S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆజాద్ కలలు సాకారం అయతేనే.(. నేడు జాతీయ విద్యా దినోత్సవం)

స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యా మంత్రి అయిన వౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉం చుకుని 2008 సంవత్సరం నుండి ఆయన జన్మ దినోత్సవం పురస్కరించుకుని నవంబర్ 11న దేశ వ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, న్ళిఉ మరియు శ్రీద్ళి వంటి అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేయడానికి ఆజాద్ ఎంతో కృషి చేశారు. ఆజాద్ ఉర్దూ, పెర్షియన్, అరబిక్ మరియు హిందీ భాషల్లో బాగా ప్రావీణ్యం ఉంది. పిల్లలకు 14 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడాన్ని గట్టిగా సమర్ధించాడు. దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నందున వయోజన విద్య కోసం కృషి చేశాడు. ప్రాథమిక విద్య ద్వారా సంస్కృతి మరియు సాహిత్యాలను ప్రోత్సహించడంలో కూడా ఆజాద్ కృషి మరువలేనిది. లలిత కళా అకాడెమి, సాహిత్య అకాడమీ వంటి అనేక సాంస్కృతిక మరియు సాహిత్య అకాడెమీలు స్థాపించడం జరిగింది.
బ్రతికే మనోధైర్యం కొరవడుతోందా....
ఇటీవల వార్తా పత్రికలలోని వార్తలను గమనిస్తే ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించటంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకం. విద్యార్థుల జీవితాలు మధ్యలోనే తుడిచి పెట్టుకు పోతున్నాయి. ఆధునిక కాలంలో కాలంతో పాటుగా పరుగులు తీస్తూ ప్రకృతిని శాసించే స్థాయలో సాంకేతికంగా ఎంతో పురోగమించాం. ఎన్నో అవకాశాలు, వసతులు, సౌకర్యవంతమైన జీవన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఒత్తిడితో కూడిన చదువులు, ఉద్యోగాలు, ఆర్థికంగా ఆకాశాన్ని అందుకోవాలనే ఆలోచనలు, విలాసవంతమైన జీవన విధానాలతో సైకలాజికల్ కౌనె్సలింగ్ సెంటర్ల అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సంఘటనను పరిశీలిస్తే పిల్లలు హత్యలు చేయడానికి కూడా ప్రేరేపించబడుతున్నారు. తండ్రులు, తాతల వద్ద లక్షలు, కోట్ల రూపాయలు లేకున్నా ఆనందమయ జీవితం గడిపేవారు. అందుకు ప్రధాన కారణం వారసత్వంగా వచ్చిన జీవన నైపుణ్యాలే. వారిలో బ్రతకగలం అనే మనోధైర్యం ఉండేది. కాని నేటి తరంలో అవి కొరవడుతున్నాయి. మార్కులు, ర్యాంకులే ప్రాతిపదికగా, చిన్నతనం నుండే ఐ.ఐ.టీలు, మెడికల్ ఫౌండేషన్‌ల పేరుతో వారి బాల్యాన్ని మొగ్గలోనే చిదిమేసే స్థాయిలో, ఒత్తిడితో కూడిన విద్యావిధానం, క్రమశిక్షణ కొరవడటం, విచక్షణ లేమి ఇవన్నీ కలసి విద్యార్థులను మానసిక వికలాంగులుగా తయారు చేస్తున్నాయి. చిన్నపాటి సమస్యను కూడా తనకు తానుగా పరిష్కరించుకోలేని దుస్థితిలోకి విద్యార్థిలోకం నెట్టి వేయబడుతున్నారనడంలో సందేహం లేదు.
మార్కులే ప్రామాణికమా....
విద్యార్థుల ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. మార్కుల ఆధారంగా వారి తెలివితేటలను కొలవకూడదు. ప్రపంచంలోని మేధావులంతా మార్కులేమీ సాధించిన వారుకాదు. పిల్లల చదువులను, మార్కులను తల్లిదండ్రులు వంశ ప్రతిష్టగా భావిస్తుంటారు. ఇది తప్పు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెట్ట కూడదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనో, అనుత్తీర్ణులయ్యామనో బాధ పడొద్దు. మార్కులు ర్యాంకులే ప్రధానం కాదు. ప్రపంచంలో లక్ష్యాలెన్నో ఉన్నాయి అందులో మనమూ ఒకటి సాధిద్దాం. ఒక సమిధలా వెలుగుదాం. ప్రపంచానికి ఒక వెలుగును ప్రసాదిద్దాం. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు, ఓటమి అన్నది ఎప్పుడు అపాయకారి కాదు. మనకు ఈ రెంటిని సాధించాల్సిన దానికి కావాల్సింది మనోధైర్యం, ఆత్మ విశ్వాసం, పట్టుదల.
