S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సీతా లక్ష్మణులను గుహలోకి పొమ్మని యుద్ధానికి సిద్ధమైన శ్రీరాముడు (అరణ్యకాండ)

లక్ష్మణుడు చేయాల్సిన పనేదో చెప్పాడు శ్రీరాముడు ఇలా: ‘సీతాదేవి ఇక్కడుంటే ఆమెకు వాళ్లు కీడు కలిగిస్తారు. కాబట్టి ఆమె ఇక్కడ ఉండకూడదు. ఒంటరిగా ఎక్కడికీ పంపకూడదు. నువ్వు ఆమెను పిల్చుకొని, విల్లు- బాణాలు ధరించి దట్టంగా వున్న చెట్ల గుంపులు కల కొండ గుహలోకి పొండి. ఆమెను లోపల వుంచి నువ్వు బయట కాపలాగా ఉండు. ప్రయాణంకండి తొందరగా. లేలే. నేనొక పని, నువ్వొక పని చేయాల్సి ఉంది. రెండూ ముఖ్యమైనవే కదా?’
(వీటినే ఇప్పుడు ‘సీతమ్మ గుట్టలు’ అని అంటారు. రాక్షస సైన్యం తూర్పు ముఖంగా వచ్చింది. సీతాలక్ష్మణులు ఏటి ఒడ్డు వెంట ఉత్తర ముఖంగా పోయారు)
శ్రీరాముడు ఇంకా ఇలా అన్నాడు లక్ష్మణుడితో. ‘నేను చెప్పిన మాటలకు బదులు చెప్తే నా పాదాల మీద ఒట్టు. యుద్ధ ప్రియా! నువ్వు బలహీనుడవనీ, వీళ్లతో యుద్ధం చేసి గెలవలేవనీ, నిన్నీ పనికి ఏర్పాటు చేయలేదు. నువ్వు బలవంతుడివి. శూరుడివి. వీళ్లందరినీ జయించవచ్చు. ఇందులో సందేహం లేదు. అయినా ఈ రాక్షసులను నేనే స్వయంగా చంపాలనుకుంటున్నాను. అంతే తప్ప మరే కారణం లేదు. వాళ్లు రాక ముందే బయల్దేరి వెళ్లు. మునులకు వాగ్దానం చేసిన వాడిని నేను. కాబట్టి ప్రథమ ప్రయత్నంగా నేనే యుద్ధానికి పోవడం శ్రేయస్కరం. అలా కాకుండా నిన్ను యుద్ధానికి పంపించి నేను చాటుగా వుంటే, రాముడు మాట్లాడేవాడే కాని సమయం వచ్చేసరికి ముఖం తప్పించి, తానూ, తన పెళ్లాం గుహలో దాక్కొని చిన్నవాడిని ముందుకు తోశాడని అంటారు. నువ్వు నన్ను ఇలాంటి అపకీర్తి పాలు చేయవచ్చా? కాబట్టి నేనే యుద్ధానికి పోతాను.’
