బాబు హామీలు నెరవేరలేదు
Published Friday, 22 July 2016నర్సీపట్నం,జూలై 21: గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. గురువారం మండలంలోని ధర్మసాగరం గ్రామంలో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్ళి పార్టీ ఇచ్చిన 100 ప్రశ్నల కరపత్రాలను పంచిపెట్టారు. ఈకరప్రతాల్లో పేర్కొన్న హామీలు ఏ మేరకు అమలయ్యాయో అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేసారని మండిపడ్డారు. గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు మహిళలు గణేష్ దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటి పథకం ఉన్నా మరమ్మతులకు గురయ్యాయని, తమ వార్డులో రెండు బోర్లుండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాల పార్టీ అధ్యక్షులు రాయపురెడ్డి నాగేశ్వరరావు, రుత్తల సత్యనారాయణ, సుర్ల సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.