పిల్లాడికి చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లేది తల్లిదండ్రులే
పరీక్ష తప్పానని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, విద్యాపరమైన ఒత్తిళలు ఎక్కువయ్యాయని.. ఇలా వివిధ రకాల కారణాలతో విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే... బుడిబుడి అడుగుల నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది తల్లిదండ్రులే... పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్టు విలవిల్లాడేది తల్లిదండ్రులే... మరి పిల్లలు చేస్తున్నది ఏంటి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే కన్నవారిని శోకసంద్రంలో ముంచేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. జీవితంలో సాధించాలన్న కసి ఉండాలే తప్ప.. పరీక్షలో తప్పానని, మార్కులు (90% మార్కులు దాటినా కాని) తక్కువగా వచ్చాయని ప్రాణాలు తీసుకోవడం సబబేనా? తల్లిదండ్రులు కూడా వారిపై మార్కుల ఒత్తిళలు తేవడం సమంజసమేనా? పరీక్ష ఫలితాలతోపాటే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలూ మామూలయ్యాయి. విద్యాసంస్థలను అడిగితే మీ పిల్లలను నెంబర్ 1 చేయడమే మా లక్ష్యం అంటారు. ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలు నెంబర్ 1 కావాలనే ఉంటుంది. మరి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ చిన్నారుల గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరు ఎలాంటి బాధ్యత వహించాలి...
జీవననైపుణ్యాల అవగాహన కొరవడుతోంది
ప్రస్తుతం సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో విపరీత ధోరణులు కన్పిస్తున్నాయి. విద్యార్థులకు విద్యార్థిదశ నుంచే సమస్యలు ప్రారంభమవుతున్నాయి. వాటిని పరిష్కరించుకునే శక్తి వారికి లేకపోవటం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు బాలల సమస్యల పట్ల శ్రద్ధ చూపక పోవడంతో 24 గంటలు చదివే యంత్రాలుగా విద్యార్థులు మారుతున్నారు. వీటిని నివారించి భావి పౌరులుగా వారిని తీర్చిదిద్దేందుకు జీవన నైపుణ్యాల పట్ల అవగాహన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు ఎలాంటి లక్ష్యాలను ఎంచుకోవటం, పరీక్షలకు సన్నద్ధత, లక్ష్యసాధనకు చేయాల్సిన కృషి, క్రమశిక్షణ, ప్రణాళికతో చేయాల్సిన అంశాలు. వాటిలోనే విద్యార్థులు తప్పటడుగు వేస్తున్నారు. జీవన నైపుణ్యాలతో విద్యావికాసం, సామాజిక అంశాలు, విలువలతో కూడిన విద్య, వ్యక్తిత్వ వికాసాలు అవగాహన కల్పించగలగాలి. విద్యార్థుల సామర్థ్య నిర్థారణ మేరకు, ఆసక్తి మేరకు బాల్యదశలోనే లక్ష్య నిర్థారణ చేసుకోవడం జరగాలి. ఆ లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి కావలసిన ఆత్మ విశ్వాసం, పట్టుదల, సాధించాలనే తపన కసి వారిలో ప్రేరణ కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్య దశలోనే గెలుపు ఓటములను సమంగా అనుభవించే విధంగా విద్యార్థులను రూపుదిద్దాలి. గెలుపును ఆస్వాదించడం, ఓటమిని తట్టుకోవడం ఎదుర్కొని మరలా గెలుపు కోసం ప్రయత్నించేలా బాల్యదశలోనే నేర్పించాలి.
అలనాటి నైతిక విలువలు ఉన్నాయా...