రామచంద్రమూర్తి చెప్పినట్లే త్వరగా లక్ష్మణుడు తన విల్లు, బాణాలు ధరించి సీతాదేవితో వెళ్లిపోయాడు. ఇక సీత విచారం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఆ సంతోషంతో యుద్ధ ప్రయత్నం చేశాడు. మండుతున్న అగ్నితో సమానమైన గొప్ప కవచాన్ని తొడుక్కొని, పదునైన బాణాల విల్లు చేతబట్టుకొని, అల్లెతాటి ధ్వనితో దిక్కులు భేదిల్లేట్లు రామచంద్రమూర్తి ఉత్సాహంగా విజృంభించి నిలిచాడు. ఇలా ఉత్సాహంతో యుద్ద సన్నద్ధుడై నిలిచిన రామభద్రుడిని చూసిన గంధర్వులు, దేవతలు, చారణులు మొదలైన వారు యుద్ధం చూసే కోరికతో ఆకాశంలో నిలుచున్నారు. వారిలో వున్న ఋషులు తమలో తాము మాట్లాడుకుంటూ, మూడు లోకాలకు మేలు జరగాలని కోరుకునే గోబ్రాహ్మణులకు శుభం కలగాలని అంటారు. అలానే, చక్రపాణి అయిన విష్ణుమూర్తి దైత్యశ్రేష్ఠులందరినీ ఎలా జయించాడో, అదే విధంగా, పులస్త్య వంశంలో పుట్టిన భయంకర రాక్షసులందరినీ యుద్ధంలో జయించాలి అని దీవించారు. ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే అనీ, అధర్మవర్తులైన దుష్ట రాక్షసులు పధ్నాలుగు వేల మందనీ, యుద్ధం ఎలా జరగనుందోననీ, ధర్మమే జయిస్తుందో, అధర్మమే జయిస్తుందో చూడాలనీ వారంతా ఆశపడ్డారు. కోపాతిశయంతో జగత్సంసార కార్యోన్ముఖుడైన పినాకహస్తుడు రుద్రుడి ఆకారంతో సమానమైన ఆకారాన్ని వహించి భూతాలకు భీతి కలిగించే రామభద్రుడి రూపాన్ని చూసి లోకాలు బాధపడ్డాయి.
రాముడిని చూసిన ఖరుడి సైన్యం
అప్పుడు గంభీర ధ్వనితో, భయంకరమైన కవచాలు, ఆయుధాలు, ధ్వజాలు కల రాక్షససేనలోని భటుల హుమ్మనే కంఠధ్వనులు, విల్లంబుల, అల్లెతాటుల టంటమ్మనే ధ్వనులు, నగారాల భాంభాం అనే ధ్వనులు, రథికుల ధిక్కారాల ధ్వనులు, వాళ్లు నడిచేటప్పుడు వారి కాళ్ల దభదభ చప్పుళ్లు, అన్నీ కలిసి పెద్ద సంకులమయింది. ఆ ధ్వనికి అడవుల్లోని మృగ సమూహం భయపడి నాలుగు దిక్కులా పరుగెత్తి, పరుగెత్తి, ఆ చప్పుడు వినబడని స్థలం చేరి అప్పుడు తిరిగి చూశాయి. అప్పుడు రాక్షస సైన్యం రాముడిని సమీపించగా, యుద్ధ పండితుడైన రామభద్రుడు వారందరినీ తేరిపార చూశాడు. రాముడప్పుడు అల్లెతాటిలోని బాణాన్ని సంధించి ప్రయోగానికి సిద్ధంగా ఉంచాడు. ప్రళయకాలంలోని అగ్నిహోత్రుడిలాగా మండుతూ దక్షాధ్వరధ్వంసం నాటి శివుడిలాగా చూసేవారికి భయంకర ఆకారంతో కనిపించాడు రాముడు. భయంకరమైన రామభద్రుడి ఆకారం చూసి భూతాలు పెద్ద ధ్వనితో సంతోషం చెడి అధిక భయంతో తొక్కిసలాడుతూ పరుగెత్తాయి. ధ్వజాలు, విల్లులు, ఆభరణ సమూహం, మండుతున్న అగ్ని లాంటి కవచాలుకల రాక్షససేన సూర్యోదయ సమయంలోని మేఘాల లాగా కనిపించాయి.
(ఇక్కడ రామచంద్రుడిని ప్రళయకాలవహ్ని అని, దక్షాధ్వరధ్వంసకుడు అని శివుడి ఉపమానాలు చెప్పడమంటే శత్రుసంహారం తథ్యమని చెప్పడమే. రాక్షసులను సూర్యోదయ మేఘాలతో పోల్చడమంటే వారికి అపజయం తథ్యమని కూడా అర్థం.)
-సశేషం
=====================================
పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12