తాకి అది జిల్లుమనగా తాగలేక తొండాన్ని ముడుచుకుంటున్నది. నీటి పక్షులు ఎప్పుడూ నీళ్లలోనే వుండేవైనప్పటికీ, నీటి వెంట తీరంలో కూర్చుని, నీళ్లలో దిగడానికి భయపడుతున్నాయి. వీటిని చూస్తే పిరికివాళ్లు యుద్ధ రంగంలోకి దిగడానికి భయపడే విధంగా కనపడుతున్నది. లోపలా, బయటా మంచనే చీకటి, విస్తారంగా కప్పడం వల్ల అడవి పూలు లేనిదానిలాగా కనపడ్తున్నది. నీళ్లలో వుండే బెగ్గురు పక్షులు మంచు ఆవిరి కప్పడం వల్ల బయటకు రాకున్నా, వాటి ధ్వనుల వల్ల ఉనికి తెలుస్తున్నది. భూమేమో మంచు తెరలతో తడిసిపోయింది. పైపైన మంచు రాలడం వల్ల సూర్య కిరణాలలో వేడి లేకుండా ఉన్నందున, రామచంద్రా, నిర్మలమైన రాళ్ల మీద పడ్డ నీళ్లు కూడా విషాలై పోయాయి. తామరపూలు పూసి చాలాకాలం అయినందున మంచువల్ల అందం చెడి, వాడిపోయి, కాంతి హీనమై, అకరువులు, దిమ్మెలు రాలిపోగా కాడలు మాత్రమే వున్న తామరలతో కొలనులు అందవిహీనంగా ఉన్నాయి.’
‘ఇలా పుండులాగా, బాధాకరమైన మంచు కాలంలో, అయోధ్యలో దుఃఖంతో కుమిలిపోతూ, రాజ్యసంపదలన్నీ వదలి, భోగాలు ఆశించక, ఉపవాసాలుండి, జడలు నారలు ధరించి, మంచాలు పరుపులు వదలి, ఆరుబయట నేల మీద పడుకుంటూ, కొంచెం మాత్రమే పళ్లు తింటూ, నీ మీద వున్న భక్తితో భరతుడు కష్టపడుతున్నాడు కదా? అన్నయ్యా! మనం లేచిన వేళకే భరతుడు కూడా నిద్రలేచి సరయూ నదిలో స్నానం చేయడానికి, మంత్రులు, ఇతరులు సేవిస్తుండగా నిర్మలమైన మనస్సుతో, అయ్యో ఇలా పోవాల్సి వచ్చింది కదా అనే విచారం లేకుండా పోతుంటాడు కదా? నీకంటే కూడా సుకుమారుడు, వీరుడు, పల్చటి కడుపు కలవాడు, చక్కటివాడు, కష్టింప తగినవాడు, సమస్త ధర్మాలు తెలిసినవాడు, సజ్జనులకు సంతోషకారుడు, సత్యవాది, దోషం లేని పనులు చేసేవాడు, మదించిన శత్రువుల గర్వం అణచేవాడు, తీయటి మాటలు చెప్పేవాడు, మోకాళ్ల దాకా చేతులున్నవాడు, మాత్సర్యం, దుష్కామం లేనివాడు, చేయతగని పనులు చేయడానికి సిగ్గుపడేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, గాఢమైన భక్తి వున్నవాడు, అఖిలభోగాల రాశి, నీ తమ్ముడు భరతుడు ఆశను వదలి అడవిలో తపించే నీలాగా, తపస్సులో నిష్టబూని, స్వర్గాన్ని తిరస్కరించిన వాడయ్యాడు. తండ్రిని పోలిన కూతురు, తల్లిని పోలిన కొడుకు ధన్యులని సామెత వుండగా, సముద్రంలో కలిసిన నీరు సముద్రంలాగా కావాల్సి ఉండగా, ధర్మ స్వభావుడైన దశరథుడికి భార్య అయ్యి, ఇలాంటి సుగుణ సంపత్తిగల కొడుకుకు తల్లి ఐన కైక ఇంతటి దుష్టురాలు, వాడికల మనసున్నదిగా ఎలా కాగలిగిందో?’
(లక్ష్మణుడి సందేహం న్యాయమైందే కాని, రామలక్ష్మణుల, భరత శత్రుఘు్నల జన్మలకు బీజం కారణం కాదు. క్షేత్రమూ కాదు. పాయస రూపం వహించిన భగవత్తేజం కారణం కాబట్టి తల్లిదండ్రుల గుణాలు వీరికి అంటాల్సిన అవసరం లేదు)
ఈ విధంగా లక్ష్మణుడు చెప్పగా, శ్రీరాముడు, ‘లక్ష్మణా! ఎందుకు నిర్నిమత్తంగా కైకను దూషిస్తావు? రఘువంశనాథుడైన ఆమె కొడుకును ప్రశంసించు. అది నాకు సంతోషం కలిగిస్తుంది. వనవాసం పూర్తిగా చేసుకోవాలని మనస్సు దృఢం చేసుకొన్నా, భరతుడిని తలుచుకున్నప్పుడు, ‘అయ్యో! భరతుడి దగ్గరకు పోతే బాగుండేదే, ఆయన్ను విడిచి వచ్చానే’ అని పామరులలాగా నాకూ దుఃఖం కలుగుతున్నది. నాయనా! లక్ష్మణా! కొందరి మాటలు వినడానికి మొదట్లో మధురంగానే ఉంటాయి కాని, చివరకు, అవే అప్రియాలై పరిణమిస్తాయి. భరతుడి మాటలు అలాంటి ఇచ్చకాలు కావు. కొన్ని పదార్థాలు నాలుకకు తియ్యగా ఉన్నా లోపలికి పోయినకొద్దీ వికారంగా మారుతాయి. భరతుడి మాటలు అలా కాకుండా అమృతంలాగా ఉంటాయి. లోపలికి పోయినా దేహారోగ్యం కలిగించే ఔషధుల్లాంటివి. అదీ కూడా ఒకటి రెండు చుక్కలు కావు. అమృతరస ప్రవాహం కాబట్టి సర్వదా అతడి మాటలు నాకు ఇప్పటికీ మరపునకు రావు. నిన్ను, భరతుడిని, శత్రుఘు్నడిని, సీతను కూడిన నేను సంతోషంతో వుండేదెన్నడో కదా’ అని అంటూ, విచారపడుతూ గోదావరి నదికి స్నానం చేయడానికి పోయాడు. సీతాలక్ష్మణులతో స్నానం చేసి వచ్చి, సంధ్యావందనం లాంటివి చేసుకొని, బ్రహ్మ యజ్ఞాన్ని చేసి, పార్వతీ నందులతో కూడిన రుద్రుడిలాగా కనిపించాడు. -సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12