బాల్యం అంటే ఎంతో మధురమైనది. పాఠశాల మధురానుభవాలు జీవితాంతం మనతో పాటు పెనవేసుకున్న మరువలేని బంధాలు. ఒకప్పుడు పిల్లలు ఆడుతూ పాడుతూ చదివేవారు. ఐదేళలు వచ్చాకనే పెద్దబాలశిక్షతో పిల్లల చదువు మొదలయ్యేది. అక్షరాలు, గుణింతాలు, ఎక్కాలు, సుమతీ శతకాలు, పంచతంత్రం కథలు, రామాయణ, మహాభారత ఇతిహాసాలు, భాగవత పద్యాలతో నైతిక విలువలే పునాదులుగా పిల్లల చదువులు మొదలయ్యేవి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఐదో తరగతి వరకూ ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రకమైన సిలబస్‌తో పిల్లల చదువులు గుదిబండలా మారాయి. ఉపాధ్యాయుల ప్రాధాన్యత తగ్గి ఎలక్ట్రానిక్ వస్తువులతో పిల్లల అనుబంధం పెరిగిపోతోంది. విలువల మాటే అసలు పాఠశాలలో రావడమే లేదు. ప్రస్తుతం పిల్లల ఫీజును చూస్తే నర్సరీ పిల్లలకే లక్షలలో పాఠశాలలకు చెల్లించాల్సిన పరిస్థితి. ఇకపోతే పుస్తకాల బరువు మోతతో పిల్లల నడుములు వంగి పోతున్నాయి.
యంత్రాలు పిల్లలను శాసిస్తున్నాయి
యంత్రాలతో మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. వాడుకోవాల్సిన యంత్రాలను ప్రాణంగా ప్రేమించేస్తూ, ప్రేమించే మనుషులను సమయానికి వాడుకొని విసిరేసే స్థాయికి దిగజారి పోతున్నాం. పిల్లల ప్రవర్తనలో మార్పులు ప్రస్ఫుటంగా కనిపిస్తూన్నాయి. ఇంటికి ఎవరైనా వస్తే కనీసం ఒక్క మాటా, ముచ్చట లేదు. ఇంటికి వచ్చిన బంధువులను చూడకుండా చాలామంది పిల్లలు సెల్‌ఫోన్ చూస్తూనే గడిపేస్తున్నారు. ఇక పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లినా షరా మామూలే ఓ మూలన కూర్చొని మొబైల్‌లో ముఖంపెట్టి వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగ్‌లలో మునిగిపోతున్నారు. ఆటలు, పాటలు, ఆహ్లాదం, ఆనందం అంతా సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు. ప్రస్తుత పిల్లల మధ్య నైతిక విలువల సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.
ఐ.ఐ.టీ., మెడిసిన్ లు మాత్రమే చదువులా...
ప్రపంచంలో ఎక్కడాలేని విద్యావిధానం మన రాష్ట్రాలలో రాజ్యమేలుతోంది. రెండే కోర్సులు పిల్లలను శాసిస్తున్నాయి. ఇంజనీర్, డాక్టర్ వృత్తులలో మాత్రమే పిల్లలు రాణిస్తారా? ప్రపంచంలో వేరే ఇతర వృత్తులకు మన పిల్లలు పనికి రారా? హైస్కూల్ స్థాయిలోనే ఇంటర్మీడియట్ సిలబస్ బోధనతో పిల్లలను ఒత్తిడికి గురి చేయడం భావ్యమా... ఒత్తిడిని భరించలేని పిల్లలు బలవన్మరణాలతో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులూ విద్యాసంస్థలు ప్రభుత్వాలు ఆలోచించాలి.
సామాజిక చైతన్యం నేటి పిల్లలలో కరువవుతోంది
నేటి బాలలలో ప్రధానంగా లోపిస్తున్న అంశం సామాజిక చైతన్యం లేకపోవడం. సామాజిక అంశాల పట్ల సరైన అవగాహన కల్పించాలి. భవిష్యత్తు తరాలను శాసించే సామాజిక అంశాల పట్ల ఆసక్తి పెంపొందించాల్సిన అవసరాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి ఆ దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. హరిత హారం, స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలలో స్వచ్చంధంగా పిల్లలు పాల్గొనేటట్లుగా చొరవ చూపాలి. నీటిని పొదుపు గా వాడటం నేర్పించాలి.
విలువలు, వ్యక్తిత్వ వికాసానికి సరైన ప్రాధాన్యత
విద్యార్థి దశ నుండే వ్యక్తిత్వ వికాసానికి సరైన ప్రాధాన్యతను ఇవ్వాలి. కుటుంబం పట్ల గౌరవాన్ని కలిగించడం మరియు వారి బాధ్యతను తెలియచేస్తూ ఉండాలి, తనకు తానుగా పరిశుభ్రంగా ఉండటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. ప్రస్తుత పిల్లలు పెద్దల పట్ల వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. ఇతరులను, పెద్దలను గౌరవించడం పిల్లలు బాధ్యతగా గుర్తించాలి. జీవితం అంటే, సమయం విలువ, మంచిగా మనిషిగా జీవించాల్సిన ఆవశ్యకత, భావ వ్యక్తీకరణ, క్రమశిక్షణ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు, నాయకత్వం, మనిషి ప్రవర్తనలు మొదలగు అంశాల పట్ల బాల్యదశలోనే అవగాహన కల్పించాలి. విలువల విద్య ద్వారా పెద్దల మాటలను గౌరవించడం, ఉన్నతంగా జీవించడం, మానవతా విలువలను గుర్తించడం కావలసిన జ్ణానాన్ని బాల్యదశలోనే అందించాలి.
విద్యావంతులు, ఉద్యోగులే ఆత్మహత్యలకు పాల్పడితే...
విద్యావంతులై ఉండి, సివిల్ సర్వీసులు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ నిర్వహించే గ్రూప్ వంటి ఉన్నతమైన పోటీపరీక్షల్లో విజయం సాధించిన ఉద్యోగులలో కూడా మానసిక దౌర్బల్యం కన్పిస్తోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఉన్నతాధికారుల ఆత్మహత్యలు, వారిలోని జీవన నైపుణ్యాల అవగాహన కొరతయే ప్రధాన కారణం. ఆ లోటును పూరించాలంటే విద్యార్థి దశ నుంచే బాలబాలికల్లో జీవన నైపుణ్యాల పట్ల చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా వారిలో జీవననైపుణ్యాలు అలవడి ఆనందంగా జీవించేందుకు అవకాశం ఉంది.
ఇంటర్నల్ మార్కులు వేస్తున్నా...
విలువల విద్య - జీవన నైపుణ్యాలు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కరదీపికలు ప్రభుత్వ పాఠశాలలకు అందచేయడం జరిగింది. విలువల విద్య జీవన నైపుణ్యాలు బోధన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండటం హర్షణీయం. పదవతరగతిలో విలువల విద్య జీవన నైపుణ్యాలు కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేస్తున్నా, సరైన శిక్షకులు లేకపోవడంతో పూర్తి స్థాయిలో విద్యార్థులకు గుణాత్మకతను అందించ లేకపోతున్నారు.
శిక్షణా కార్యక్రమాలు
ప్రస్తుతం జీవన నైపుణ్యాల పై పాఠశాల దశ నుంచి ఇంజినీరింగ్, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే శిక్షకుల కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వమే చొరవ తీసుకుని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.
సూచనలు:
1.విద్యా బోధన పిల్లల సృజనాత్మకతను వెలికి తీసేవిధంగా ఉండాలి.
2. పిల్లలలో మానసిక పరిపక్వత వచ్చిన తదుపరి మాత్రమే పాఠశాలలో చేర్పించాలి.
3. పాఠ్యాంశాలతో పాటుగా విద్యార్థి సమగ్రాభివృద్దికి కో కరిక్యులర్ ఆక్టివిటీస్ సమ ప్రాధాన్యతను ఇవ్వాలి.
4. విద్యాబోధన విద్యార్థి కేంద్రంగా మాత్రమే జరుగాలి.
5.తాతయ్య,నానమ్మ, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బాబాయి మధ్య అల్లారుముద్దుగా, స్వేచ్చాయుత, ఆహ్లాదకరమైన పరిస్తితుల మద్య పెరిగిన పిల్లవాడిని ఒక క్రొత్త పరిస్థితులకు(పాఠశాలకు) పంపించే ముందుగా పిల్లవాడిలో పాఠశాల సన్నద్దత కల్పించాల్సిన అవసరం ఉంది.
6. ఆకర్షణీయమైన చిత్రాలతో, పచ్చని చెట్లతో, ఆటస్థలం, స్వేచ్చాయుత వాతవరణంలో ఇంటి పరిస్థితులు పిల్లవాడు మరచి పోయే విధంగా పాఠశాల పట్ల ఆసక్తి కలిగించే విధంగా పాఠశాల ఉండే విధంగా చూసుకోవాలి.
7. ప్రాథమిక స్తాయిలో పిల్లలకు ఆసక్తి ఉండే అభినయ గేయాలతో, చిత్రాల ద్వారా, ఆట, పాటలతో ఒత్తిడి లేని సహజసిద్దమైన రీతిలో విద్యాబోధన జరుగునట్లు చూడాలి.
8.చదువంటే పిల్లవాడికి గుదిబండలా మారకుండా నైతిక విలువలు, జీవననైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి.

-డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి 9703935321